Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 9

Bhagavat Gita

3.9

ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్య౦తే యజ్ఞభావితాః {3.12}

తైర్దత్తా న ప్రదాయైభ్యో యో భుంక్తేస్తేన ఏవ సః

యజ్ఞములచే తృప్తిచెందిన దేవతలు మీకు ఇష్టములైన భోగములను అనుగ్రహింతురు. వారిచ్చిన భోగములను వారికి సమర్పించక భుజించవాడు చోరుడగును

యజ్ఞ శిష్టాశిన స్స౦తో ముచ్యన్తే సర్వ కిల్బిషైః {3.13}

తే త్వఘం భుంజతే పాపా యే పచ౦ త్యాత్మకారణాత్

యజ్ఞ శేషమును భుజించు సత్పురుషులు సర్వ పాపముల నుండి విముక్తి నొందుచున్నారు. ఎవరు తమ కొరకే వండు కొనుచున్నారో వారు పాపమునే భుజించుచున్నారు

శ్రీకృష్ణుడు ఎవరైతే, పరోపకారము చెయ్యకుండా, తమ ఆనందానికై, లాభానికై, లేదా పేరుప్రతిష్ఠలకై ప్రాకులాడుతారో వారిని స్తేన -- అనగా దొంగలు-- అంటున్నాడు. మనం చేసే కర్మలకు అతి గొప్ప కారణ౦: పరులకు చేసే సేవ. అందుకే దేవుడు మనకు జీవితం, సమయం, శక్తినిచ్చేడు.

నాలుక రుచికై తినడం, హోటల్ లలో తరచూ భోజనం చెయ్యడం, కనీవినీ ఎరుగని పదార్థాలు తినడం ఉత్తమం కాదు. సాత్త్వికమైన పోషకాహారము వండి, ప్రేమతో ఇవ్వబడినదైతే మన దేహాన్ని, మనస్సుని బలంగా చేస్తుంది. ఇది సాధనకు చాలా అవసరం.

పోషకాహారాన్ని తినడం తప్పు కాదు. కానీ దాన్ని అదే పనిగా తినక్కరలేదు. ధ్యానంలో మన మనస్సు చిరు తిండ్ల మీదకు పోతే అది విచారకరం. అలాగే తిండిగూర్చి సదా ఆలోచిస్తూ ఉండడం మంచిది కాదు. చైనా దేశస్థుడు హుయా౦గ్ పో ఇలా అన్నారు: "భోజనం రెండు రకాలు: ఇంద్రియాలను మెప్పించేది లేదా జ్ఞానాన్ని పెంపొందించేది. దేహానికి ఆకలి కలిగితే, ఆశతో కాక, మితంగా తింటే అది జ్ఞానాన్ని పెంచేది. కానీ అదే పనిగా ఆహారాన్ని తింటూ ఉండడం మంచిది కాదు. కేవలం నాలుక కోరేదాన్ని తినడం ఇంద్రియాలను మెప్పించే తిండి".

మనము ఆహారం ద్వారా పొందే శక్తిని ఎలాగ ఉపయోగిస్తున్నామో కూడా ముఖ్యం. జీసస్ ఫారిసీస్ కు ఇలాగ బోధించేరు: "నోటిలో పెట్టుకునేది మనల్ని అపవిత్రులను చెయ్యదు; నోటి నుంచి బయటకు వచ్చేది మనకు ముప్పు తెస్తుంది." ఎంతో ఖరీదు పెట్టి రసాయనాలతో పండించని ఆహారం తింటూ కూడా, మన౦ హింస చేస్తూ; ద్వేషం, అసూయ వంటి గుణాలతో ఉంటే ఏమి లాభం? అదే మన శక్తితో దీనుల కన్నీళ్ళు తుడిచివేసి, పరోపకారం చేస్తే మన కళ్ళు వికసించి, మన జీవితం కష్టాలతో నిండి ఉన్న ప్రపంచానికి మార్గదర్శక మవుతుంది 164

No comments:

Post a Comment

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...