Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 17

Bhagavat Gita

4.17

నిరాశీ ర్యత విత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహః {4.21}

శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్భిషమ్

ఆశలేనివాడు, ఇంద్రియమనస్సులను వశపరచుకొనినవాడు, అన్నిటి యందు మమతను విడిచినవాడు, కేవలం దేహము కొరకు కర్మ లాచరించినను పాపము నొందడు. ఀ

శ్రీకృష్ణుడు నిరాశీ -- అనగా ఎటువంటి ఆపేక్ష లేకుండా ఉండడం -- అనే పదాన్ని వాడేడు. మనము ఆపేక్ష లేనిదే ఒక లక్ష్యాన్ని చేరలేమని భావించవచ్చు. కానీ మనం కోరేది మనల్ని బంధీగా చేస్తుంది. జీవితం స్వతంత్రతతో గడపాలంటే ఆపేక్ష ఉండకూడదు.

భగవంతుని అడుక్కొన్న మాత్రాన ఏమీ ఫలం లేదు. "నాకు ఏమీ వద్దు. నువ్వు నాకు అపజయాన్ని ఇస్తే, నేను భయపడను. లేదా విజయాన్నిస్తే వద్దనను" అని అనుకునేవిధంగా మనముండాలి. మనలో ప్రతిష్ఠితమైన దేవుని గూర్చి తెలిసినవారు ఆ ఎత్తుకి ఎదగగలరు. జయాపజయాలను వీడి స్వతంత్రంగా బ్రతకగలరు.

ఆపేక్ష ఉన్నవారికి నిరాశ తప్పకుండా కలుగుతుంది. మనము ఎల్లప్పుడు ఆందోళన లేకుండా ఉండాలంటే, ఒక పనిని చేసి "ఇది నన్ను మీదకి ఎత్తుతుందా? ఇది నన్ను చరిత్రలో చిరస్మరణీయునిగా చేస్తుందా? దీనివలన డబ్బు, దస్కం వస్తాయా?" అని అడగకూడదు. సదా అంతర్గతంలో ఉన్న దేవుని నమ్మి ఉంటే, మన ఆధ్యాత్మిక సాధనకు కావలసినవి అతడే ఇస్తాడు.

ధ్యానం ద్వారా మన మనస్సుకి, దేహానికి మన మాట వినేటట్లు తర్ఫీదు ఇస్తున్నాము. మొదట్లో ధ్యానం మగతను తెప్పించవచ్చు. అలాటప్పుడు వెన్నుముకను నిటారుగా పెట్టి కూర్చోవాలి.

దేహం స్వాధీనంలో ఉన్నా మనస్సును నిశ్చలం చేసికోవడం చాలా దుర్లభం. బుద్ధుడు క్రమ శిక్షణ లేని మనస్సు కన్న అవిధేయమైనదేదీ లేదు, అని చెప్పెను. మనం ఏమి తలచకూడదనుకున్నామో దానినే మనస్సు తలుస్తుంది. మన౦ ద్వేష పూరిత ఆలోచనలు ఉండకూడదని అనుకొంటాం. కానీ మనస్సు ఆ విధంగానే ఆలోచిస్తుంది.

ధ్యానం చేస్తున్నప్పుడు మనస్సు పరిపరి విధాల పోతుంది. మొదట్లో మనస్సును విషయాలనుంచి వెనక్కి లాగుకోవడమే చేస్తాము. ఒక గంట ధ్యానం చేస్తే అందులో ఎక్కువ భాగం మనస్సును స్వాధీనంలో పెట్టుకోవడానికే సరిపోతుంది. కానీ అలా ఓపిగ్గా సాధన దేవుని పొందాలనే భావంతో చేస్తే దానిలో ఎంతో సంతృప్తి ఉంటుంది.

త్యక్తసర్వపరిగ్రహ -- అంటే శ్రీకృష్ణుడు "నీవు దేనికీ యాజమానివి కావు. నేనే సమస్త సృష్టికి యజమానిని. ఇది నాది అనే భావన లేకుండా చేసుకో. " అని చెప్తున్నాడు. మన౦ వైరాగ్యం లేనిదే వస్తువులని సక్రమంగా వాడలేము. ఒకనికి డబ్బుపై మోహముండచ్చు. కానీ అతనికి డబ్బును ఎలా వాడాలో తెలియదు. కొందరు ధనవంతులు తమ సంపదను ఇతరులకై, తమకై ఎలా వాడుకోవాలో తెలీక ఉంటారు. అలాగని ఉన్నదంతా ఊడ్చుకొని ఇచ్చేయమని అనటంలేదు. శ్రీకృష్ణుడు మనకి డబ్బుతో, వస్తువులతో తాదాత్మ్యం చెందవద్దని బోధిస్తున్నాడు. ఒక ధనవంతుడు రాజ భవనంలో నివసిస్తూ వైరాగ్యం చెంది యుండగా, ఒక బీదవాడు తన గుడిసెతో తాదాత్మ్యం చెంది మిక్కిలి అహంకారిగా ఉండవచ్చు.

ఆధ్యాత్మిక సాధన అంటే మనకు కావలసిన వసతులు, జీవితాని కవసరమైన వస్తువులూ లేకుండా బ్రతకడం కాదు. ఒక పస్తులు౦డే పేదవాడు, సహజంగా దేవుని గూర్చికాక, తిండికై ఆలోచిస్తాడు. కాబట్టి ఆడంబరాలు, వస్తువులను పోగుచేసికోవడం తదితర స్వార్థ పూరిత కర్మలు చేయకుండా ఉండాలి.

ఎవరైతే ఆపేక్ష లేకుండా, ఎటువ౦టి పరిస్థితినైనా ఎదుర్కొనే సాహసం కలిగి, స్వార్థ పూరిత కామం వస్తువుల యందు లేదా మనుష్యులయందు లేకుండా, తమ దేహాన్ని పరోపకారము చేసే దేవుని పనిముట్టుగా భావిస్తారో అట్టి వారు కర్మలు చెయ్యరు. దేవుడే వారిద్వారా కర్మలు చేయిస్తాడు. శ్రీకృష్ణుడు "వారు చెయ్యి ఎత్తితే, వారు చేయటం లేదు. అది నేనే చేయిస్తున్నాను" అంటాడు. అట్టివారు ఏమి చేసినా దానికి ఉత్తర్వులు వారిలో ప్రతిష్ఠితమైన దేవుని వద్ద నుంచి వస్తున్నాయి. పైపైగా జీవించక, అంతర్గతమైన దేవుని ద్వారా కర్మలు చేస్తారు. అందువలన వారిలో ఒత్తిడి, అలసట, భయం లేదు. అతి క్లిష్టపరిస్థితిలోనూ వారి సృజనాత్మక శక్తి పని చేస్తూ ఉంటుంది. 260

No comments:

Post a Comment

PPP in Andhra means Prostrate Pray Physicians

Recently there has been much debate about the PPP. If we ask google what is PPP, we will be informed: Purchasing Power Parity, Private Pu...