Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 17

Bhagavat Gita

2.17

అథ చైనం నిత్యజాతం నిత్య వా మన్యసే మృతం {2.26}

తథాపి త్వం మహాబాహో నైవ౦ శోచితు మర్హసి

అర్జునా! ఈ ఆత్మ నిత్యము పుట్టుచు, చచ్చుచు నుండు దానినిగ నీవు భావించినను, అట్టి స్థితిలో కూడ నీవు ఈ విధముగ దుఃఖి౦ప పనిలేదు

జాతస్య హి ధృవో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ {2.27}

తస్మా దపరిహార్యే అర్థే న త్వం శోచితు మర్హసి

జన్మించిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మమును తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకించుట సరికాదు

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత {2.28}

అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా

అర్జునా! ప్రాణులు జన్మలకు ముందు తెలియుటలేదు. మధ్యలో తెలియుచున్నవి. గతించిన పిదప మరల గోచరించుట లేదు. ఈ విషయమై నీకు దుఃఖ మెందులకు?

శ్రీకృష్ణుడు శాశ్వతమైన ఆత్మ గురించి ఇచ్చిన వివరణ ఆలకించి ఇంకా ఇలాగ అనుకోవచ్చు: "నేను దేహిని. దేహం మరణిస్తే నేనూ మరణిస్తాను కదా." మనం మనల్ని దేహమనుకొన్నా, మరణానికి భయపడకూడదు, ఎందుకంటే దేహం సహజంగా కొన్నాళ్ళు౦డి పడిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనల్ని దేహం నుంచి విడదీసి చూపిస్తున్నాడు.

ధ్యాన మార్గంలో ఒకరి భౌతిక శరీర లక్షణాలను చూడక వారి అంతరంగాన్ని చూస్తాం. నన్ను ఫలానా వారు ఎంత పొడుగు అని అడిగితే నేను చెప్పలేను. అది ఒక మంచి చిహ్నం. అలాగే నన్ను ఒకరి వయస్సు ఎంత అని అడిగితే చెప్పలేను. మనమెప్పుడైతే ఒకరిని భౌతిక లక్షణాలతో లేదా వయస్సుతో ముడి పెట్టకుండా ఉంటే మనము వారిలోని ఆత్మను దర్శించినట్లే. మనము ఒకరి భౌతిక లక్షణాలు, వయస్సు గురించి ఆలోచిస్తే, దాని పర్యావసానము మన లక్షణాలను, వయస్సును విశ్లేషించడమే. యోగులు ఒకరి అంతర్గతం ఎలా ఉందో అలా చూస్తారు. నేను ఒకరి కళ్ళను చూస్తాను, ఎందుకంటే అవి వారి మనస్సు యొక్క కిటికీలు. తద్వారా భగవంతుని దర్శించవచ్చు. క్రమంగా ఆత్మ జ్ఞానం అలవరచుకొంటే మనం ఒకరి కళ్ళలో చూసి, వారిలో వసించే భగవంతుని ప్రేమ స్వరూపాన్ని చూస్తాం. 78

Eknath Gita Chapter 2 Section 16

Bhagavat Gita

12.16

నైనం ఛి౦దంతి శస్త్రాణి నైనం దహతి పావకః {2.23}

న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః

ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు. అగ్ని దహింపలేదు. నీరు తడుపలేదు. గాలి శోషింప జేయలేదు.

అఛ్ఛేద్యో అయ మదాహ్యో అయ మక్లేద్యో అశోష్య ఏవ చ {2.24}

నిత్యస్సర్వగత స్స్థాణు రచాలో అయం సనాతనః

ఈ ఆత్మ ఛేదింపబడదు. దహింపబడదు. తడుపబడదు. ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది.

అవ్యక్తో అయ మచి౦త్యో అయ అవికార్యో అయ ముచ్యతే {2.25}

తస్మా దేవం విది త్త్వైనం నాను శోచితు మర్హసి

ఈ ఆత్మ వ్యక్తముకాదు. చింతించుటకు వీలుపడదు. వికారములేనిదని చెప్పబడినది. ఈ విధమైన ఆత్మను తెలిసికొని నీవు శోకించుట మానవలెను

అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పే ఆత్మ అంతుబట్టలేదు. అందుకై శ్రీకృష్ణుడు మనందరికీ మన ఉనికి యొక్క నిజ స్వరూపామును విసిదీకరిస్తున్నాడు. మన నిజ స్వరూపము 3 సంస్కృత పదాలతో వివరింపబడినది: అవ్యక్త అయం--అనగా వ్యక్తము కానిది, నిఘూడంగా ఉన్నది; అచింతయ అయం--అనగా ద్వంద్వాలకు అతీతమై విశ్లేషించుటకు కష్టమైనది; అవికార్యో అయం--అనగా మార్పు చెందనిది. మన ఆత్మ స్వరూపము సంపూర్ణమైనది. ఈ మూడు అంశాలను మన ఆత్మ స్వరూపముపై ఆపాదిస్తే మనము దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతులమని తెలుస్తుంది.

ముందు చెప్పినట్లు అవ్యక్త అనగా పూర్తిగా వ్యక్తమవ్వనిది. మనము దేహముపైనే దృష్టి పరిమితం చేసికొని అపరిమితమైన, అమృతమైన, మార్పులేని ఆత్మను దర్శించలేకున్నాము.

మైస్టర్ ఎక్ హార్ట్ ఆత్మను మనందరిలోనూ ఉన్న దేవుని యొక్క బీజంగా పరిగణించేరు. ఎలాగైతే ఆపిల్ విత్తు ఆపిల్ చెట్టులా, నారింజ విత్తు నారింజ చెట్టుగా పెరుగుతాయో, దేవుని బీజము దేవుని చెట్టుగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో వ్యక్తమనగా మనలోని గుప్తంగా ఉన్న దైవీ సంపదని బహిర్గతం చెయ్యడమే మన యొక్క లక్ష్యం. ఎలాగైతే కలుపు మొక్కలను తీసివేస్తే విత్తనం పెరిగి పెద్దదవుతుందో, అలాగే మనల్ని కూడా శుద్ధి చేసికొంటే దేవుని బీజం చిగురుస్తుంది.

మనలోని గుప్తమైన దైవ గుణాలని ఎలాగ బయటకు తెస్తామని ప్రశ్న కలగవచ్చు. కొందరు స్వార్థంతో, అభద్రతో బ్రతుకుతారు. వారు ఎప్పుడూ ప్రతీదాన్నీ, ప్రతి వ్యక్తిని స్వలాభానికై ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తారు. అలా౦టివారు తాము సున్నితమైన వారలమని చెప్పుకుంటారు. కొందర సున్నితమంటే చెప్పులు వేసికోకుండా ఇంట్లో నడుస్తే కలిగే బాధ అని చెప్పవచ్చు. యోగులు చెప్పే సున్నితత్వము ఇతరుల బాధలను అర్థం చేసికోవడం. మనము పరులకై పాటు పడితే, మనకు కలిగే బాధlu, కలవరము, ద్వేషం నుండి విముక్తులమవుతాము.

నా అమ్మ చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటుంది. నేను ఆమె నామీద నమ్మకం లేక కాదు అని తలుస్తాను. ఆమెకు తెలుసు ఉద్యోగ రీత్యా నేను మతిమరుపు మనిషినని. మనము మన తలిదండ్రులు మన క్షేమమే సదా కోరుతారని, భార్యా పిల్లలు మనకి ఆహ్లాదం ఇస్తారని మనసారా నమ్మితే వారు చేసే ఏ పనీ మనను బాధించదు. నా అమ్మ అప్పుడప్పుడు కటువుగా ఉంటుంది. నేను ఆమెను తప్పు బట్టను. మన బంధుమిత్రులపై మిక్కిలి నమ్మకం లేకపోతే, ఎటువంటి మృదుమాటలు, గౌరవ వచనాలు, వలన మన మధ్య అన్యోన్యత కలగదు. మనము వారి దురుసు మాటలకు, తెలియకుండా చేసిన తప్పులకు స్పందించక మంత్రాన్ని జపించడమే ఉత్తమం.

మనమందరమూ క్షణికమైన జీవితంలో మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆంగ్లో సాక్సన్ హయాంలో ఎడ్విన్ అనే రాజుని చూడడానికి కొందరు క్రిస్టియన్ మత గురువులు ఆయన నివాసానికి వచ్చేరు. వారు ఆయనకు ఇలా బోధించేరు: "రాజా, మనము ఇక్కడ ఎగిరే పిచ్చుకల లాగా బ్రతుకుతున్నాం. ఎందుకనగా అవి బయట చలిలోనుండి ఎక్కడినుంచో వచ్చి, వంట గదిలోని ఆహారం ముక్కున పెట్టుకొని, మళ్ళీ బయట ఎక్కడికో ఎగిరి పోతాయి. అవి చీకటిలోనుంచి వచ్చి చీకటిలోకి తిరిగి వెళ్ళిపోతున్నాయి. పుట్టడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చేమో, మరణం తరువాత ఎక్కడికి పోతున్నామో మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా వెలుగుతో కూడిన ప్రస్తుత జన్మ."

గీత మనము పూర్ణములోనుంచి వచ్చి పూర్ణంలో కలిసిపోతున్నామని చెప్పింది. ఈ మధ్యకాలంలో మనము వ్యక్తమై ఉన్నాము. పరిమితమైన, మరణించేది అయిన జీవితం మనను మభ్యపెట్టి "నా వ్యక్తిత్వము పుట్టుకనుంచి, మరణించేవరకు 100 ఏళ్లు బ్రతుకుతుంది" అనేలా చేస్తుంది. కానీ గీత అవ్యక్తమని చెప్పడానికి కారణం మన జీవితం అపరిమితమైనది. జీసస్ క్రైస్ట్ మనల్ని భౌతిక విషయాలకు అతీతమై ఉండాలని బోధించేరు.

శ్రీకృష్ణుడు వాడిన మరో పదం అచిన్త్య. మన నిజస్వరూపమైన ఆత్మ ద్వంద్వాలకు అతీతమై ఉన్నది. అది తెలిసికోవాలంటే మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సు నిరంతరము ఆలోచనలతో నిండి ఉండేది. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో "నా ఉనికి నా ఆలోచనల వలననే" అని చాలామంది నమ్ముతారు. యోగులు చెప్పేది దానికి వ్యతిరేకము. మనము ఆలోచనలను నియంత్రిస్తే మనకు ఉనికి లేదని తలుస్తాము. "నేనేమి చేసేది? నా సమయాన్ని ఎలా గడిపేది? నిద్రలో ఎటువంటి కలలు కంటాను?" అని ప్రశ్నించుకొని ఆవేదన చెందుతాము. వాటికి సమాధానం: మీరెందుకు కలలు కనాలని తలుస్తారు? ఎందుకు స్వార్థానికై, స్వలాభనికై ప్రయత్నిస్తారు? మనము పరోపకారం చేస్తూ, మనల్ని మర్చిపోతే, అదే నిజమైన జీవితమంటే.

నేను ధ్యానము మొదలుపెట్టిన రోజుల్లో కొందరు ఇలా అడిగేవారు: "నీకు మంచి వ్యక్తిత్వము౦ది. అలాగే మేధా సంపద ఉంది. నీవు వాటిని ఎందుకు వృధా చేస్తావు? ఎందుకు నీ మెదడుని మొద్దు బారేటట్లు చేసుకొంటావు? దానిని ఎందుకు నిశ్చలం చేయాలనుకొంటున్నావు?". కొందరికి మనకు వ్యక్తిత్వం లేదని చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. రమణ మహర్షి వంటి వారు మనం బ్రతికున్నామంటే ఒప్పుకోరు. యోగులు చెప్పేది: మన ముఖమును కప్పిపుచ్చే తెరను తీసివేస్తే గాని; భౌతిక-మానసిక వ్యక్తిత్వమనే తెరను దాటితే గాని, మనకు ఇతరులను ప్రేమించడం, మంచి కర్మలు చెయ్యడం, ఇతరులను సేవించడం వంటి సద్గుణాలు కలుగవు. 77

Eknath Gita Chapter 2 Section 15

Bhagavat Gita

2.15

వేదానినాశినం నిత్యం య ఏవ మజ మవ్యయమ్ {2.21}

కథం స పురుషః సార్థ కం ఘాతయతి హన్తి కమ్

పార్థా! ఈ ఆత్మను ఎవడు నాశములేని దానిని గను, నిత్యమైన దానిని గను, పుట్టుకలేని దానిని గను, అక్షయమైన దానిని గను గ్రహించుచున్నాడో అట్టి పురుషుడు ఎవరిని ఎటుల చంపించును? ఎవరిని ఎటుల చంపును?

వాసా౦సి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి సరో అపరాణి {2.22}

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహే

మనుష్యుడు చినిగిన వస్త్రములను వదలి క్రొత్త వస్త్రములను ధరించుచున్నాడో, అట్లే జీవుడు శిథిలములైన పాత శరీరములను వదలి అన్యములగు నూతన శరీరములను ధరించుచున్నాడు ఀ

శ్రీకృష్ణుడు శరీరమును వస్త్రముతో పోలుస్తున్నాడు. ఎలాగైతే చిరిగిన వస్త్రాన్ని మనం పారేస్తామో, అలాగే దేహము ఇతరులకు సేవ చేయుటానికి ఉపయోగపడకపోతే దానిని విడిచిపెడతాం. కాబట్టి దేహాన్ని పట్టుకు వేళ్ళాడకూడదు. రమణ మహర్షి అంత్యకాలంలో అనేక మంది భక్తులు విలపించేవారు. అప్పుడు ఆయన "నా శరీరము మీకు ఉపయోగపడకుండా ఉంది. అది ఉపయోగపడేవరకు, నేను దాన్ని ఉంచుకొంటాను. కానీ అది నిరుపయోగమయ్యే సమయం వస్తే , నేను దాన్ని విడిచిపెడతాను" అని అన్నారు.

నా అమ్మమ్మకు మరణం బాధాకరమైన విషయం కాదు. ఎందుకంటే ఆమె ఆత్మ శాశ్వతమని నమ్మింది. మన బంధుమిత్రులలో ఒకరు పోతే మన మెంతో బాధపడతాము. కానీ యోగులు మరణం ఒక గది నుంచి వేరొక గదికి మారినట్లని చెప్తారు. అంటే వారు దేహాంతర ప్రాప్తి లేదా పునర్జన్మము గురించి చెప్తున్నారు. ఆధ్యాత్మిక సాధనికి మనము దేహాంతర ప్రాప్తి లేదా పునర్జన్మము నమ్మనక్కరలేదు. మనము ఒక జన్మ ఎత్తినా, కోట్ల జన్మలు ఎత్తినా, లక్ష్యమొక్కటే. అలాగే ధ్యానం కూడా అందరికీ వర్తిస్తుంది. కాబట్టి మన సావధానత ఈ ప్రస్తుత జన్మపై నుంచి, సాధ్యమైనంత వరకు దేవుని ప్రేమించడం ఇప్పుడే, ఇక్కడే చెయ్యాలి. 73

Eknath Gita Chapter 2 Section 14

Bhagavat Gita

2.14

య ఏవం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం {2.19}

ఉభౌ తా న విజానీతో నాయం హంతి స హన్యతే

న జాయతే మ్రియతే వా కదాచి న్నాయం భూత్వా భవితా వా న భూయః {2.20}

అజో నిత్య శ్శాశ్వతో అయం పురాణో న హన్యతే హస్యమానే శరీరే

ఆత్మ పుట్టేది గాదు, గిట్టేది కాదు. గతములో లేకనే నూతనముగ తెలియునది కాదు. ఆత్మ పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది, పురాతనమైనది. దేహము నశించినను ఆత్మ నశించదు

శ్రీకృష్ణుడు మనయొక్క నిజ స్వరూపాన్ని చెప్తున్నాడు. న జాయతే అనగా మన మెప్పుడూ పుట్టలేదు. న మ్రియతే వా అనగా మన మెప్పటికీ మరణించం. న యం భూత్వా భవితా వా న భూయాః అనగా మనము మార్పు చెందలేదు, మార్పు చెందము. అజ అనగా ఎప్పుడూ పుట్టనిది. నిత్య అనగా ఎల్లప్పుడూ ఉండేది. శాశ్వత అనగా నిత్యం మార్పులేకుండా ఉండేది.

కేరళలోని గురువాయూర్ మందిరంలో శ్రీకృష్ణుని విశేషంగా కొలుస్తారు. ఉదయం బాల కృష్ణునికి సేవ చేస్తారు. దానిని చూడడానికి ఆబాలగోపాలం వస్తారు. మధ్యాహ్నం యువకుడైన శ్రీకృష్ణునికి --అంటే నిటారుగా నుంచొని, నెమలి పింఛాన్ని ధరించి, మెడలో పూల మాల వేసి, పట్టు వస్త్రాలను ధరించి, చేతిలో వేణువును పట్టుకొన్న అవతార మూర్తిని--పూజ చేస్తారు. అనేక యువకులు దానిని వీక్షించడానికి వస్తారు. సాయంత్రం శ్రీకృష్ణుని ఒక వృద్ధునిగా చూపిస్తారు. ఆయనను సేవించడానికి అనేక వృద్ధులు వస్తారు. ఈ త్రివిధాలుగా చూపించే ప్రక్రియ మన దేహానికి సంబంధించినది. మనము సదా మార్పు చెందే భౌతికతకు అతీతంగా వెళ్ళాలి 71

Eknath Gita Chapter 2 Section 13

Bhagavat Gita

12.13

అవినాశి తు తద్విద్ధి యేన సర్వమిదం తతమ్ {2.17}

వినాశ మన్యయప్యాస్య న కశ్చి త్కర్మ మర్హతి

ఈ సమస్తము దేనిచేత పరివ్యాప్తమై యున్నదో అది అవినాశి యని గ్రహింపుము. అవినాశి యగు దీనిని ఎవ్వరును నాశనము చేయలేరు

అంత వంత ఇమే దేహానిత్యస్యోక్తా శ్శరీరిణః {2.18}

అనాశినో అప్రమేయస్య తస్మా ద్యుధ్యస్వభారత

అర్జునా! నిత్యుడును, అవినాశియు, అప్రమేయుడును అగు దేహియొక్క ఈ దేహములు అంతము గలవిగా చెప్పబడినవి. కనుక యుద్ధము చేయుము

మన దేహం ఏదో ఒకనాడు పోయేదే. కానీ ఆత్మ శాశ్వతం. మనకు అంతము లేదు ఎందుకంటే మనము దేహము కాము కనుక. మన దేహంలోని కణాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. అలాగే మన మనస్సులోని ఆలోచనలు కూడా ఇంకా వేగంగా కదులుతాయి. దీన్నే సంసార మని అంటారు. అంటే ఏదైతే వేగంగా కదులుతూ, మరణిస్తూ, జన్మిస్తూ ఉండేది.

మనమెప్పుడైతే మార్పు చెందేదాన్ని పట్టుకొని వేళ్ళాడతామో అప్పుడు కాలం గడుస్తున్న కొద్దీ అభద్రత కలుగుతుంది. మనం దేహంతో తాదాత్మ్యం చెందితే వృద్ధాప్యంలో మొహం మీద ముడతలు, నెత్తి మీద వెంట్రుకలు రోజూ చూసుకుంటూ ఉంటాం. మనం దేహాన్ని ఆశ్రయిస్తే రోజురోజుకీ మన సౌందర్యాన్ని కోల్పోతా౦. అలాకాక మనం ఇతరులకు సేవ చేయడానికై దేహాన్ని ఎప్పుడైతే వాడుతామో అప్పుడు మన భౌతిక శరీరం ఆరోగ్యంతో, సౌందర్యంతో అలరారుతుంది. శ్రీ రామకృష్ణ కలకత్తా వీధులలో నడుస్తూ ఉంటే ఆయన శరీరం ప్రకాశవంతమై అందరినీ ఆశ్చర్యపరిచేది.

శరీరం మనలో దేవుడు నివసించే గుడి. నా అమ్మమ్మ 77 ఏళ్లప్పుడు కూడా ఎంతో తేజోవంతంగా ఉండేది. ఆమెకు దేహమనబడే గుడిని స్వస్థతగా ఉంచాలి; మంత్రమనే చీపురుతో శుభ్రం చెయ్యాలి; ధ్యానంతో ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని దేహాన్ని శుద్ధి చేసుకోవాలి అని తెలుసు. మనం దేవునియందు భక్తి దేహాన్ని పరిశుద్ధంగా ఉంచి చూపాలి. దేహాన్ని దుర్వినియోగం చేసి, ఇంద్రయాలతో దాన్ని దురుపయోగం చేస్తే అది దేవునిని అవమానించడమే. పుస్తకాలు, సినిమాలు, టివి, తినే పదార్థాల విషయాల కొస్తే మన ఇంద్రియాలు మనస్సును, దేహాన్ని అవి ప్రేరేపించనవిగా ఉండాలి. ఆధ్యాత్మిక సాధన మార్గంలో ఉన్న వారల కూడా ఇంద్రియాల విషయాలలో అప్రమత్తంగా ఉండాలి. మనము దేహముకాదు, ఆత్మ స్వరూపులమని తెలిసుకోడానికి కూడా మన ఇంద్రియాలు స్వాధీనంలో ఉండాలి. ఒక్కమాటలో మన ఆధ్యాత్మిక సాధనకు దేహమొక పనిముట్టు. అది లేనిదే సాధన సాగదు.

ఇంతవరకూ దేహాన్ని స్థూలంగా చూసేము. మనకి సూక్ష్మ శరీర మనబడేది ఉంది. మన ఆలోచనలు సూక్ష్మశరీరానికి ఆహారం. మన సంస్కారాలు, మానసిక భావాలు దాన్ని ప్రభావితం చేస్తాయి. మన మనస్సులో చెడు లేదా మంచి ఆలోచన వస్తే సూక్ష్మ శరీరానికి అనుచితమైన లేదా పోషణకరమైన ఆహారాన్ని ఇస్తాము. మనస్సులో కలిగే క్రోధం, ద్వేషం, విరోధం అనబడే చెడు లక్షణాలు, మన భౌతిక శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. మన సూక్ష్మ శరీరాన్ని శుద్ధంగా, ఆరోగ్యంగా ఉంచాలంటే మనము క్షమించడమనే సద్గుణాన్ని అలవరచుకోవాలి 70

Eknath Gita Chapter 2 Section 12

Bhagavat Gita

2.12

నాసతో విద్యతే భావో నాభావో విద్యతే సతః {2.16}

ఉభయోరపి దృష్టో అన్త స్త్వనయో స్సత్త్వదర్శిభిః

లేనిది ఉండేది లేదు. ఉన్నది లేకపోయేది లేదు. ఈ రెండింటి యొక్క తత్త్వము జ్ఞానులచే దర్శింపబడినది

అర్జునుడు తాను దేహానికే పరిమితమని ఇంతవరకు నమ్మేడు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అతడు ఒక రోజు ఉండి, మరొక రోజు పోయే దేహంతో తాదాత్మ్యం చెందేడని, దేహము ఆత్మ యొక్క తాత్కాలిక నివాసమని చెప్తున్నాడు.

శ్రీకృష్ణుడు ఏదైతే సత్యమో, ఏదైతే అసత్యమో వివరిస్తున్నాడు. దేనికి పుట్టుక ఉందో, దానికి మరణం ఉంది. కాబట్టి పుట్టి పోయేవి అసత్యములు. ఈ లెక్కన దేహం అసత్యం.

మహాత్మా గాంధీ సంస్కృత పదం సత్ కి రెండు అర్థాలు చెప్పేరు: ఒకటి సత్యం, మరొకటి ఉనికి. ఆయనను దేవుడనగా ఏమిటి అని అడిగితే "సత్యమంటే దేవుడు. దేవుడొక్కడే ఉనికి కలవాడు. తక్కిన వాటికి ఉనికి లేదు" అని చెప్పేరు. ఆయన ప్రజలకి దుర్మార్గం అన్నదాన్ని ఒకరు పెంపొందిస్తే తప్ప దానికి స్వతహాగా ఉనికి లేదు అని చెప్పేరు. మనం దుర్మార్గానికి ఊత తీసివేస్తే అది రూపుమాపు అవుతుంది.

ఎవరైతే మహోత్కృష్టమైన సత్యాన్ని గ్రహిస్తారో వారికి ఏదైతే అసత్యమో దానికి ఉనికి లేదని తెలుసు. అర్జునునుకి మనలాగే శ్రీకృష్ణుడు చెప్పేది సులభంగా అవగతం కాదు. అందుకే దేవుడు యోగులకు మారే ప్రపంచంలో, శకలాలగా ఉన్న సృష్టిలో, మారని తత్త్వం ఒకటి ఉన్నాదనే జ్ఞానాన్ని ఇచ్చేడు. మనలో చాలామందికి అటువంటి జ్ఞానం లేదు. మనలను శకలాల మనుకొంటూ, దేహం మీద కోరికతో ఉంటే, మనము భౌతికమైన, సదా మార్పుచెందే ప్రపంచంతో లావాదేవీలే సత్యమని నమ్ముతాము. మనమనుకోవలసినది: నేను నిజం. మనమందరమూ నిజం. జీవులన్నీ ఏకమని తలచినా మనకిష్టమైన వారితో బాంధవ్యాలు పెంచుకోవచ్చు. జీవులన్నీ ఏకమని నమ్మినా, వ్యక్తికి వ్యక్తికి మధ్యనున్న తేడాబట్టి మన ప్రేమను పంచుకోవచ్చు. 67

Eknath Gita Chapter 2 Section 11

Bhagavat Gita

2.11

యం హి న వ్యథయం త్వేతే పురుషం పురుషర్షభ {2.15}

సమదుఃఖ సుఖం ధీర౦ సో అమృతత్వాయ కల్పతే

పురుషశ్రేష్ఠుడవగు ఓ అర్జునా! ఈ మాత్రాస్పర్శములు సుఖదుఃఖముల యందు సమబుద్ధి కలిగిన ఏ ధీర పురుషుని బాధించలేవో అట్టివాడు కదా మోక్షము నొందుటకు అర్హుడగును

అనేక మతాలలో మరణాన్ని జయించే మార్గం చూపిస్తామనేవారు ఉన్నారు. వారి భక్తులు అది ఒక ఉపమానమని, దానికి శాస్త్రపరమైన ఊత లేదని తలుస్తారు. కానీ యోగులు కాలమే భ్రాంతి అని, అమృతత్త్వమే నిజమని అంటారు.

మనము మన బంధు మిత్రుల మరణ వార్తలను అప్పుడప్పుడు వింటూ ఉంటాము. కానీ వాటిపై "మరణం నాకూ కలుగుతుందా? దాన్ని దాటే మార్గం లేదా?" అని స్పందించము. నేను చిన్నప్పుడు నా గ్రామంలో అనేక మరణాలు చూసేను. ఎందుకంటే నా అమ్మమ్మ గ్రామంలో ఎక్కడ మరణం సంభవించినా నన్ను తోడు తీసికెళ్ళేది. అది నన్ను చాలా కలత పెట్టేది.

నా అమ్మమ్మ ఎందుకు అలా చేసేదో పెద్దయ్యేక తెలిసింది. ఆమె నన్ను మరణాన్ని అధిగమించే మార్గాన్ని అన్వేషించమని ప్రేరేపిస్తున్నాది. ఆవిడ ప్రేరణ వలన నేను తెలిసికున్న దేమిటంటే నడివయస్సులో కూడా నేను మరణంలో ఉన్నానని. అందువలన మరణాన్ని దాటి అమృతత్త్వాన్ని పొందాలని నిశ్చయించుకొన్నాను. నా సాధన కొనసాగుతున్నకొద్దీ మరణం గురించి నాలో ఉన్న భయాన్ని దాన్ని అధిగమించే శక్తిగా మార్చుకున్నాను.

ఐన్స్టీన్ ను ఒకరు తన సిద్ధాంతాలను ఎలా కనుకున్నారని అడిగేరు. ఆయన అంతకు ముందు ప్రపంచమంతా అంగీకరించిన సిద్ధాంతాలను ప్రశ్నించేనన్నారు. అలాగే ధ్యానంవలన మనలో మరణము తప్పదా అనే ప్రశ్నని అడగగలుగుతాం. ఇది ఒక తార్కికమైన విషయం కాదు. స్వీయానుభవం వలన మనకు విదితమయ్యేది మనకు మరణము లేదని. ఆ అవగాహన మనలను ఉత్తేజ పరిచి, చిన్న చిన్న కోరికలను త్యజింపజేసి, చివరకు మన శక్తినంతా అమృతత్త్వానికై వెచ్చి౦పజేయిస్తుంది.

గీత చెప్పేది మనం దేహంతో తాదాత్మ్యం చెందినంత కాలం మరణము తప్పదని. ధ్యానంలో దేహం మీదున్న స్థిరభావాన్ని తొలగించుకుంటాం. మన సాధన వలన భౌతికమైన చేతనాన్ని దాటి, స్వేచ్చాయుతమైన పురోగతిని పొందుతాము. 66

Viveka Sloka 47 Tel Eng

Telugu English All వేదాంతార్థవిచారేణ జాయతే జ్ఞానముత్తమమ్ । తేనాత్యంతికసంసారదుఃఖనాశో భవత్యను ॥ 47 ॥ వేదాంత విచారేణ- ఉపని...