Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 12

Bhagavat Gita

2.12

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః {2.16}

ఉభయోరపి దృష్టో అన్త స్త్వనయో స్సత్త్వదర్శిభిః

లేనిది ఉండేది లేదు. ఉన్నది లేకపోయేది లేదు. ఈ రెండింటి యొక్క తత్త్వము జ్ఞానులచే దర్శింపబడినది

అర్జునుడు తాను దేహానికే పరిమితమని ఇంతవరకు నమ్మేడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అతడు ఒక రోజు ఉండి, మరొక రోజు పోయే దేహంతో తాదాత్మ్యం చెందేడని, దేహము ఆత్మ యొక్క తాత్కాలిక నివాసమని చెప్తున్నాడు.

శ్రీకృష్ణుడు ఏదైతే సత్యమో, ఏదైతే అసత్యమో వివరిస్తున్నాడు. దేనికి పుట్టుక ఉందో, దానికి మరణం ఉంది. కాబట్టి పుట్టి పోయేవి అసత్యములు. ఈ లెక్కన దేహం అసత్యం.

మహాత్మా గాంధీ సంస్కృత పదం సత్ కి రెండు అర్థాలు చెప్పేరు: ఒకటి సత్యం, మరొకటి ఉనికి. ఆయనను దేవుడనగా ఏమిటి అని అడిగితే "సత్యమంటే దేవుడు. దేవుడొక్కడే ఉనికి కలవాడు. తక్కిన వాటికి ఉనికి లేదు" అని చెప్పేరు. ఆయన ప్రజలకి దుర్మార్గం అన్నదాన్ని ఒకరు పెంపొందిస్తే తప్ప దానికి స్వతహాగా ఉనికి లేదు అని చెప్పేరు. మనం దుర్మార్గానికి ఊత తీసివేస్తే అది రూపుమాపు అవుతుంది.

ఎవరైతే మహోత్కృష్టమైన సత్యాన్ని గ్రహిస్తారో వారికి ఏదైతే అసత్యమో దానికి ఉనికి లేదని తెలుసు. అర్జునునుకి మనలాగే శ్రీకృష్ణుడు చెప్పేది సులభంగా అవగతం కాదు. అందుకే దేవుడు యోగులకు మారే ప్రపంచంలో, శకలాలగా ఉన్న సృష్టిలో, మారని తత్త్వం ఒకటి ఉన్నాదనే జ్ఞానాన్ని ఇచ్చేడు. మనలో చాలామందికి అటువంటి జ్ఞానం లేదు. మనలను శకలాల మనుకొంటూ, దేహం మీద కోరికతో ఉంటే, మనము భౌతికమైన, సదా మార్పుచెందే ప్రపంచంతో లావాదేవీలే సత్యమని నమ్ముతాము. మనమనుకోవలసినది: నేను నిజం. మనమందరమూ నిజం. జీవులన్నీ ఏకమని తలచినా మనకిష్టమైన వారితో బాంధవ్యాలు పెంచుకోవచ్చు. జీవులన్నీ ఏకమని నమ్మినా, వ్యక్తికి వ్యక్తికి మధ్యనున్న తేడాబట్టి మన ప్రేమను పంచుకోవచ్చు. 67

Eknath Gita Chapter 2 Section 11

Bhagavat Gita

2.11

యం హి న వ్యథయం త్వేతే పురుషం పురుషర్షభ {2.15}

సమదుఃఖ సుఖం ధీర౦ సో అమృతత్వాయ కల్పతే

పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ మాత్రాస్పర్శములు సుఖదుఃఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుని బాధించలేవో అట్టివాడు కదా మోక్షము నొందుటకు అర్హుడగును

అనేక మతాలలో మరణాన్ని జయించే మార్గం చూపిస్తామనేవారు ఉన్నారు. వారి భక్తులు అది ఒక ఉపమానమని, దానికి శాస్త్రపరమైన ఊత లేదని తలుస్తారు. కానీ యోగులు కాలమే భ్రాంతి అని, అమృతత్త్వమే నిజమని అంటారు.

మనము మన బంధు మిత్రుల మరణ వార్తలను అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కానీ వాటిపై "మరణం నాకూ కలుగుతుందా? దాన్ని దాటే మార్గం లేదా?" అని స్పందించము. నేను చిన్నప్పుడు నా గ్రామంలో అనేక మరణాలు చూసేను. ఎందుకంటే నా అమ్మమ్మ గ్రామంలో ఎక్కడ మరణం సంభవించినా నన్ను తోడు తీసికెళ్ళేది. అది నన్ను చాలా కలత పెట్టేది.

నా అమ్మమ్మ ఎందుకు అలా చేసేదో పెద్దయ్యేక తెలిసింది. ఆమె నన్ను మరణాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తున్నాది. ఆవిడ ప్రేరణ వలన నేను తెలిసికున్న దేమిటంటే నడివయస్సులో కూడా నేను మరణంలో ఉన్నానని. అందువలన మరణాన్ని దాటి అమృతత్త్వాన్ని పొందాలని నిశ్చయించుకొన్నాను. నా సాధన కొనసాగుతున్నకొద్దీ మరణం గురించి నాలో ఉన్న భయాన్ని దాన్ని అధిగమించే శక్తిగా మార్చుకున్నాను.

ఐన్స్టీన్ ను ఒకరు తన సిద్ధాంతాలను ఎలా కనుకున్నారని అడిగేరు. ఆయన అంతకు ముందు ప్రపంచమంతా అంగీకరించిన సిద్ధాంతాలను ప్రశ్నించేనన్నారు. అలాగే ధ్యానంవలన మనలో మరణము తప్పదా అనే ప్రశ్నని అడగగలుగుతాం. ఇది ఒక తార్కికమైన విషయం కాదు. స్వీయానుభవం వలన మనకు విదితమయ్యేది మనకు మరణము లేదని. ఆ అవగాహన మనలను ఉత్తేజ పరిచి, చిన్న చిన్న కోరికలను త్యజింపజేసి, చివరకు మన శక్తినంతా అమృతత్త్వానికై వెచ్చి౦పజేయిస్తుంది.

గీత చెప్పేది మనం దేహంతో తాదాత్మ్యం చెందినంత కాలం మరణము తప్పదని. ధ్యానంలో దేహం మీదున్న స్థిరభావాన్ని తొలగించుకుంటాం. మన సాధన వలన భౌతికమైన చేతనాన్ని దాటి, స్వేచ్చాయుతమైన పురోగతిని పొందుతాము. 66

Eknath Gita Chapter 2 Section 10

Bhagavat Gita

2.10

మాత్రా స్పర్శాస్తు కౌన్తేయ శీతోష్ణ సుఖదుఃఖదాః {2.14}

ఆగమాపాయినో అనిత్యాః తాం స్తితిక్షస్వ భారత

కౌన్తేయా! ఇంద్రియములు ఇంద్రియ విషయములతో సంయోగము చెందునపుడు శీతోష్ణ సుఖదుఃఖములు సంభవించుచుండును. అవి ఉత్పత్తినాశములు గలవి. అస్థిరమైనవి. కనుక భారతా! వానిని సహింపుము

మన భౌతిక శరీరము ఇతర భౌతిక పదార్థాలతో సంబంధం పెట్టుకుంటే దానికి కారణము మనము కాదు. అందుకే శ్రీకృష్ణుడు "నీవు భౌతిక పరమైన సంబంధాలవలన ఆశనిరాశలు ఎందుకు అనుభవిస్తున్నావు?" అని అర్జునుని అడుగుతున్నాడు.

ఈ రోజుల్లో నిరాశ (depression) ఒక మహమ్మారిలా ఉంది. గీత ఇచ్చే సలహా: నీవు ఎప్పుడైతే ఎంతో ఆనంద౦తో ప్రేరేపితమై ఉన్నావో, ఎన్నో గొప్పకార్యములు విజయవంతంగా ముగించేవో, అదృష్టంచే వరించిబడ్డావో, ఇతరులతో అతిగా మాట్లాడి ఎంత ఆనందంగా ఉన్నావో చెప్దామనుకున్నావో, అప్పుడు మనోభావాలను నియంత్రించి నిర్లిప్తంగా ఉండాలి. నీవు రచయితవైతే, నీ పుస్తకములకు విశేషమైన ఆదరము లభించి, నీకు సన్మానం చేస్తామని ఆహ్వానాలొస్తే ఉవ్విళ్లూరుతూ వెళ్ళడం గీత చెప్పేదానికి వ్యతిరేకం. అలాంటి సమయాల్లో ప్రత్యక్షంగా గానీ, ఫోనుల్లోగానీ అతిగా మాట్లాడకూడదు. ఆ సమయాల్లో మంత్ర జపమే మనకి రక్ష.

హర్షోద్వేగం అనేక విధాలుగా వ్యక్తమవుతుంది. కొందరు అతిగా మాట్లాడుతారు. మరికొందరు భవిష్యత్తు గురించి ఆలోచించి గాలిలో మేడలు కడతారు. ఎంతో నిరాడంబరమైన, వినయవిధేయలతో కూడిన వారలకైనా హర్షోద్వేగాన్ని నియంత్రించుకోవడం కష్టం. అలాంటిది సామాన్యులమైన మనకు ఎంత కష్టమో చెప్పనక్కరలేదు. ముఖ్యంగా నటులు, రచయితలు మొదలగు కళాకారులు హర్షోద్వేగానికి లోనవుతారు. వారు సన్మానాలు, గౌరవాలు, బిరుదులు వస్తాయని శోభాయమానమైన భవిష్యత్తుకై నిచ్చెనలు వేసుకొంటారు. గీత మననిక్కడ హర్షాన్ని నియంత్రించుకోమంటుంది. హర్షోద్వేగము కలిగినప్పుడు మంత్రం జపిస్తూ, నిర్లిప్తంగా ఉండడం శ్రేష్ఠము.

మనకు నిరాశ కలిగినప్పుడు "నా నిరాశను ఉంకొకరికి కలిగించను" అనే సద్భావంతో ఇతరులితో వేర్పడి ఉండవచ్చు. అంటే నిరాశని ఒక అంటు వ్యాధిగా భావించవచ్చు. అలా చెయ్యడం ఎన్నటికీ సరి కాదు. దానివలన నిరాశ ఇంకా ఎక్కువవుతుంది. మనం చుట్టూ ఒక చెరసాలను కట్టుకొని ఒంటరిగా బ్రతుకుతాం. కానీ ధ్యానం చేసి, మంత్రోచ్చారణ చేస్తూ, చిరునవ్వుతో ఉంటే మనలో మంచి మార్పులు కలిగి నిరాశను అధిగమిస్తాం.

మన హర్షోద్వేగాన్ని నియంత్రించుకోవడం దుఃఖం లేదా నిశ్చేష్టతో కూడి ఉండడం కాదు. నిర్లిప్తంగా ఉంటే మన చేతన మనస్సుల లోతులనుండి భద్రత, ఆహ్లాదాన్ని తోడుకొని తెస్తాం. ఏదైతే మన హర్షోద్వేగానికి కారణమో, అది కొంతకాలానికి మనను నిరాశ చెందేలా చేస్తుంది. కొందరు మాదక ద్రవ్యాలు సేవిస్తూ మిక్కిలి ఆనందనికై అర్రులు చాస్తారు. ఎప్పుడైతే మనం ఇంద్రియాలను ఆనందానికై ప్రేరేపిస్తామో మనకక్కడ నిరాశ తప్పదు.

ఆశనిరాశలు ద్వ౦ద్వాలు. అంటే ఒకదానిని వెనుకపెట్టుకొని ఉ౦కొకటి వస్తుంది. అలాగే సుఖదుఃఖాలు, చలి వేడి కూడా ద్వ౦ద్వాలు. సమాధి పొందుటకై శ్రీకృష్ణుడు "సమత్వ యోగ ఉచ్యతే" -- అనగా ద్వంద్వాలు ఉన్నప్పుడు మనస్సు సమతుల్యంగా ఉండాలి -- అని సూచిస్తున్నాడు. 64

Eknath Gita Chapter 2 Section 9

Bhagavat Gita

2.9

దేహినో అస్మిన్ యథాదేహే కౌమారం యౌవనం జరా {2.13}

తథా దేహాంతరప్రాప్తి ర్ధీర సత్ర న ముహ్యతి

జీవునకు ఈ దేహమునందు బాల్యము, యౌవనము, వార్ధక్యము ఎలా కలుగుచున్నదో అలాగే మరణానంతరము మరియొక దేహమును పొందుట జరుగుచున్నది. ధీరుడు ఈ విషయమై భ్రమపడడు. ఀ

చిన్నప్పుడున్న మన దేహం పెద్దయ్యేక అనేక మార్పులు చెందుతుంది. అలాగే మరణించిన పిదప ఆత్మ ఉంకో క్రొత్త శరీరాన్ని ధరిస్తున్నాదని శ్రీకృష్ణుడు చెప్పుచున్నాడు. ఇటువంటి పునర్జన్మ సిద్ధాంతాన్ని ఆధ్యాత్మిక చింతనకు అవసరం లేదు. కానీ అది మనలను ఉత్తేజ పరుస్తుంది. కొందరు యోగులు పునర్జన్మలేని స్థితికై సాధన చేస్తారు. దాన్ని కొందరు మోక్షమంటారు. ఈ నేపథ్యంలో పునర్జన్మ గురించి శాస్త్రజ్ఞులు ఎన్నో గ్రంథాలు వ్రాసేరు. సోమర్ సెట్ మాహమ్ అనే రచయిత 1930 లో రమణ మహర్షిని కలిసి ఉత్తేజితుడై రాజర్స్ ఎడ్జ్ అనే పుస్తక౦లో పునర్జన్మ గురించి వ్రాసేరు.

కొందరు "మనకు గత జన్మ విశేషాలు ఎందుకు గుర్తుకు లేవు?" అని ప్రశ్నిస్తారు. నిజానికి మనకీ జన్మ విశేషాలే పూర్తిగా గుర్తులేవు. మన రెండవ జన్మదినము ఎక్కడ, ఎలా జరిగిందో మనకెవ్వరికీ గుర్తులేదు. అంటే మనమప్పుడు లేమా? ఉన్నాము కానీ గుర్తులేదు.

ఈ క్రమంలో శ్రీకృష్ణుడు మరణం గురించి చెప్తాడు. కార్ల్ జంగ్ అనే గొప్ప మానసిక శాస్త్రవేత్త ప్రతి మనిషికి అచేతన మనస్సులో మరణం గురించి ఎన్నో భయాలు ఉంటాయన్నారు. అది ప్రాణాలర్పించడానికి సిద్ధపడిన సైనికులవంటి వారలకు కూడా వర్తిస్తుంది. ధ్యానంలో పరిపక్వత పొందితే మరణము గురించి భయం క్రమంగా పోతుంది. ఇది భౌతిక చేతనాన్ని దాటి వెళ్తున్నా మనడానికి సంకేతం. రమణ మహర్షికి 17 వ ఏటనే జ్ఞానోదయం కలిగింది. ఆయనతో మనము మరణం గురించి మాట్లాడితే "నేను 17 వ ఏటనే మరణించేను" అంటారు. సమాధిలో నేను, నాది అనే భావాలు లేక, అనగా అహంకారం లేక, మరణాన్ని అనుభవిస్తాము. సెయింట్ పాల్ "నేనుకాదు. నాలో జీసస్ క్రైస్ట్ నివసిస్తున్నాడు" అన్నారు. తర్కం దృష్ట్యా అహంకారం పడిపోతే, ఇక మరణించడానికి మిగిలేది ఎవరు? మనము పరుల సంతోషానికై వారిని మనకన్నా ముఖ్యులుగా తలుస్తే, మన అహంకారం తగ్గి, ఆత్మకు చేరువై, భగవంతుని చేతన మనస్సుతో పట్టుకుంటాం. 62

Eknath Gita Chapter 2 Section 8

Bhagavat Gita

2.8

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః {2.12}

న చైవ న భవిష్యామ స్సర్వే వయ మతః పరమ్

నేనును, నీవును, ఈ రాజులును ఒకప్పుడు లేనివారము కాము. భవిష్యత్తులో లేకుండా పోయే వారము కాము

అర్జునుని చూచి "నువ్వు ఎప్పుడూ ఉన్నావు. ఎప్పుడూ ఉంటావు" అని శ్రీకృష్ణుడు ధైర్యం ఇస్తున్నాడు. మనము ఎప్పటికీ ఉండేవాళ్ళము అనగా మన ఆత్మ శాశ్వతము. జీసస్ "నేను మీకు మరణములేని జీవితాన్ని ఇవ్వడానికి వచ్చేను" అని చెప్పెను. ధ్యానంలో మనము కాలాన్ని దాటి శాశ్వత సుఖాన్ని అనుభవిస్తాము.

కాలము ఒక నియంతలా వ్యవహరిస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పరుగులు పెడుతూ ఒక ప్రదేశం నుంచి ఉంకో ప్రదేశానికి వెళ్తున్నారు. వైద్యుడిని కలవాలంటే వారు చెప్పే సమయానికి, అటు ఇటూ కాకుండా, వెళ్ళాలి. ఒకప్పుడు ఘంట తీసికొనే పని ఇప్పుడు కంప్యూటర్లతోనూ, అంతర్జాలం తోనూ నిమిషాలమీద చేస్తున్నాం. ఇలాగే కొన్నాళ్ళు౦టే ఒక అర్థ క్షణం ఆలస్యమయితే మనగురించి నిరీక్షించే వారు తెగ కోప్పడతారు.

కొందరు బస్ ఎక్కడానికి కొంచెం ఆలస్యంగా వస్తూ ఉంటారు. క్షణాలలో బస్సు వారిని ఎక్కించుకోకుండా కదిలిపోతుంది. అది బస్ నడిపేవాడి తప్పు కాదు. మనం ఉదయాన్నే లేచి, కాలకృత్యాలు తీర్చుకొని, ధ్యానం చేసి, ఇంటినుంచి బయల దేరుతే మనం కాలుడితో పోటీ పడనక్కరలేదు. పని ఎంత వేగిరంగా చేసేమని కాదు చూడవలసినది. పని ఎంత సంపూర్ణతతో చేసేమో చూడాలి.

అలాగే నా ధ్యాన మందిరానికి వచ్చే కొందరు, ధ్యానం చేస్తూ మధ్యలో వాచీ చూసుకొంటూ ఉంటారు. అలాంటి వారికి ధ్యానం కొరకబడదు.

మనం చిరకాలం ఉండాలంటే మన ఇంద్రియాలతోనూ, దేహ౦తోనూ తాదాత్మ్యం చెందకూడదు. అలాగే ఆధ్యాత్మిక జీవనం అవలంబిస్తే చెడు అలవాట్లు -- ధూమ పానం, మద్యం, అతిగా తినడం వంటివి -- వదులుకోవాలి. ఇది నైతిక విలువలకి సంబంధించినది కాదు. నేను చెప్పేది దేహేంద్రియాల్ని ఒక యంత్రంగా పరిగణించే శాస్త్రం. మన మెంతకాలం దేహేంద్రియాలతో ఏకమై, అనుబంధాలను భౌతిక పరమైన విషయాలకే పరిమితం చేస్తే, మనకంతకాలం ఆత్మ జ్ఞానము కలుగదు. 61

Eknath Gita Chapter 2 Section 7

Bhagavat Gita

2.7

న హి ప్రపశ్యామి మామప నుద్యా ద్యచ్చోక ముచ్చోషణ మి౦ద్రియాణా౦ {2.8}

అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం శురాణామపి చా ధిపత్యమ్

ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన రాజ్యము లభించినను, స్వర్గలోకాధిపత్యము ప్రాప్తి౦చినను, నా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖమును ఏది పోగొట్టునో నాకు తెలియుట లేదు

సంజయ ఉవాచ:
ఏవ ముక్త్వా హృషీకేశ౦ గుడాకేశః పరంతపః {2.9}

న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీ౦ బభూవ హ

పరంతపుడైన అర్జునుడు హృశీకేశుడైన గోవిందునితో ఈ విధముగా పలికి యుద్ధము చేయనని ఊరకుండెను

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత {2.10}

సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః

ఓ ధృతరాష్ట్రా! రెండు సేనల నడుమ దుఃఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లనెను

శ్రీ భగవానువాచ:
అశోచ్యా నన్వశోచ స్త్వ౦ ప్రజ్ఞావాదాంశ్చభాషసే {2.11}

గతాసూ నగతాసూ౦శ్చ నానుశోచన్తి పండితాః

దుఃఖి౦ప దగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు. పైగా పండితవచనములను పలుకుచున్నావు. పండితులగువారు గతించిన వారిని గూర్చి గాని, జీవించియున్న వారిని గూర్చి గాని దుఃఖి౦పరు

శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పక చెప్పేది:"నువ్వు జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నావు. కానీ నీ ఆచరణ వ్యతిరేకముగా ఉంది. నీవు ఆనందాన్ని కోరుతూ దుఃఖ కరమైన మార్గంలో వెళ్ళడానికి పూనుకొంటున్నావు. అలాగే సంతృప్తిగా ఉంటానన్నావు. నీవు ఎన్నిక చేసుకొనే మార్గం నిరాశ కలిగించేది అని తెలియక ఉన్నావు." శ్రీకృష్ణుడు అర్జునుని మనస్తత్వము చేయదలుచుకున్న క్రియలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుచున్నాడు.

మనమందరము అడుగవలసిన ప్రశ్న: "మనకు భద్రత, ఆనందం, సంతృప్తి కావాలా, వద్దా?" అలా అడిగి మన లక్ష్యాలను స్థిర పరుచుకోవాలి. మనమందరము శాంతిని కాంక్షిస్తాము. ఏ వ్యక్తీ లేదా దేశం శాంతి వద్దని అనరు. అలాగయితే మనమంతా శాంతికై పాటుపడాలి. అలాకాక యుద్ధం వైపు మొగ్గితే వచ్చేది యుద్ధమే. జర్మనీ అధినేత బిసమార్క్ "నాకు యుద్ధం వద్దు. కానీ విజయం కావాలి" అన్నారు. కొందరు పిల్లలు "నా తలిదండ్రులపై ఎదురు తిరగను. కానీ నా కిష్టమైనట్టు చేస్తాను" అని అంటారు. దానికి శ్రీ రామకృష్ణ పరిష్కారం: "నువ్వు తూర్పు వైపు వెళ్ళాలంటే, ఉత్తరముఖంగా అడుగు పెట్టకు". మనం శాంతి గురించి మాట్లాడితే సరిపోదు. చరిత్ర కారులు నిక్కచ్చిగా చెప్పే గత రెండు వేల స౦వత్సరాల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగేయి. ప్రపంచ దేశాలు ఒక ప్రక్క శాంతి సందేశాలు ఇస్తూ, మరొక ప్రక్క మారణాయుధాలు తయారు చేస్తున్నాయి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుని నెపంగా పెట్టుకొని "మీకు శాంతి కావాలంటే, శాంతికై ఎందుకు పాటుపడరు?" అని మనల్ని అడుగుతున్నాడు.

అర్జునుడు తనకి అకాల మరణం వద్దని, తన బంధుమిత్రులను చంపనని ముందు చెప్పియున్నాడు. శ్రీకృష్ణుడు దానికి బదులుగా దేహం మాత్రమే మరణిస్తుంది అని చెప్తున్నాడు. మనము ఎప్పటికీ మరణించం, ఎందుకంటే మన ఆత్మ దేహానికే పరిమితం కాదు. మనము శాశ్వతము, అపరిమితము, మార్పులేని వారలము. ఇదే ధ్యానం చివరలో కలిగే భావం: మనము దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాము. మనం పరమాత్మ అంశలము.

రమణ మహర్షి 1950 లో అవసాన దశలో ఉన్నప్పుడు అనేక భక్తులు "మీరు వెళ్లిపోతున్నారు. మమ్మల్ని వదిలేస్తున్నారు" అని విలపించేరు. ఆయన "నేనెక్కడికి వెళ్ళ గలను? నేను అన్ని చోట్లా ఉన్నాను. మిమ్మల్ని ఎలా వదిలేయగలను?" అని అన్నారు. ఇదే మనకి సమాధిలో కలిగే జీవైక్య భావం. 59

Eknath Gita Chapter 2 Section 6

Bhagavat Gita

2.6

కార్పణ్య దోషోప హత స్వభావః వృచ్చామి త్వాం ధర్మ సమ్మూఢ చేతాః {2.7}

యచ్చ్రేయ స్స్య న్నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం శాధి మాం త్వాం ప్రసన్నమ్

కార్పణ్య దోషముచే కొట్టబడినవాడనై ధర్మనిర్ణయము చేయలేని చిత్తమును బొంది నిన్ను అడుగుచున్నాను. నాకు ఏదిమేలైనదో దానిని నిశ్చయముగ చెప్పుము. నేను నీ శిష్యుడను. నిన్ను శరణు బొందిన నన్ను శాసింపుము

అర్జునుడు కృష్ణునితో "నేను నీ శిష్యుడను. నాకు నీ బోధ అనుగ్రహించు" అని వేడుకొంటున్నాడు. మన సంప్రదాయంలో గురువు ఒకరు అడగనిదే వారిని శిష్యునిగా స్వీకరించరు. గురు అనగా బరువుగా ఉండేది అని అర్థం. అంటే గురువుని ఎవ్వరూ కదపలేరు. అలాగే ప్రపంచంలోని ఏ శక్తీ ఆయన చూపించే ప్రేమను నియంత్రించలేదు. అతనిని తిడితే దీవిస్తాడు, హాని చేస్తే సేవతో బదులిస్తాడు, వాడుకుంటే ఉపకారిగా ఉంటాడు. మనందరిలో అటువంటి గురువు ఉన్నాడు. మన ప్రత్యక్ష గురువు మన అంతర్గత గురువుని గుర్తు చేస్తాడు. ఆయనయందు మనకెంత విశ్వాసముంటే మనమంత ఆత్మ విశ్వాసము కలిగి ఉంటాము. మన స్మృతులలో గురువుని ముందూ వెనకా చూసి ఎన్నుకోమంటారు. ఒకరి అందాన్ని కానీ, వేసుకొన్న దుస్తులనుగాని చూచి ఆకర్షితులమై వారిని గురువుగా స్వీకరించనక్కరలేదు. ఒకమారు మన ఆధ్యాత్మిక దృక్పథంతో ఏకీభవించే గురువు లభిస్తే ఆయన యందు పూర్తి విశ్వాసంతో ఉండాలి.

నేను ఈ ఆధునిక ప్రపంచంలో ఎన్ని తప్పులు చెయ్యగలమో అన్ని తప్పులు చేసేను. కానీ నా ప్రేమనంతటిని నా అమ్మమ్మకి ఇచ్చి కొంత ఆధ్యాత్మికతను పొందేను. మనమిలాగ గురువుపై ప్రేమ కలిగి ఉంటే అతని చేతనములో ఐక్యమవుతాము. సమయం వచ్చినపుడు గురువు తప్పుకొని, అంతకాలం మన ప్రేమను మన ఆత్మవైపు ప్రసరించేమని గుర్తింపజేస్తాడు. తన స్థితిలో స్థిరమైన గురువుకి ఇతరుల ప్రేమ నిజంగా అక్కరలేదు. శిష్యునికి ఆత్మ జ్ఞానము కలుగజేయడానికే ఆయన వానితో సంబంధం పెట్టుకొన్నాడు.

మనము చేయవలసిన సుదీర్ఘ ప్రయాణానికి అవసరమైన సూచనలు గురువు ద్వారా పొంది, ఆ ప్రయాణాన్ని మనమే చెయ్యాలి. అది మన బదులు గురువు చెయ్యలేడు. గురువు యొక్క ప్రత్యేకత మన జీవిత లక్ష్యమేమిటో తెలిపి, ఆ లక్ష్యం చేరడానికి చేసే ప్రయత్నాన్ని ప్రేరేపిస్తాడు. 55

Viveka Sloka 47 Tel Eng

Telugu English All వేదాంతార్థవిచారేణ జాయతే జ్ఞానముత్తమమ్ । తేనాత్యంతికసంసారదుఃఖనాశో భవత్యను ॥ 47 ॥ వేదాంత విచారేణ- ఉపని...