Saturday, April 9, 2022

Eknath Gita Chapter 7 Section 20

Bhagavat Gita

7.20

నాహం ప్రకాశ స్సర్వస్య యోగమాయా సమావృతః {7.25}

మూఢో అయం నాభిజానాతి లోకో మా మాజమవ్యయమ్

యోగమాయచే కప్పబడి యుండుట చేత నేను అందరికి గోచరించువాడను కాను. అజ్ఞానులగు ఈ మానవులు నన్ను పుట్టుక లేని వానినిగ, నాశము లేని వానినిగ ఎరుగరు

మనమొక ప్రత్యక్ష సినిమా షూటింగ్ కి వెళ్ళేమనుకోండి. అక్కడ తారలందరూ మొహానికి రంగు పూసుకొని, వింత వింత వేషధారణాలతో చాలా అందంగా ఉండి మనను మైమరిపిస్తారనుకోండి. షూటింగ్ తరువాత వారు తమ రంగు తుడుచుకొని, తమ స్వంత దుస్తులు వేసికొని వస్తే మనము వాళ్ళను గుర్తించలేము.

మనము అ షూటింగ్ కొన్ని రోజులుగా కదలకుండా చూస్తే బయట ప్రపంచం గుర్తుకు రాదు. సమయమంతా సినిమాలు ఎలా తీస్తారో అన్న అంశం మీద వెచ్చించి వారి కేమెరాలు, దుస్తులు, రంగులు మొదలైన వాటిని అవగాహన చేస్తాం. ఎవరైనా బయటకెళదాం అంటే మనం ఇంతకన్నా వేరే ప్రపంచమేముంది అంటాం.

మన శాస్త్రాలు పెద్ద పాలపుంత నుంచి మన దేహం వరకు, సదా మారుతూ ఉన్న శక్తి మాయ అంటాయి. దాని వలన ప్రకృతి అంతా మాయ. అంటే అన్ని పదార్థాలు, మనస్సు, అహంకారం మారుతూ ఉంటాయి. కాలగమనం కూడా నిజంకాక మన మనస్సు వలనే జరిగి మాయకు లోబడి ఉంది. మనకి కనిపించే విశ్వం సంపూర్ణంలో ఒక చిన్న భాగము మాత్రమే. అది కలగానే వాడికి కల ఎంత నిజమో, అంత నిజము. కాని అది కలలాగే ఉండి, దాని నుంచి మేల్కొనవచ్చు.

మనము జీవితమనే కలనుంచి మేల్కొనడానికి ఇష్టపడం. నిజానికి మేల్కొనడం అంటే ఏమిటో తెలీదు. యోగులు చెప్పేది: మనకి ఆధ్యాత్మిక ఆనందం పొందాలనే అభిలాష ఎక్కువవుతున్న కొలదీ, మన కల పాతబడి, మనం ఆనందమయ స్థితిలో మేల్కొంటాం. శ్రీ రామకృష్ణ దేవత క్రీగంట చూపుతో మనవైపు చూస్తే మాయ పఠాపంచలవుతుందని చెప్పేరు.

ఒకమారు నారదుడు, శ్రీకృష్ణుడు వనంలో నడుస్తున్నారు. శ్రీకృష్ణుడు నారదుని ఏదైనా వరం కోరుకోమన్నాడు. దానికి సమాధానంగా నారదుడు సృష్టి రహస్యం చెప్పమన్నాడు. సరేనని శ్రీకృష్ణుడు నారదుడిని పొరుగున్న గ్రామం కెళ్ళి త్రాగటానికి నీళ్ళు తెమ్మన్నాడు. నారదుడు వెళ్ళి ఒక ఇంటి తలుపు కొట్టేడు. ఒక అందమైన యువతి తలుపు తెరిచింది. నారదుడు మోహితుడై తనను పెళ్లి చేసికోమని కోరేడు. ఆమె అందుకు అంగీకరించింది. క్రమంగా నారదుడు సంసారి అయి పిల్లలను కని, మనమలు, మునిమనవులతో సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఆ సమయంలో ఆ గ్రామానికి ఒక పెద్ద వరద వచ్చి నారదుని కుటుంబాన్నినీట ముంచేసింది. నారదుడు ఎంతో దుఃఖపడి శ్రీకృష్ణుని సహాయం కోరేడు. అంతలో శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై "నారదా నేను అడిగిన నీళ్ళు ఎక్కడ?" అని ప్రశ్నించేడు.

వెంటనే నారదునికి జ్ఞానోదమయి శ్రీకృష్ణుని కాళ్ళపై పడ్డాడు. ఈ విధంగా నారదుడు శ్రీకృష్ణుని మాయను తెలిసికొన్నాడు. 80

Eknath Gita Chapter 7 Section 19

Bhagavat Gita

7.19

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్య౦తే మా మబుద్ధయః {7.24}

పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్

అవ్యయమైనట్టియు, శ్రేష్ఠమైనట్టియు, సర్వోత్కృష్టమై నట్టియు నా యొక్క స్వభావమును తెలియని మూఢులు అవ్యక్త రూపుడనైన నన్ను వ్యక్త స్వరూపునిగ భావించుచున్నారు ఀ

బ్రహ్మన్ అనగా సర్వ సృష్టికి మూల కారణం. అది అవ్యక్తమై, లక్షణములు లేనిదై, శుద్ధమై ఉండేది. ఒకమారు ఆది శంకరులు గౌడపాద అనబడే యోగిని నర్మదా నది ఒడ్డున కలిసి, తనకు బ్రహ్మన్ గురించి చెప్పమని అడిగెను. ఆయన, నిర్గుణ బ్రహ్మన్ ఉపాసికుడైనందున, తన శిష్యుడైన గోవిందపాద వద్దకు వెళ్ళమని సూచించెను. గోవిందపాదుడు సగుణ బ్రహ్మను ఉపాసించినవాడై ఆది శంకరులకు గురువైనాడు.

నిర్వికల్ప సమాధి అనగా నిర్గుణ బ్రహ్మన్ యందు సంపూర్ణమైన, అఖండమైన చేతనముతో కూడిన తపస్సు. అది అందరికీ సాధ్యం కాదు. అందుకే చాలామంది సవికల్ప సమాధి లేదా సగుణ దేవతను పూజిస్తారు. భక్తుడు తన ఇష్ట దేవతకై ధ్యానము చేసి, ద్వంద్వ ప్రపంచంతో సంబంధమును వీడక యుండును. వానికి జ్ఞానము, జ్ఞేయము మధ్య తేడా ఉంది.

మనలో చాలామందికి సగుణ దేవతోపాసన మాత్రమే సాధ్యం. మనకి నిర్గుణ దేవతపైన ఆసక్తి ఉండవచ్చు. కానీ అది సరిపోదు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మనం ప్రేమించగలిగే, మనకు ఆదర్శప్రాయంగా ఉండే దేవత ఉండాలి. శ్రీ రామకృష్ణ ఇట్లు చెప్పెను: పరమాత్మ సగుణ మరియు నిర్గుణుడై యున్నాడు; రూపరహితుడైన నిర్గుణ బ్రహ్మన్, భక్తునికి సగుణ రూపమున కనబడుచున్నాడు.

శ్రీకృష్ణుడు ఎప్పుడైతే ధర్మమునకు హాని కలుగుచున్నదో తాను అవతారమును దాల్చుచున్నానని చెప్పెను. అతనికి సర్వ మానవ లక్షణాలు: నవ్వుట, ఏడ్చుట, మాట్లాడుట, తినుట మొదలగునవి ఉంటాయి. అవతార పురుషుడై పుట్టుక, మరణము పొందియున్నను అతడు నిజముగా అపరిమితుడు, అవ్యక్తుడు.

మనము దేవతలను మానవ రూపంలో ఊహించినట్టే, తక్కిన జంతువులు దేవుని తమ రూపములలో చూసుకొనవచ్చును. కాబట్టి దేవునికి ఒక స్వరూపానికే పరిమితము కాదు. మన ఇష్ట దైవము అందరికన్నా మిన్నని భావించుట వ్యర్థము. ఎందుకంటే అపరిమితమైన బ్రహ్మన్ ను, పరిమితమైన అవతారంలో బంధిస్తున్నాము. మాటలతో నిర్గుణ బ్రహ్మన్ ను పూజించడం సాధ్యం కాదు. 77

Eknath Gita Chapter 7 Section 18

Bhagavat Gita

7.18

అంతవత్తు ఫలం తేషాం తద్భవ త్యల్పమేధసా౦ {7.23}

దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి

దేవతల నారాధించువారు దేవతలనే పొందుచున్నారు. అల్పబుద్ధి గలవారు పొందెడి ఆ ఫలము నశించును. నా భక్తులు నన్నే పొందుచున్నారు.

ప్రతీ గాఢమైన కోరిక ఒక ప్రార్థన. మనమందరము చేతనపు లోతులలో సదా ప్రార్థన చేస్తూ ఉంటాము. మన ప్రార్థన గాఢంగా ఉండి, స్థిరంగా ఉంటే మనము జీవితాన్ని ప్రార్థన ఫలించినట్టుగా జీవిస్తాము. తేడా ఎక్కడంటే మనము దేని గురించి ప్రార్థిస్తున్నామో. మనం ఇంద్రియాలకు సంబంధించిన దేవతలను ప్రార్థిస్తే -- ధనము, హోదా, ఆనందము , కీర్తి ప్రతిష్ఠలు -- మనము ప్రపంచములో కూరుకు పోతాము. అట్లు కాక మన ప్రార్థన శ్రీకృష్ణునికై చేస్తే మనము క్రమంగా మార్పులన్నిటికీ అతీతమై, చివరికి మరణమనే మార్పునుకూడా అతిక్రమిస్తాము.

ప్రతిఒక్కరికీ ఎంతోకొంత నమ్మకం ఉంటుంది. మనము వాహనం ఎక్కేమంటే, దానికి ఇంజిన్ ఉందని, దాని చక్రాలు నడిమార్గంలో ఊడిపోవని, నమ్మకం ఉంటుంది. దానినే శ్రద్ధ అంటారు. మనం ఒక వస్తువు కొని, నాణెములు ఇస్తే మనకి, ఆ కొట్టు యజమానికి వాటిమీద శ్రద్ధ ఉంది. శ్రద్ధ లేకపోతే ఆర్థిక వ్యవస్థ కుప్ప కూలి పోతుంది.

మనం ఎలాగైతే నాణెములను నమ్ముతామో, మనము వేరని, దేహమని, మన వ్యక్తిత్వానికి , నడవడికకి జన్యువులు కారణమని నమ్ముతాము. పై శ్లోకాల్లో శ్రీకృష్ణుడు చెప్పేది: సదా మార్పు చెందే భౌతిక ప్రకృతితో తాదాత్మ్యం చెందితే, కాలం యొక్క ప్రభావం మన దేహం మీద చూపబడి చివరకు మరణం వరకూ దారి తీస్తుంది. కానీ శ్రద్ధను శ్రీకృష్ణుడు మీద పెడితే మన నిజస్వరూపమైన ఆత్మని తెలిసికొని, వృద్ధాప్యముచే బాధింపబడము. మన నమ్మకం ఇంకా బలిష్టంగా ఉంటే మనము శ్రీకృష్ణుడులో లీనమవుతాం.

శ్రీకృష్ణుని యందలి నమ్మకం మూఢమైనది కాదు. అది ఆధ్యాత్మిక విలువల యందు నమ్మకం. వాటియందు, స్వీయానుభవం వలన, గట్టి విశ్వాసం. మనం రాత్రి పడుక్కొని, ఉదయం లేచి శ్రద్ధ గలవారమైపోము. శ్రద్ధ కాల క్రమేణా వస్తుంది. యోగులు తాము చెప్పిన పద్ధతిని ఒక మారు ప్రయత్నించి చూడమని అంటారు.

ఇది భౌతిక శాస్త్రము వంటిదే. ఐసాక్ న్యూటన్ తన సిద్ధాంతాలను భక్తిభావం వలన చేయలేదు. ఆయనకు తన ఆలోచనా రీతి మీద గట్టి నమ్మకం ఉంది. ఆయన "చంద్రుని కదలికకు, ఆపిల్ చెట్టునుండి క్రింద పడుటకు ఏదో సంబంధం ఉండచ్చు" అని అనుకొన్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఉండచ్చు అన్న దృక్పధం. శ్రద్ధతో తన ఆలోచనతో కార్యాచరణము చేసి గురుత్వాకర్షణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించేడు.

మనలో చాలామంది న్యూటన్ చేసిన ప్రయోగాలు చెయ్యలేదు. కాని అతని సిద్ధాంతం నిజమని నమ్మేము. సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అసీసీ లేదా శ్రీరామకృష్ణ "మమ్మల్ని గెలీలో, న్యూటన్ లను నమ్మినన్త నమ్మరా? మేము ఎక్కడో చదువుకున్న లేదా వినిన జ్ఞానం చెప్పటంలేదు. జీవితాంతం చేసిన సాధనతో స్వీయానుభవం చెప్తున్నాము" అని అడుగుతారు.

బుద్ధుడు ఒక గ్రామని కొచ్చి తన బోధను చేస్తున్నాడు. ఒకడు లేచి ఇలా అడిగేడు: "మీరు మాకు నిర్వాణం గూర్చి చెప్పినది చాలా బాగుంది. మేమందరం దుఃఖాన్ని, బాధలను దాటే మార్గం కాంక్షిస్తున్నాము. మీరు చెప్పే మార్గం చాలా క్లిష్టమైనది. అది పనిచేయక పోతే మా జీవితాలు వ్యర్థమవుతాయి. మేము నిర్వాణమనేదాన్నిపొందగలమని ఎలా నమ్మడం?"

బుద్ధుడు తిరిగి ప్రశ్న వేసేడు: "ఇక్కడికి ఉత్తర దిశలో పర్వతాలేమయినా ఉన్నాయా?"

"హిమాలయాలు ఉన్నాయి"

"నీకేలా తెలుసు. నువ్వెప్పుడైనా హిమాలయాల్ని చూసేవా"

"లేదు. కానీ అందరూ ఉన్నాయని చెప్తారు. నా తండ్రి వాటి గురించి చెప్పేడు. గంగా నది అక్కడే ఆవిర్భవించింది."

"నీ తండ్రి ఆ పర్వతాల్ని చూసేడా"

"నా తండ్రి తన తండ్రి ద్వారా తెలిసికొన్నాడు. నా తాత మామయ్య హిమాలయాలను చూసేడు"

"బహుశా అతను ఊహించివుంటాడు"

"అతను మాకు అబద్ధం చెప్పలేదు. ప్రతి ఒక్కరికీ అతను నిజాయితీపరుడని తెలుసు"

"నీకు వినికిడి ద్వారా తెలిసికొన్న విషయంపై అంత నమ్మకముంటే, నిర్వాణాన్ని చూసిన వ్యక్తి నీము౦దు ప్రత్యక్షంగా ఉంటే ఎందుకు నమ్మవు?" అని బుద్ధుడు అడిగేడు. 75

Eknath Gita Chapter 7 Section 17

Bhagavat Gita

7.17

యో యో యాం యాం తమం భక్త శ్శ్రద్ధయా అర్చితు మిచ్చతి {7.21}

తస్య తస్యాచలా౦ శ్రద్ధాం తామేవ విదధా మ్యహమ్

యే భక్తుడు ఏ కోరికతో ఏ దేవతా రూపామును శ్రద్ధతో అర్చించుటకు అభిలషించుచున్నాడో వానికి స్థిరమైన అట్టి శ్రద్ధను నేనే కలిగించుచున్నాను

స తయా శ్రద్ధయా యుక్త స్తస్యారాధన మీహతే {7.22}

లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హి తాన్

ఆ శ్రద్ధతో అతడు దేవతుల నారాధించుచున్నాడు. ఆ తరువాత వాని ప్రియమైన కోరికలను దేవతల ద్వారా నేనే ఫలింప జేయుచున్నాను ఀ

శ్రద్ధకు అనేక అర్థాలు ఉన్నాయి. అది ఒక గాఢమైన కోరిక లేదా మన ఆలోచనలను, కర్మలను మలిచేది. అలాగే భక్తి ని కూడా సూచిస్తుంది. మన అభిప్రాయం, నమ్మకం కూడా శ్రద్ధ అనవచ్చు. మనం శ్రద్ధ వలన ప్రభావితమౌతాము. ఎందుకంటే మన నమ్మకాలు, అభిలాషలకు అణుగుణంగా మనం జీవిస్తాము.

పురాతనకాలంలో గ్రీకు దేశంలో మైదాస్ అనే వ్యక్తికి బంగారం మీద ఎనలేని ఆశ ఉంది. నిరంతరము బంగారం గురించే ఆలోచించేవాడు. ఒక దేవత ప్రత్యక్షమై వానికి ముట్టుకుంటే బంగారమయ్యే వరమిచ్చింది. వాడు పొంగిపోయేడు. తన దగ్గరున్న వస్తువులన్నిటినీ బంగారంగా మార్చేడు. తిందామని ఆహారాన్ని తీసికొ౦టే అది బంగారంగా మారింది. బంగారాన్ని తినలేడు కదా. సరే తోటలోకి వెళ్దామని నిశ్చయించుకొన్నాడు. అక్కడ ఒక అందమైన పూవుని ఆస్వాదించాలని ముట్టుకుంటే అది బంగారమయింది. అదే సమయంలో వాని కూతురు పరిగెట్టుకుంటూ వచ్చింది. వాడు ఆమెను ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తే ఆమె కూడా బంగారమయింది. చివరకు మైదాస్ భోరని ఏడ్చి దేవత ఇచ్చిన వరాన్ని వెనక్కు తీసికోమని వేడుకొన్నాడు.

మనం మైదాస్ లాగా ఒకే విషయం గురించి సుధీర్ఘమైన ధ్యానం చేసి దేవతలనుండి వరాలు పొందలే౦. కాని మైదాస్ శ్రద్ధ బంగారం మీద ఎలా ఉందో, కొందరికి ఆస్తులకై, పేరు ప్రతిష్ఠలకై అటువంటి శ్రద్ధ ఉంటుంది. వారికి తెలియకుండానే వారి కోర్కెలకై తమ ప్రేమను వెచ్చిస్తారు. ఏ వ్యక్తి మీదా ప్రేమను పెంచుకోరు. చివరకు తమ భాగస్వామితో కూడా ప్రేమ పంచుకోరు.

ఒకర్ని నిందించడంలో లాభం లేదు. ఈ కాలం అటువంటిది. మనమందరమూ దానివలన ప్రభావితమైనాము. కానీ మన శ్రద్ధను మార్చుకోగలిగే శక్తి మనకుంది. ధ్యానం ద్వారా మన నమ్మకాన్ని మనల్ని ఇతరులతో వేర్పాటు చేసేవాటినుండి -- అనగా ఆస్తి, పేరు, ప్రతిష్ఠ, కీర్తి మొదలైనవి-- దూరంగా ఉండి, ఇతరుల శ్రేయస్సుకై పాటు పడడానికి మలచాలి. 72

Eknath Gita Chapter 7 Section 16

Bhagavat Gita

17.16

కామై స్తై స్తైర్రుత జ్ఞానాః ప్రపద్యంతే అవ్యదేవతాః {7.20}

తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతా స్స్వయా

మానవులు తమ తమ స్వభావము ననుసరించి, కోరికలచే జ్ఞానమును జారవిడచుకొనిన వారై, ఆయా కోరికలకు సంబంధించిన దేవతల నారాధించుచు ఆ దేవతలనే చేరుచున్నారు

హిందువులు వివిధ నడవడికలు గలవారై, దానికి అణుగుణంగా దేవతులను ఆరాధిస్తారు. ఉదాహరణకి కుబేరుడు ధనానికి ప్రతీక. ఎవరైనా నేను కుబేరుని పూజిస్తున్నాను అంటే వానికి ధనార్జనము మక్కువ అని ఇతరులకు సులభంగా అర్థమవుతుంది. అలాగే లక్ష్మీ దేవి.

కాముడు లేదా మన్మథుడు కామమునకు ప్రతీక. అతడు 5 రకాల -- ఒక్కొక్క ఇంద్రియానికి -- బాణాలతో జనులను సమ్మోహితులను చేస్తాడు అని హిందువులు నమ్ముతారు.

ధనము, కామము ఈ రోజుల్లో మనను గజిబిజి చేసేవి. నాకిది కావాలి, అది కావాలి అనుకొంటూ ఉంటే బుద్ధి సక్రమంగా పనిచెయ్యలేదు. బుద్ధి ఆత్మను అనుసరించి మనచే జ్ఞానవంతమైన కార్యములను చేయించవలెను. కానీ ఎంతసేపూ కాముడు, కుబేరుడు గూర్చి ఆలోచిస్తూ ఉంటే బుద్ధి అన్ని దిక్కులా లాగబడుతుంది. కొన్నాళ్ళకు మనకు ఆదర్శవంతమైనది లేక, మన జీవితానికి లక్ష్యం లేదని భావిస్తాము.

సంపన్న దేశాల్లో ప్రసార మాధ్యమాలు దేవతలకు బదులుగా ధనాన్ని, కామాన్ని కలిగిస్తాయి. వాటిక తోడు హింస. టివి లోని హింసాకాండ తాత్కాలికంగా చూపించినా, అది మన చేతన మనస్సులో ముద్రితమై ఉంటుంది. కామమును ఎరగా పెట్టి టివి తమ ప్రేక్షకులను ఎక్కువ చేసికొ౦టారు. దానివలన ఆనందం లేకపోగా, నిజ జీవితంలో మాన భంగాలు పెరుగుతున్నాయి. ధనాన్ని జీవిత లక్ష్యంగా చేసికోవడం వలన ఆనందం కలుగకపోగా, మనుష్యులు, ఇల్లు, వాహనాల యందు నిర్లక్ష్యవైఖరి ఎక్కువ అయింది. క్రమంగా మనం అభద్రతతో జీవించడానికి అలవాటు పడ్డాం. ఇళ్ళలో సెక్యూరిటీ అలారం పెట్టించుకొని, తుపాకీలను ధరించి, మన భద్రతను కాపాడుకోడానికి ప్రయత్నిస్తున్నాము.

ప్రసార మాధ్యమాలతో బ్రతుకుతున్న వారిపై జాలి చూపాలి. ఎందుకంటే వారికి నిజ జీవితంలో ఆదర్శప్రాయంగా ఉండే వారు కనుమరుగైపోతున్నారు. ఇది పుస్తకాల ద్వారా, ఉపన్యాసాల్ల ద్వారా చెప్పేది కాదు. స్వీయానుభవము ఉంటే గాని సాధ్యమవ్వదు. దీనినే విజ్ఞాన మంటారు. మనము తెలివి నుపయోగించి ఒక సమస్యను పరిష్కరించవచ్చు. అది సరిపోదు. మన జీవితంలో ఆధ్యాత్మిక సిద్ధాంతాలు ఆచరణలో చూపాలి. గాంధీ మహాత్ముడు అట్టి యోగి. ఒక విలేఖరి ఆయనను ఒక సందేశం ఇమ్మని అడిగేడు. దానికి ఆయన సమాధానం ఒక కాగితం మీద "నా జీవితమే సందేశం" అని వ్రాసి ఇచ్చేరు. ఆయన స్వీయానుభవాలు అహింసా సిద్ధాంతం, రాజకీయ చాతుర్యములకే పరిమితం కాక దేశ ఆర్థిక , శిక్షణ వ్యవస్థలను కూడా ప్రభావితం చేసేయి. భవిష్యత్తులో చరిత్రకారులు నేటి యుగం అణుశక్తిదిగా కాక గాంధీ యుగమని వ్రాయవచ్చు.

ఒకడు కేవలం లాభానికే వ్యాపారం చేస్తే, అతడు ధనార్జనే జీవిత లక్ష్యం అనడానికి చిహ్నం. అతడు వాణిజ్యంలో పెట్టుబడులు, మదుపులు ఎలా పెట్టాలో అనర్గళంగా చెప్పగలడు. మరియు చిత్ర విచిత్ర స్థలాలకు -- మాన్టీ కార్లో, లాస్ వేగాస్ మొదలైన--సలవులలో వెళ్తాడు. డౌ జోన్స్ సూచిక గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటాడు. వాని జీవితం ఒక తెరిచిన పుస్తకములాంటిది. ఎవరైతే దాన్ని చదివితే తెలిసేది వాని లోభము వలన ప్రేమను పంచిపెట్టడు, ప్రేమను పొందడు. కానీ పరోపకారానికై జీవించే వ్యక్తికి ప్రేమ, జ్ఞానము రెండూ కలిగి ఇతరులకు ఆదర్శప్రాయుడవుతాడు. అట్టి వారు తమ గురించి ప్రచార మాద్యాలలో ప్రకటనలు ఇవ్వనక్కరలేదు. మనమే వారికై వెతికి, వారి జీవితాన్ని స్పూర్తి గా తీసికొ౦టాము.

Eknath Gita Chapter 7 Section 15

Bhagavat Gita

7.15

బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే {7.19}

వాసుదేవ స్సర్వమితి స మహాత్మా సుదుర్లభః

అనేక జన్మ పరంపల జ్ఞానమును సంపాదించిన జ్ఞాని సర్వమును వాసుదేవుడే యని గ్రహించి నన్నే సేవించుచున్నాడు . అట్టి మహాత్ముడు చాలా అరుదుగ నుండును

శ్రీకృష్ణుని మరొక నామము హరి అనగా చోరుడు. అతడు మన గుండెను చౌర్యము చేసి మనల్ని వెదకమని ప్రపంచంలోకి పంపించేడు.

ఇక్కడ శ్రీకృష్ణుడు పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తున్నాడు. మనము ఎన్నో జన్మలెత్తితేగాని ప్రపంచము స్థిరము కాదని దేవుడొక్కడే శాశ్వతమని తెలిసికోలేము. ఈ విధంగా స్వార్థ రహితమైనవారు ఎక్కువ పరిణామం పొందిన వారు. వారు జగత్తు క్రీడాస్థలమని ము౦దే తెలిసికొన్నారు. ఎవరైతే అట్లు తెలిసికోలేదో వారికి అనుభవం ఇంకా రాలేదు. ధనవంతుల ఇంట్లో పుట్టినవానికి ధనం విలువ తెలిసి దానిని తెలివిగా వాడుతాడు. వానికి ధనం యొక్క నిజమైన విలువ తెలుసు. కానీ మనలో కొందరికి నడిమంత్రపు సిరి వచ్చి వస్తువులకై ధనము వెచ్చిస్తాము. అలా వస్తువులు కొని కొంతకాలానికి అవి అన్నీ బొమ్మలవంటివని తెలిసికొ౦టాము. టివి క్రొత్తగా కనిపెట్టినపుడు పేద దేశాల్లో ప్రజలు విరగబడి చూసేవారు. వారికి టివి లో జరిగే సంభాషణ అర్థమవ్వక పోయినా అదే పనిగా చూసేవారు. సంపన్న దేశాల్లో టివి అన్నిచోట్లా ఉంది. అతి ఒక వింత వస్తువు కాదు. దాని వలన మనము పూర్ణమైన ఆనందమును పొందలేము. ఆనందము మనలోన ఉన్నది. ఎన్ని ఎక్కువ కోర్కెలు ఉంటే అంత ఎక్కువ విచారాన్ని పొందుతాము. అశాంతితో కూడిన జీవితం దేవుడిని పొందాలనే కాంక్షకు చిహ్నం. అప్పుడు మనము అంతర్ముఖులమై సంపూర్ణమైన ఆనందము, జ్ఞానము, భద్రత పొందుతాము.

అటువంటి ఆనందాన్ని పొందిన తరువాత విశ్వంలో దేవుడు తప్పిస్తే ఏదీ శాశ్వతము కాదని తెలిసికొ౦టాము. అది మేధకి సంబంధించినది కాదు. ప్రతీదీ భగవంతుని స్వరూపమని అవగాహన పొందుతాము. అదే వాసుదేవ సర్వం అంటే. సెయింట్ అంజిలా ఆఫ్ ఫాలిగ్ నో ఈ విధంగా చెప్పేరు:

నా ఆత్మ కన్నులు తెరిచి, దేవుని యొక్క పూర్ణత్వము చూసేను. తద్వారా సర్వ ప్రపంచం, ఇక్కడ మరియు సముద్రములకు ఆవల, మహా సముద్రపు లోతులలో కూడా చూసేను. వీటిలో దేవుని శక్తి తప్ప మరేదీ లేదని, నాకు వర్ణించడానికి మాటలు లేవని తెలిసికొన్నాను. అలా అబ్బురపడుతూ "ప్రపంచమంతా దేవునితో నిండి ఉన్నది" అని బిగ్గరగా అరిచేను. 66

Eknath Gita Chapter 7 Section 14

Bhagavat Gita

7.14

తేషాం జ్ఞానీ నిత్యయుక్తః ఏక భక్తిర్విశిష్యతే {7.17}

ప్రియో హి జ్ఞానినో అత్యర్థ మహం స చ మమ ప్రియః

ఈ నలుగురిలో నిత్య యుక్తుడును, ఏకాంత భక్తి కాలవాడును -- అగు జ్ఞాని శ్రేష్టుడు. అట్టి జ్ఞానికి నేను మిక్కిలి ఇష్టమైన వాడను. అతడు నాకును ప్రియుడై యున్నాడు.

ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతమ్ {7.18}

అస్థిత స్సహి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్

ఈ భక్తులందరు ఉదార చరితులే. జ్ఞాని మాత్రము సాక్షాత్తు నా స్వరూపమే. అతడు నాయందే మనసు నిలిపి నన్నే పరమగతిగ ఆశ్రయించి యున్నాడు

ఇక్కడ ముఖ్యమైనది: నిత్యాయుక్త. అనగా సదా శ్రీకృష్ణునితో ఏకమైనవాడు. అటువంటి వ్యక్తి శ్రీకృష్ణుని హృదయమునందు మిక్కిలి ఆనందమును నింపును.

శ్రీకృష్ణుడు "అటువంటి వ్యక్తిని చూస్తే, నువ్వు నన్నే చూస్తున్నావని" చెప్పెను. జీసస్ తన శిష్యుడు ఫిలిప్ తో అటువంటి భావాన్నే వచించేడు: "నువ్వు నన్ను చూస్తే, నా తండ్రిని చూసినట్టే". ఇది చాలామంది యోగులకు నివాళి: మోసెస్, మైస్టర్ ఎక్ హార్ట్, తెరెసా ఆఫ్ ఆవిలా, సెయింట్ ఫ్రాన్కిస్ ఆఫ్ అస్సీసీ, జాన్ వూల్ మన్, జలాలుదీన్ రూమి, శ్రీ రామకృష్ణ, గాంధీ. ఇట్టివారు మనలాగే జన్మించి, మనకన్నా ఎక్కువ బాధలు అనుభవించి, ధ్యానంతో, నిస్వార్థమైన జీవనంతో, మోక్షం పొందే వరకు జీవుల ఐక్యతను పెంపొందించేరు. మనం ఒక మూలకూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేసేవాడు మన మిత్రుడు లేదా బంధువు లా కాక, వాని ద్వారా పరమాత్మ తన కార్యాన్ని ప్రారంభిస్తున్నాడని తలంచవలెను. 66

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...