Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 2

Bhagavat Gita

2.2

కుతస్త్వా కశ్మల మిదం విషమే సముపస్థితం {2.2}

అనార్యజుష్ట మస్వర్గ్య మకీర్తికర మర్జున

అర్జునా! ఆర్యులకు తగనిదియు, స్వర్గమునకు వ్యతిరేక మైనదియు, అపకీర్తి నొసగు నదియునగు ఈ అజ్ఞానము ఈ విషమ సమయమున నీకెట్లు ప్రాప్తి౦చినది?

శ్రీకృష్ణుడు మమకారంతో, స్వీయ జాలితో కుప్పకూలిన అర్జునుని చూచి, "నీకు ఈ నిరాశ, విచారం ఎక్కడినుంచి వచ్చేయి అర్జునా? వీటిని తొలగించుకో. నీ హృదయంలో ఉండే నేను వాటితో కలసి ఉండలేను" అని చెప్పెను.

శ్రీకృష్ణుడు ఇక్కడ అనార్య అనే పదాన్ని ప్రయోగించేడు. దాని అర్థం తగనిది లేదా అయోగ్యమైనది. ఇక్కడ అర్జునుని నడవడిక అయోగ్యమైనది. మనము జంతువులనుండి పరిణామం చెంది మానవులమైనాము. మనను జంతువులనుండి వేరు చేసే గుణ౦: మన స్వార్థంతో కూడిన కోర్కెలను విడచి, పరోపకారము చేసి ఇతరులకు ఆనందం కలిగించడం.

నేను కాలేజీలో చదువుతున్నప్పుడు నా ఆధ్యాత్మిక గురువు ఇంట్లో మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతున్నాను. నా గురువుకి ఒక గోశాల ఉంది. అక్కడున్న ఆవులు ఆవిడకు కావలసిన పాలు, వెన్న, పెరుగు ఇస్తాయి. ఆమె రోజూ ఆ గోశాలను శుభ్రం చేసి ఆవులకు గడ్డి, కుడితి ఇస్తూ ఉంటుంది. నా మిత్రులలో ఒకడు అది చూసి హేళన చేసేడు. వాడి మాటలు విన్న నా గురువు వాడి దగ్గరకు వచ్చి "నువ్వా గోశాల లోపలికి వెళ్ళు. నీ చోటు అక్కడే. నేను రోజూ నీకు గడ్డి, కుడితి ఇస్తాను" అని అన్నది. ఈ విధంగా కఠినంగా మాట్లాడితేనే గానీ ప్రేమించిన వారు దారికి రారు.

మనము సూటూ, బూటూ వేసుకొని తిరిగినంత మాత్రాన మనుష్యుల మవ్వలేదు. నిజమైన మానవత్వం మన స్వార్థాన్ని విస్మరి౦చి, మనను ద్వేషించినవారిని క్షమి౦చడం వంటి సద్గుణాలు కలిగి ఉండడం.

ఇక్కడ శ్రీకృష్ణుడు అస్వర్గ్య అనే పదాన్ని వాడుతాడు. అంటే "అహంకారాన్ని వీడక, స్వచ్ఛంద భావాలను విస్మరించక, ఎడబాటు కోరుతూ నీలోని స్వర్గం యొక్క తలుపులను బంధించేవు" అని అన్నాడు. ఈ విధంగా శ్రీకృష్ణుడు తామసంతో, భయంతో, విచారంతో ఉన్న అర్జునునుని మేల్కొల్పేడు. 51

Eknath Gita Chapter 2 Section 1

Bhagavat Gita

2.1

తం తథా కృపయా విష్ట మశ్రుపూర్ణాకులేక్షణమ్ {2.1}

విషీదంత మిదం వాక్య మువాచ మధుసూదనః

ఈ ప్రకారము కరుణచే ఆవేశింపబడి, కన్నీరు కార్చుచు వ్యాకులమైన దృష్టిని కలిగియున్న అర్జునునితో మధుసూదనుడు డిట్లు పలుకసాగెను

అర్జునుడు మమకారముతో ఇతరులు తనకు చేయబోయే హాని గురించి తలచుచున్నాడే గాని, వేరే కారణం వలన కాదు. శ్రీకృష్ణుడు అటువంటి స్థితిలోనున్న అర్జునునిపై మిక్కిలి కఠినముగా స్పందించబోతాడు. ఒక మంచి ఆధ్యాత్మిక గురువు శ్రీకృష్ణునివలె మమకారముతో ఉన్న శిష్యుని మందలిస్తాడు. అలాగే సమయం వచ్చినపుడు తన శిష్యుని సున్నితంగా, దయతో, మంచి మాటలతో బుజ్జగిస్తాడు.

నా ఆధ్యాత్మిక గురువైన అమ్మను నేను ఇతరులు నన్నెందుకు బాధ పెడుతున్నారని ఏడుస్తూ అడిగేను. ఆమె సాధారణంగా సౌమ్యంగా ఉంటుంది. అవసరమైతే కఠినంగా ఉండగలదు. ఈ మారు ఆమె సౌమ్యంగా స్పందించి నేను నాపై ఉన్న జాలితో ఏడుస్తున్నాను గాని వేరే కారణం వలన కాదని మందలించింది. మనం ఇతరుల గూర్చి బాధపడితే అది దుఃఖం. అది మన మానసిక స్థితిని వృద్ధిచేస్తుంది. కానీ మన మీద మనం జాలి పడితే దౌర్భల్య౦ కలుగజేస్తుంది.

ఒక ఎనుము బురద గుంట కనిపిస్తే అందులో పొరలి ఒళ్ళంతా బురదతో రాసుకుంటుంది. అలాగే అర్జునుని మమకారం కూడా పిరికితనము అతనికి ఆపాదించింది. దాన్ని శ్రీకృష్ణుడు ఖండించ బోతాడు. మనము తలిదండ్రులు మనను కఠిన౦గా మందలించనపుడు వాడిన మాటలు, సహధర్మచారిణి కోపంతో పలికిన పలుకులు, కొన్నేళ్ళ తరువాత గుర్తుకుతెచ్చుకొని బాధ పడుతూ ఉంటాము. ఇది తగని పని.

అర్జునుడు ఒక చిన్న పిల్లవాడి వలె తనపైనున్న జాలితో కన్నీరు కారుస్తూ ఏదీ స్పష్టంగా చూడలేక పోతున్నాడు. మనము మనపై జాలితో ఉన్నప్పుడు మన బంధుమిత్రులను క్రూరులుగాను, మనల్ని బాధ పెట్టే వారలగాను-- వారు నిజంగా అలాంటి వారు కాకపోయినా-- తలుస్తాము. ఎందుకంటే స్వీయ జాలి మన మనస్సులో వికల్పం కలిగించి ఏదీ స్పష్టంగా కనపడకుండా చేస్తుంది.

పరిస్థితి విషమించక ముందే విచారంతో ఉన్న అర్జునుని ఇప్పుడు శ్రీకృష్ణుడు మందలించ వలసిందే. ఈ విధంగా శ్రీకృష్ణుడు వానిపై ఉన్న ప్రేమను ప్రకటించగలడు. 49

Eknath Gita Chapter 1 Section 12

Bhagavat Gita

1.12

సంజయ ఉవాచ:

{1.47}
ఏవముక్త్వార్జున స్స౦ఖ్యే రథోపస్థ ఉపావిశత్

విసృజ్య సశరం చాపం శోక సంవిగ్న మానసః

అర్జునుడు ఈ విధముగ పలికి దుఃఖము చేత చలించిన చిత్తము గలవాడై, ధనుర్బాణములను వదలిపెట్టి రణరంగమునందు రథము మీద కూర్చొనెను

మనలోని పరమాత్మని గుర్తించడమే మన జీవిత లక్ష్యం. మనలో చాలామందికి బాధ, దుఃఖం వలన జీవితంలో ఎదుగుదల కలుగుతుంది. అది ఎలాగంటే ఒక పిల్లవాడు అడుగులు వెయ్యడానికై క్రింద పడీ, లేచినట్లు. చాలామంది యోగులు జీవితం చేసే సవాళ్లను ఎదుర్కొని, విజయం పొందేరు. స్వామి రామదాసు సవాళ్లను ఎదుర్కోవడం గురించి ఇలా అన్నారు:

"మనస్సు మీద విజయం పొందడం అంత ఆనందం ఇంకే విజయానికి వచ్చిన ఆనందానికి సరి తూగదు. ఎవరైతే తమకు కలిగే గాఢమైన కోర్కెలను, తద్వారా కలిగే హింసాత్మకమైన చర్యలను, అరికట్టగలరో వారే నిజమైన యోధులు. భౌతిక ప్రపంచంలోని సమస్యలన్నీ మనస్సులో కలిగే అలజడుల వలననే. కాబట్టి సత్యమునెరిగి మనస్సును జయించుట నిజమైన విజయము. దానివలన వ్యష్ఠి, సమిష్ఠిలలో సామరస్యం, శాంతి కలుగుతాయి. బయటకాక మనస్సుతో పోరాడేవాడే నిజమైన సైనికుడు"

ధ్యానం వలన ఇతరులతో పోరుకై ఉన్న కలహశీలతను నియంత్రించి దానిని మన స్వచ్ఛంద భావాలను, వేర్పాటును తగ్గించుకోవడానికి వ్యచ్చిస్తాము. ఇది సర్వ కాల, సర్వావస్థలలో కొన్నేళ్ళు సాధన చేస్తే ఆశించిన శాంతి కలుగుతుంది.

ప్రతి ఉదయం ధ్యానం చేస్తే రోజల్లా మన అసహనంతో, లేమితో, ద్వేషంతో పోరాడడానికి కావలసిన రక్షణ కవచం ధరిస్తాము. ఇతరులకు మనకన్నా ఎక్కువ ప్రాముఖ్యత నివ్వడం కొంత కష్టమే. కానీ రాత్రి పడుక్కునే ముందు మనమెంతో కొంత కుటుంబం, సమాజం యొక్క మేలుకై, ఆనందానికై, మనము దుఃఖాన్ని అనుభవించినా, వాటికై పాటు పడ్డామన్న భావన ఆనందాన్నిస్తుంది. చాలామార్లు ఇతరులకు బాధ కలుగకుండా ఉండాలంటే మనమే బాధలు పడి, అర్జునుని లాగ "నేను యుద్ధము చెయ్యను, చెయ్యలేను" అని అనుకొంటాం.

దేవుని కరుణ, సహాయం లేనిదే మనకు ఏదీ సాధ్యం కాదు. శ్రీకృష్ణుడు మనమెన్ని తప్పులు చేసినా ఆత్మ పరిశుద్ధమై, నిష్కళంకమై, ఉంటుందని చెప్పి మనను కర్మలు చేయుటకు ప్రోత్సాహిస్తాడు. అవిద్యతో మనమెన్నో తప్పులు చేసి ఇతరులను లేదా మనలను ఎంతో బాధ పెట్టి ఉండవచ్చు. మనలోని ప్రేమ పూరితుడైన దేవునికి దాసోహం అయితే అతను మనల్ని రక్షిస్తాడు. అప్పుడు అహంకారమనే ముసుగుని తొలగించి ధ్యానంలో ప్రవేశించి, ప్రపంచానికి శాంతి, భద్రత కలిగించుటకై ప్రయత్నించవచ్చు. 47

Eknath Gita Chapter 1 Section 11

Bhagavat Gita

1.11

యది మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః {1.46}

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్

ప్రతీకారము చేయక, ఆయుధములను పట్టిన నన్ను, శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్దమునందు చంపుదురేని అదియును నాకు క్షేమకరమే కాగలదు

నా ప్రథమ ఆధ్యాత్మిక గురువైన నా అమ్మమ్మకి చదవడం, వ్రాయడం రాదు. కానీ ఆమె గీత సందేశాన్ని అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పింది. జీవితం ఒక రణరంగం. మనకి ఇష్టమైనా, లేకున్నా మనం పుట్టింది రణం చెయ్యాడానికే. మనకు వేరే మార్గం లేదు. కానీ మనకు కావలసిన ఆయుధం, ప్రత్యర్థిని ఎన్నిక చేసికోవచ్చు. మనను ప్రేమించే వారితో పోరు చేస్తే మనం గెలవలేము. అలాగే మనలోని స్వార్థంతో, క్రోధంతో పోరు చేసి గెలవగలం. శ్రీకృష్ణుని నమ్మి ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశిస్తే గెలుపు తప్పక వస్తుంది.

మనం ఇతరులతో యుద్ధాలు చేస్తే అది వారికి బాధ కలిగించవచ్చు. కానీ మనలోని దుర్గుణాలతో పోరాడితే మనం అందరికి ఉపయోగ పడతాం. ఇదే మన మత గ్రంథాలు ఇచ్చే సందేశం. మనం గ్రంథాలను చదివేవారిని, వాటిలోని విషయాలను వల్లించేవారిని గొప్పగా చూడకపోవచ్చు. ఎవరైతే తమను బాధ పెట్టినవారిని క్షమిస్తారో, పేరు ప్రతిష్ఠలను కాంక్షించరో, పరోపకారానికై జీవిస్తారో వారిని తప్పక గౌరవిస్తాము. మన స్మృతులలో ఇలా చెప్పబడినది: ఎవరైతే క్రోధాన్ని వీడుతారో వారు పెద్ద యోధులకన్నా గొప్పవారు.

ఈ రోజుల్లో క్రోధం సమంగా సంభాషించడానికి అవసరమని తలుస్తారు. మనలో క్రోధాన్ని ప్రదర్శించడానికై అనేక సదస్సులు, అభిప్రాయ వేదికలు ఉన్నాయి. అలాచేసి మనం క్రోధాన్ని ఇంటిలోకి, సమాజంలోకి ఆహ్వానిస్తున్నాము. అలాగే క్రోధంతో నిండి ఉన్న పుస్తకాలు, నాటకాలు, సినిమాలు ఉన్నాయి. వాటిని అనుకరించి కొందరు బాధ కలిగించే విమర్శాస్త్రాలను ప్రయోగిస్తారు. అట్టివారలు మనమీద దాడి చేస్తే, వారిని సహనంతో, ప్రేమతో వారు చెప్పినది వింటే సరిపోతుంది.

సహనం, ఒకరికి అన్నివేళలా బలమైన దన్ను ఇస్తూ ఉండడం ధ్యానం చేసేవారికి అందుబాటులో ఉన్నాయి. అందుకై మనము నిస్వార్థతని అలవాటు చేసికోవాలి. మనలో స్వార్థంతో బ్రతక కుండా ఉండగలిగే శక్తి ఉందని చాలామందికి తెలియదు. తాము ధైర్యములేక, వేర్పాటుతో ఉ౦డి, బలం లేక పరోపకారము చెయ్యలేమని తలుస్తారు. కానీ మనము శ్రీకృష్ణుని బోధను పూర్తిగా విని, జీర్ణించుకొని, ఆచరణలో పెట్టగలిగితే మనలోని నిజమైన శక్తిని విడుదల చేసి, పరులకు ఉపయోగపడేలా బ్రతకవచ్చు. 44

Eknath Gita Chapter 1 Section 10

Bhagavat Gita

1.10

అహో బత మా మప్రతీకార మశస్త్రం శస్త్రపాణయః {1.45}

ధార్తరాష్ట్రా రణే హన్యుస్తన్మే క్షేమతరం భవేత్

ప్రతీకారము చేయక, ఆయుధములు పట్టని నన్ను, శస్త్రధారులైన దుర్యోధనాదులు యుద్ధమునందు చంపుదురేని అదియును నాకు క్షేమకరమే కాగలదు

అర్జునుడు మనకు కలిగే అభద్రత, బంధుమిత్రులతో వచ్చే కలహాల గూర్చి విపులంగా చెప్తున్నాడు. అతను శ్రీకృష్ణునితో జీవైక్య౦ మనస్సులో పెట్టుకోకపోతే దాని పర్యావసానము ఎటువంటిదో చెప్పేడు. మన స్వంత ఆనందానికై బంధుమిత్రుల యొక్క, సమాజం యొక్క, పర్యావరణము యొక్క క్షేమాన్ని మనం విస్మరిస్తున్నాము. అర్జునుని కాలంలో రాజ్యమునకై ఆశ ఉంటే, నేటి కాలంలో పెద్ద జీతం, గొప్ప ఇల్లు, మనతో సదా అంగీకరించే సహధర్మచారిణి మొదలగువాటికై ఆశ పడతాం. మనం మన దేహమనే రాజ్యానికి రాజుగా భావిస్తున్నంత కాలం, మనలోని దేవుని గుడి తలుపు మూసివేసి, గందరగోళంతో బ్రతుకుతాము.

శ్రీరామకృష్ణ శ్రీరాముడు మనలో ప్రతిష్టింపబడాలంటే కామాన్ని వదులుకోవాలి అని చెప్పెను. ఆనందానికై మనకెంత ఆశ అంటే, ఏనుగు కడుపు ఒక వేరుశెనగ గింజతో నిండుతుందని భావించేటంత.

ఆంగ్ల యోగి విలియం లా ఇట్లు చెప్పెను:

ఇంద్రియ సుఖాలకై, కోరికలకు బానిసై బ్రతికే జీవి కలగంటున్నాడు అనవచ్చును. కల అంతమైతే ఏమీ నష్టం లేదు. కానీ జీవితమనే కల మరణంతో అంతమైతే మన మెందుకైతే భూమి మీద పుట్టేమో తెలిసికోకుండా పోతాము

ఒక నిస్వార్థమైన జీవితాన్ని గడిపే యోగిని చూడలేనంత కాలం, మనం మన స్వచ్ఛంద భావాలను వదులుకోవచ్చు అ౦టే నమ్మం. కానీ వేల యోగులు ధ్యానము ద్వారా మార్గదర్శకులై ఉన్నారు. మహాత్మా గాంధీ అటువంటి ఒక యోగి. ఆయన తన బాగును చూసుకోక, కోట్ల ప్రజలను బానిసత్వ౦నుండి, దుఃఖం నుండి విముక్తిచేసారు. భారతదేశం అవతరించక ముందు, దేశానికి పడమర నున్న యోధుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ యొక్క స్వతంత్ర పోరాటం హింసతో కూడినదని చెప్పి, ఆయన మనస్సు మార్చి, ఆయనను తన శిష్యునిగా చేసికొన్నారు. ఆయననే ఫ్రా౦టియర్ గాంధీ అని పిలుస్తారు.

ఇంట్లో, సమాజంలో, దేశాల మధ్య జరుగుతున్న హింసను ఏ ఒక్కడు ఎదుర్కొన్నా అతడు తక్కిన వారలకు స్పూర్తినిస్తాడు. జీసస్ చెప్పిన బోధ పుస్తకాలవరకే, బుద్ధుని పేరు స్తూపాలపై చెక్కడం వరకే, గీతని తాళపత్రాలలో వ్రాయుటవరకే పరిమితం కాదు. ఎవరైతే వారి బోధను ఆచరణలో పెడతారో వారు జీవైక్యాన్ని గురించి తెలుసుకొంటారు. ఈ విధంగా చేసిన వారు క్రోధాన్ని దయగా, భయాన్ని ధైర్యంగా మార్చుకోగలరు. అట్టి వారు స్వార్థాన్ని సర్వజీవుల సామరస్యానికి ఉపయోగించి, కర్మ నాచరించుటకు కావలసిన శక్తిని పొందుతారు. 43

Eknath Gita Chapter 1 Section 9

Bhagavat Gita

1.9

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః {1.43}

ఉత్సాద్యన్తే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

ఈ కులనాశకుల దోషము చేత శాశ్వతములైన జాతి ధర్మములు, కులధర్మములు నశించిపోవును

ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్థన {1.44}

నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ

జనార్థనా! కులధర్మములను పాడుచేసుకొనిన మనుష్యులకు శాశ్వతముగ నరకము ప్రాప్తించునని మనము వినుచున్నాము

అర్జునడు ఐకమత్యము లేకుండా ఉన్న జీవితం యొక్క పర్యావసానాన్ని చెప్పుచున్నాడు. మనము స్వర్గము, నరకము ఎక్కడో ఉన్నాయని ఊహిస్తాము. నిజంగా అవి భూమి మీద ఉన్న మన పరిస్థితిని వివరించే భావాలు. మనం ఇతరుల సంతోషానికై పాటుపడితే భూతల స్వర్గాన్ని అనుభవిస్తాం. అలా కాక ఇతరుల యందు నిర్దయతో ఉంటే నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాం.

హింస, యుద్ధాలు, కాలుష్యం, ఎడబాటు, కఠినత్వం మొదలగునవి ఐకమత్యము లేకుండా ఉంటే కలిగే అనర్థాలు. మనం జీవితాన్ని లోతుగా పరిశీలించక యుండడం వలన మనలోని క్రోధాన్ని, భయాన్ని గ్రహింపలేకున్నాము. కొన్నేళ్ళు ధ్యానం చేస్తే వాటిని ఎదుర్కొని నిర్మూలించగలిగే శక్తి వస్తుంది. ధ్యానం మొదట్లోనే మన వ్యక్తిత్వాన్ని, నడవడికను, చేతన మనస్సును మార్పు చెయ్యగలిగే శక్తిని పొందుతాము. మనలో అలజడి చేసే ఎడబాటును నిర్మూలించే౦దుకు ప్రయత్నిస్తాము. దానివలన మన ఆరోగ్యం, ఇతరులతో సామరస్యం పెరిగి మన మనస్సు నిర్మలమై, మేధ పదునుగా అవుతాయి. అలాగే మనకు భద్రత, స్వస్థత కలిగేయనే భావన గట్టి పడుతుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా, పట్టుదలతో, జ్ఞానంతో వాటిని అధిగమిస్తాం.

జీవైక్యతా భావన సాధారణ వ్యక్తులను కూడా అత్యంత ఆధ్యాత్మిక శక్తి గలవారుగా మారుస్తుంది. సమాధిలో మనము అట్టి భావనలను పొందుతాము. అప్పుడు మన హృదయం, మనస్సు, ఆత్మ దేవుని మీద నిలకడగా ఉంటాయి. స్వామీ రామదాసు ఇలా చెప్పేరు:

"సాధనలన్నీ మనస్సును నిశ్చల౦గా ఉంచడానికై చెయ్యబడతాయి. ఏ మనస్సయితే అచలంగా ఉంటుందో అది పరమాత్మ స్వరూపము. " 41

Eknath Gita Chapter 1 Section 8

Bhagavat Gita

1.8

సంకరో నరకాయైన కులఘ్నానాం కులస్య చ

పత౦తి పితరో హ్యేషా౦ లుప్త పిండోదక క్రియాః {1.42}

వర్ణ సంకరము వలన కులమునకు, కుల నాశకులకు నరకము సిద్ధించును. అట్టివారి పితరులు శ్రాద్ధాది క్రియలు లేక అధోగతికి పోవుదురు

అన్ని గ్రంధాలలోనూ చెప్పే విషయాల సారాంశం పరిణామ సిద్ధాంతం ఒక ఉత్కృష్టమైన జీవైక్య స్థితికి తీసికివెళుతుంది. ప్రతి సున్నితమైన పరిశీలుకుడు ఈ విషయాన్ని తేనెటీగల జీవనశైలిని చూసి తెలిసికోవచ్చు. అలాగే ఒక అడవిలో నడిస్తే లేదా ఒక నిస్వార్థ వ్యక్తితో జీవిస్తే ఆ విషయం అర్థమవుతుంది. సృష్టిలోని ప్రతి శకలం తక్కిన వాటితో సామరస్యంగా ఉంటుంది. మనమెప్పుడు క్రోధాన్ని ప్రదర్శించి జీవైక్యాన్ని విస్మరిస్తామో అప్పుడు ఈ పరిణామానికి వ్యతిరేకంగా ఉంటాము. అలాకాక ఇతరులను క్షమించి, వారికేది మంచో అది చేసి, వారి ఒత్తిడిని తగ్గించే విధంగా వ్యవహరిస్తే మనం పరిణామంతో కలసి వెళుతున్నాము.

జీవైక్య౦ అంటే ఒక చిన్న జీవిని బాధ పెడితే మొత్తం జీవాల్ని బాధ పెట్టినట్టే. మనము ఇతర జీవులను బాధపెట్టే అలవాట్లను వదులుకొని, పదిమందికి ఉపకరించే ఉద్యోగాలు చేసి, మన క్రోధాన్ని, ఎడబాటును నియంత్రిస్తే సమిష్ఠికయి పనిచేస్తాం. జాన్ డాన్ ఇలా చెప్పెను:

"ఏ మనిషి ఒక ద్వీపం కాదు; ప్రతి మానవుడు ఖండంలో ఒక భాగం; ఒక మట్టి ముద్ద సముద్రపు కెరటం వలన కొట్టుకుపోతే, ఖండం క్షీణించినట్టే; అలాగే ఒక కొండ శిఖరం, ఒక రాజ సౌధము, మీ ఇల్లు కూడా; ఏ మనిషి మరణమైనా నన్ను క్షీణింపజేస్తుంది. ఎందుకంటే నేను మానవాళిలో ఒక భాగము; కాబట్టి గంట కొట్టబడితే వేరొకరిని పంపవద్దు; ఆ గంట మీ గురించే కొట్టబడింది"

ఈ జీవైక్యాన్ని మనము కుటుంబంతో, మిత్రులతో, సహచరులతో, సహఉద్యోగులతో, సమాజంతో, దేశాలతో, ఇతర జాతులతో, ఇతర మతములతో పంచుకోవాలి. ఇదే దేవుని ఉనికిని కనుక్కొనే మార్గం. 40

Is America Heaven and India Hell?

Many in India say "America is Heaven and India is Hell". It results in the act of applying for an American visa that, of late, ha...