Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 43

Bhagavat Gita

2.44

నాస్తి బుద్ధి రయక్తస్య న చాయుక్తస్య భావనా {2.66}

న చా భావయత శ్శాంతి రశాంతస్య కుత స్సుఖమ్

యోగయుక్తుడు కానివానికి స్థిరబుద్ధి యుండదు. ఆత్మ భావనయు కలుగదు. ఆత్మ భావన లేనివానికి శాంతి లభించదు. శాంతి లేని వానికి సుఖము ఎట్లు కలుగును?

నియంత్రణలేని ఇంద్రియాలు ఒక కారు చక్రాలు నలుదిశలా పోతే ఎలాగ కారు నుడుస్తుందో, అలా మన దేహాన్ని, మనస్సును అతలాకుతలం చేస్తాయి. ధ్యానంతో వాటిని సరిచేయవచ్చు.

నాస్తి బుద్ధి రయక్తస్య న చాయుక్తస్య భావనా-- అంతర్గతంగా సఖ్యత లేకపోతే, కోరికలన్నీ ఒకే లక్ష్యం పై ఉన్నా, మనలోని సృజనాత్మక శక్తిని పొందలేము. ఒకడు చిత్రలేఖనం నేర్చుకోవాలంటే శిలలను చెక్కకూడదు. కొందరు "నేను లలిత కళలన్నీ అభ్యసించి చిత్రలేఖనం అప్పుడప్పుడు చేస్తాను" అని అనవచ్చు. శ్రీకృష్ణుడు మీకు చిత్రలేఖనం మీద అభిలాష ఉంటే దాని మీదే దృష్టిని కేంద్రీకరించండి అని చెప్తున్నాడు. న చా భావయత శ్శాంతిర్ -- నీ ఆలోచనలలో పొంతన లేకపోతే నీకు మనశ్శాంతి ఎక్కడిది? మనలో శాంతి లోపించి, ఎక్కడికి వెళ్ళినా, ఎంత ఆస్తి ఉన్నా అంతర్గతంలో యుద్ధాలు చెలరేగుతూ ఉంటే, భద్రత పొందలేము. అశాంతస్య కుత స్సుఖమ్ -- మనకు మనశ్శాంతి లేక ఆనందం ఎలా కలుగుతుంది? ధ్యానము, ఆధ్యాత్మిక సాధన మనలను ఆనంద సాగరంలో తడపడానికే. మొదట్లో వాటి మీద అనుమానముండడం సహజం. "రోజూ ఉదయాన్నే లేచి, మితంగా భుజించి, ఇతరులను మనకన్నా ముఖ్యులుగా తలంచడ౦లో కలిగే సుఖమేమిటి?" అని అడగవచ్చు. అటువంటి క్రమశిక్షణ రోత కలిగించవచ్చు. కానీ ధ్యానం యొక్క లక్ష్యం సంపూర్ణమైన ఆనందం పొంది, మనలోని శక్తులను మేల్కొలిపి వాటిని సత్కర్మలకై వినియోగించడం.

భక్తి యోగము, అనగా సద్భక్తితో నిస్వార్థ ప్రేమతో కూడి ఉండడం, మనలో చాలా మందికి అంతర్గత సామారస్య౦ కలిగిస్తుంది. ఇదే ధ్యానం యొక్క పరాకాష్ఠ. నన్ను కొందరు "నాలో ఉన్న భక్తి భావాన్ని ఇంకా లోతుగా ఎలా చేసికోగలను?" అని అడుగుతారు. నేను చెప్పేది: మన కోరికలను సమైక్యత చేసి, క్రమశిక్షణతో ధ్యానం చేస్తే, మన౦దరిలోని దేవుడ్ని దర్శించవచ్చు.

ఒకరోజు నేను చూసిన సినిమాలో భక్తులు ఒక తాడుతో చేసిన వంతెనను దాట వలసి వచ్చింది. వారు ఆ వంతెన మీద ఉన్నంత సేపు రామ నామము స్మరించేరు. కానీ ఆవల వొడ్డు చేరగానే కామా, కామా అని జపం చేస్తారేమోనని అనిపించింది. మన జీవితం అల్లకల్లోలంగా ఉన్నప్పుడు మనకు దైవ ప్రార్థన గుర్తుకు వస్తుంది. అదే సుఖ సంతోషాలతో, రాబడితో, మంచి ఆరోగ్యంతో ఉంటే దేవుని మర్చిపోతాం.

ఎప్పుడైతే కష్టాలు వస్తాయో అవి దేవుడు ఇచ్చే "నన్ను మరచిపోవద్దు" అనే సూచనలు. మనకు ఆహ్లాదం కలిగినప్పుడు దేవునికి ధన్యవాదాలు తెలుపుకోవాలి. అలాగే మనకి కష్టాలు --భౌతిక సమస్యలు, మానసిక ఒత్తిడి, నష్టం -- కలిగినప్పుడు కూడా దేవునికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. ఎందుకంటే అవి మన దృష్టిని దేవుని యందు నిలుపుతాయి.

దేవుని పైన ప్రేమ ఎలాగుండాలంటే: ఒక పిసినివాడు తన బంగారాన్ని ఎలా ప్రేమిస్తాడో, ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో, ఒక ప్రియుడు తన ప్రేయసిని ఎలా ప్రేమిస్తాడో, వాటినన్నిటినీ కలుపుకొన్నట్టు ఉండాలి అని శ్రీరామకృష్ణ అంటారు. మనలో చాలామందికి అపరిమితమైన ప్రేమ ఉండి, దాన్ని లెక్కలేని విషయాల మీద ప్రసరింప జేస్తాం. అలా కాక దృష్టిని కేంద్రీకరించి, ఇతరుల సౌఖ్యమే మనదిగా భావించి, భక్తిభావంతో ఉంటే మంచి సాధన చేస్తున్నట్టు. నేటి ప్రపంచంలో ఒక అవతార పురుషుడు దేవుని అంశని అంగీకరించరు . అలాగే సంపూర్ణమైన ప్రేమతో, విశ్వాసంతో భక్తిని లేదా బంధాలలో నిస్వార్థమైన ప్రేమను పెంపొందించుకోవచ్చు అని చెప్తే నమ్మరు.

మనలో చాలామందికి ఏ దేవుని అవతారాన్ని పూజించాలో తెలీదు. నేను ఆ అవతారం మిమ్మల్ని ఎన్నిక చేసికోమని చెప్తాను. దేవగణాన్ని అంతా విశ్లేషించేకంటే "నేను మీ పాదాల వద్ద ఉన్నాను. నేను చాలా దుస్థితిలో ఉన్నాను. మీకు భారంగా ఉన్నాను. మీలో ఏ ఒక్కరైనా నా యందు దయచూపి రక్షించరా?" అని ప్రార్థించడం ఉత్తమం. దీన్నే యోగులు సంపూర్ణ శరణాగతి అంటారు.

మంత్ర జపంతో మనను ఉద్దరించుకోలేని దుస్థితిలో ఉంటే దేవుని కాపాడమనే ప్రార్థన చేస్తున్నాము. ఇటువంటి విశ్వాసముంటే చాలు దేవుని దయ మనయందు తప్పక ఉంటుంది. అదే దేవుని కృప. ఆయన ఆగమనం వలన మనలోని దుస్స౦స్కారాలు పలాయన మౌతాయి. దైవానుగ్రహము మనం సంపూర్ణమైన భక్తి కలిగియున్నా, కొన్ని తప్పులు చేస్తూ మన ప్రయత్నం చిత్త శుద్ధితో చేస్తున్నా, కలుగకపోవచ్చు. 132

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...