Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 25

Bhagavat Gita

10.25

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం {10.36}

జయోస్మి వ్యవసాయో అస్మి సత్త్వ౦ సత్త్వవతామహమ్

కపటుల జూదమును, తేజోవంతుల యొక్క తేజమును, జయశీలుర జయమును, ప్రయత్నమును, సాత్త్వికుల యొక్క సత్త్వగుణమును నేనే ఀ

జూదం ఆడేవారు తమ ఆడే విధానమును సమర్థించుకొంటారు. వారు అనేక పరాజయాల తరువాత విజయం పొందవచ్చు . కానీ అది క్షణికం. వారు నిజంగా వెతుకుతున్నది శాశ్వతమైన ఆనందం. అది తెలియక వారు తమ ఆస్తులను కూడా ఫణంగా పెట్టి తమ అలవాటును కొనసాగిస్తారు. వాళ్ళు తమ ఆనందానికి తప్పు త్రోవలో వెదుకుతున్నారు. ఒకమారు నా మరదలు ఇలా అడిగింది: "ఒకడు రాత్రి పూట ప్రక్క వీధిలో ఒక నాణెం పోగొట్టుకొన్నాడు. కాని దానిగురుంచి ఈ వీధిలో వెదుకుతున్నాడు. ఎందుకు?". ఎందుకంటే ఈ వీధిలో కాంతి ఉంది, ప్రక్క వీధిలో లేదు. జూదం ఆడేవాళ్ళ పరిస్థితి ఇదే. మనం కూడా ఆనందం కొరకు పెడత్రోవలు తొక్కుతా౦. చివరకు ఆనందం మనలోనే ఉందని గ్రహిస్తాం.

తరువాత శ్రీకృష్ణుడు వ్యవసాయ -- అనగా ప్రయత్నం -- గురించి చెప్పేడు. ఎక్కడైతే నిస్వార్థ సేవకై ఉత్సాహంతో పని చేస్తారో, అక్కడ భగవంతుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇది వక్రంగా చేసే ప్రయత్నానికి వర్తించదు. అంటే ప్రొద్దునే లేచి అర్థరాత్రి వరకు పనిచేసి, మరుసటి రెండు రోజులూ పడుక్కోవడం దేవునిచే ప్రభావితమైన ప్రయత్నం అనబడదు. కొందరు ఒక పని ప్రారంభించి కొన్నాళ్ళకు ఉత్సాహం కోల్పోయి వేరొక పని చెయ్యడం మొదలు పెడతారు. మరికొందరు ఆరు నూరైనా, నూరు ఆరైనా మిక్కిలి పట్టుదలతో పనులు చేస్తారు. అటువంటివారు ఏ రంగంలోనైనా విజయం పొందుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు జయోస్మి అంటాడు -- అనగా తాను విజయాన్ని అంటాడు. మహాత్మా గాంధీ "ఏ ఒక్కరైనా గట్టి ప్రయత్నం చేసి, సదా ఆశ, విశ్వాసాలతో ఉంటే నేను సాధించినది సాధించగలరు. సంపూర్ణమైన ప్రయత్నం, సంపూర్ణమైన విజయాన్నిస్తుంది" అని అన్నారు.

మనం ఆధ్యాత్మిక సాధనలో గట్టి ప్రయత్నం చేస్తే, క్రమంగా కుండలిని శక్తి ఆవిర్భవిస్తుంది. అలా కుండలిని శక్తి విడుదలైనవారు పట్టుదలతో, ఏకాగ్రతతో, ధృఢ నిశ్చయంతో, అజేయమై తమకు ఎటువంటి ఆటంకం వచ్చినా లక్ష్యాన్ని చేరుకొంటారు. యోగులు ఆ శక్తిని అగ్నితో పోలుస్తారు.

చివరకి సమాధి పొందినప్పుడు, ప్రతీదీ మారుతుంది. ఆ స్థితిలో ఉన్నవారు ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటారంటే మనం వారి శక్తి క్షీణించిందని తప్పుగా భావిస్తాం. వారి శక్తి క్షీణింపక, అనేక రెట్లు లేదా అపరిమితం అయ్యింది. కానీ అది వారి సంపూర్ణ స్వాధీనంలో ఉంది. ఇది ఎలాగంటే పాత కారులో రెండు క్రొత్త ఇంజిన్ లు పెట్టి నడిపినట్టు. కొందరు కుండలినిని కాంతి అంటారు. మూలాధార చక్రంనుంచి పైకి వెళుతున్నప్పుడు కుండలిని అగ్ని రూపంలో ఉంటుంది. అదే సహస్రార౦ చేరితే కాంతి రూపము దాల్చి మన చేతన మనస్సును ఆవరిస్తుంది. అప్పుడు దానిని తేజస్సు అంటారు. శ్రీకృష్ణుడు అదే అందరిలోనూ, సూర్యునిలోనూ, నక్షత్రాలలోనూ ఉన్నది అన్నాడు. కబీర్ ఇలా అన్నారు:

నా దేహంపై చంద్రుడు కాంతి ప్రసరిస్తున్నాడు

కానీ నా రెండు గ్రుడ్డి కళ్ళు దానిని చూడలేవు

చంద్రుడు నాలోనే ఉన్నాడు

అలాగే సూర్యుడు కూడా 261

No comments:

Post a Comment

Viveka Sloka 37 Tel Eng

Telugu English All స్వామిన్నమస్తే నతలోకబంధో కారుణ్యసింధో పతితం భవాబ్ధౌ । మాముద్ధరాత్మీయకటాక్షదృష్ట్యా ఋజ్వ్యాతికారుణ్యసు...