Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 3

Bhagavat Gita

10.3

మహర్షయ స్సప్తపూర్వే చత్వారో మనవ స్తథా {10.6}

మద్భావా మానసా జాతా యేషాం లోక ఇమాః ప్రజాః

లోకము నందలి ఈ జనులు ఎవరియొక్క సంతతియై యున్నారో అట్టి పూర్వీకులైన ఏడుగురు మహర్షులును, సనకాది దేవర్షులును, స్వయంభువాది మనువులును నా భావము గలవారై నా మానస పుత్రులై జన్మించిరి.

శ్రీకృష్ణుడు చెప్పిన సప్త ఋషులు: భృగు, మరీచి, అత్రి, పులః, పులస్త్య, క్రతు, అంగిరస. వీరు 7 రకాల చేతనములకు, భౌతిక ఎరుక నుంచి సర్వ జీవ సమైక్యత వరకు, చిహ్నములు. ఇంకా వీరు పరిణామ శక్తికి సంజ్ఞలు. అలాగే 4 మనువులు: స్వరోషిష, స్వయంభు, రైవత, ఉత్తమ. వీరు సృష్టి ఆరంభమున ఉండి దానిని కావింతురు. భగవంతుడు సృష్టి సిద్ధాంతాలన్నిటికీ మూల కారణము. కానీ అతడు ఋషులు మొదలైనవారికి తన బాధ్యతను అప్పచెప్పును.

గీత భౌతిక ప్రపంచము, ఆలోచనలు, భావములు గల అంతఃప్రపంచమునకు మధ్య తేడా ఉందని చెప్పదు. బయట ప్రపంచంలో ఉన్న ప్రకృతే, మన అంతఃప్రపంచంలోనూ ఉంది. మనకు ఇతరులకు బాధ కలిగిస్తే, మనలోనూ బాధ కలిగించే బీజాలు నాటబడతాయని తెలుసు. మన ప్రపంచం డ్రైవరు లేని బస్సు లాంటిది. అందరూ తమ సీట్లు వెతుక్కుంటూ, బస్సు గురించి ఆలోచించట్లేదు.

మనము అహింసను నివారించుటకు ప్రయత్నించవలెను. దానికి ముందు మనలోని క్రోధమును నియంత్రించవలెను. బయట జరుగుతున్న మారణ హోమానికి కారణం సామాజిక పరిస్థితులవలన కాక, మనలోని క్రోధము వలన. క్రోధం అతి పెద్ద మహమ్మారి. మనమెప్పుడైనా హింస చేసినా లేదా పరుషంగా మాట్లాడినా, మన వ్యాధిని ఇతరులకు వ్యాపింపజేస్తున్నాము.

ఉదాహరణకు రాముడు, సీత భార్యా భర్తలు అనుకొందాం. రాముడు ఉదయం లేచి సీత చేసిన కాఫీ బాగాలేదని విసుక్కు౦టాడు. సీతకి తిరిగి సమాధానము ఇవ్వాలని ఉంటుంది కాని ఊరకుంటుంది. రాముడు ఆఫీసుకు వెళ్ళి రోజంతా సీతకి ఏమి చెప్పాలని ఆలోచిస్తాడు. సీతకూడా అలాగే ఆలోచిస్తూ, షాప్ కి వెళ్ళి షాప్ యజమానిపై తన కోపం ప్రదర్శిస్తుంది. ఆ యజమాని తన క్రింద పనిచేసే వారిమీద ఆ కోపం చూపిస్తాడు.

ఇవన్నీ చిన్న విషయాలు. కాని రోజు రోజుకీ అవి పేరుకు పోతాయి. దాన్నే యోగులు సంస్కారమంటారు. అంటే మన చుట్టూ ఉన్న వానియందు మన౦ చూపించే స్పందన. ఇలాంటి కుసంస్కారము లోతుగా పాతుకొని ఉంటే, మనము చీటికీ మాటికీ క్రోధము ప్రదర్శిస్తాము. ఇది చూడాలంటే దిన పత్రికను చదవండి. అందుకే మనము క్రోధానికి బదులుగా ఓర్పు, సద్భావన చూపి, ఎల్లప్పటికీ అది చేజారకుండా చూసుకోవాలి.

ఇది మన మాటలలోనే కాదు. ముఖము యందు కూడా. ముఖము మనస్సుయొక్క అద్దం అన్నారు. నేను ఉపాధ్యాయుడుగా ఉన్నప్పుడు ఒక విద్యార్థిని ఉద్దేశించి "నీ ముఖం ఏడుపుగా ఉంది" అన్నాను. "అది నా సహజమైన ముఖం" అని వాడు బదులిచ్చేడు. "కానీ దానిని చూసే వాళ్ళం మేము" అన్నాను. ఇతరుల కొరకై మన ముఖ కవళిక మార్చుకోవాలి. ఇలాటి చిన్న చిన్న విషయాలు, చిలికి చిలికి గాలి వాన అయినట్టు, ప్రపంచాన్ని మారుస్తాయి. 208

Eknath Gita Chapter 10 Section 2

Bhagavat Gita

10.2

బుద్ధిర్జ్ఞా మసమ్మోహః క్షమా సత్యం దమ శ్శమః {10.4}

సుఖం దుఃఖం భవో అభావో భయం చా భయ మేవ చ

అహింసా సమతా తుష్టి స్తపో దానం యశో అయశః {10.5}

భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథగ్విధాః

బుద్ధి, జ్ఞానము, మోహము లేకుండుట, సహనము, సత్యము, దమము, సుఖము, దుఃఖము, భయము, అభయము, అహింస, సమత్వము, సంతృప్తి, తపస్సు, దానము, కీర్తి, అపకీర్తి మొదలగు అనేక గుణములు ప్రాణులకు నావలననే కలుగుచున్నవి

మనము ప్రపంచాన్ని ద్వంద్వాలతో చూస్తాము: మంచి - చెడు, తప్పు - ఒప్పు, ఆహ్లాదం - విషాదం. భగవంతుడు చంచల మనస్సు కలవాడు కాడు. అలాగే ప్రేమించకుండా ఉండేవాడు కాదు. ఇవన్నీ మనము ఏర్పరచుకొన్న విభేదాలు.

ఎడ్గర్ అల్లాన్ పో వ్రాసిన ఒక కథలో, ఒకడు మరొకని ఉత్తరం బహిర్గితం చేస్తానని ఏడిపిస్తూ ఉంటాడు. ఉత్తరం వ్రాసిన వాడు చివరకు పోలీసులను పిలుస్తాడు. వాళ్ళు ఏడిపిస్తున్నవాడి ఇంటికి వచ్చి ఆ ఉత్తరాన్ని ఇల్లంతా వెతుకుతారు. కానీ ఎక్కడా కనబడదు. చివరకు వాడు కూర్చునే బల్లమీద అందరికీ కనబడుతూ ఆ ఉత్తరం ఉంటుంది.

అలాగే దేవుడు విశ్వమంతటా మనకు నిత్యం కనబడుతూ ఉన్నాడు. కానీ మన మనస్సు ద్వంద్వాలతో కూడి ఉండటంవలన దేవుడు కనిపించటం లేదు.

ధ్యానం పరిపక్వమౌతున్న కొద్దీ మనకు తెలిసేదేమిటంటే మనస్సులో ఇష్టాయిష్టాలు ఎప్పుడూ కలుగుతూ ఉంటాయి. ఆ ప్రక్రియ అచేతన మనస్సులో జరగడంవలన మనకది సాధారణంగా కనబడదు. ఒకరిని పరికిస్తున్నప్పుడు మనస్సును విశ్లేషణం చెయ్యండి: "నాకు వాని నడక నచ్చలేదు. అది ఎంతో డాంబికంగా ఉంది. వాని గొంతుకు నచ్చలేదు. అది నాకు గగుర్పాటు కలిగిస్తుంది" అనే భావాలు కలుగుతాయి.

ఈ విధంగా మనస్సు పనిచేస్తుంటే ద్వంద్వాలకు అలవాటు పడ్డామని తెలుస్తుంది. దానివలన మన విశ్వాసం, సహనం, భద్రత మొదలగునవి చంచలంగా మారుతాయి. ఈ శ్లోకంలోని చెప్పిన లక్షణాలు మన జ్ఞానోదయానికి సహకరిస్తాయి. అసమ్మోహ అనగా ఎటువంటి భ్రాంతి లేకుండుట. అనగా ప్రపంచమంతా ఏకమైనదనే ఎరుక. దాని వలన ప్రపంచం ఇచ్చే డబ్బు, ఆనందం, పరువు, ప్రతిష్ఠ వలన సమ్మోహనము చెందము.

అహంకారము గలవారు సమ్మోహితులై మిత్రులతో వైరము కలిగించుకొనుట, ప్రమాదకరమైన క్రియలు చేయుట, మొదట ఆనందము కలిగించినా చివరకు నిరాశ కలిగించే మార్గాల మీద ప్రయాణ౦ చేస్తారు. ధ్యానం వలన మనకు కనువిప్పు కలిగి, ప్రపంచం మారలేదు, మనమే మారేమని తెలుసుకొంటారు.

క్షమ వలన మన అహంకారాన్ని జయించవచ్చు. క్షమ అనగా ఒకరిని క్షమించడం, ఓర్పు, సహనం, ఇతరులను అర్థం చేసికోవడం. మనని ఇతరులు పట్టించుకోవటంలేదు, మనకి వారు అన్యాయం చేస్తున్నారు అనే ఆలోచనలు బాధ పెడుతున్నప్పుడు ఓర్పు అవసరం. దాని వలన మన మనస్సు అనుమానాలతో, క్రోధంతో ఉండదు. మనం ఒకర్ని పలకరించి, వారి నుండి ఎటువంటి స్పందన రాకపోతే వారిమీద కోపం కలుగవచ్చు. తరువాత వాళ్ళు సమస్యలతో సతమతమవుతున్నారిని తెలిసికొని మన కోపం తగ్గి వారిని క్షమిస్తాము.

మనకు తీవ్రమైన సమస్యలు కలిగించిన వారితో సామరస్యంగా ఉండడం క్షమకి తార్కాణం. అలాగ ఏదో బలి పశువులా కాక, ఆనందంతో ఉండాలి. అలాగని మనము వారికి విధేయులమై ఉ౦డాలని భావించనక్కరలేదు. వారితో సహనం పాటించి బాంధవ్యం పెంచుకోవాలి.

మనము ప్రేమించే వారలతో విభేదం కలిగినప్పుడు వారికి మన విభేదాన్ని కరుణతో చెప్పాలి. ఇది ముఖ్యంగా పిల్లలకు వర్తిస్తుంది. శ్రీరామకృష్ణ మనకు విభేదం కలిగినప్పుడు పాము వలె బుస కొట్టాలి గానీ కరవ కూడదు అన్నారు.

సమ్మోహనాన్ని నియంత్రించుకోవాలంటే మనగురి౦చే ఎప్పుడూ ఆలోచించకూడదు. మనల్ని ఆనందింపజేసేవి, మనకు దుఃఖము కలిగించేవి, మనకు కావలిసినవి, మనకి అక్కరలేనివి అనే ద్వంద్వాల గురించి నిరంతరము ఆలోచిస్తూ ఉంటే, ఇతరులతో, చివరికి మనతో కూడా, వేర్పాటు చెందుతాము. కాబట్టి శ్రీకృష్ణుడు మనకు జీవితం ఇచ్చిన దానితో సంతృప్తి పడమని చెప్పేడు. భిక్షగాడివలె జీవితాన్ని "నాకు ఆనందాన్ని ఇవ్వు; బాధ కలిగించవద్దు" అని అడుక్కునే కన్నా, మనం దానం చేయగలిగినది ఏమిటి అని అడగాలి. ఇతరులకు మన సమయ౦, వస్తువులు, సమర్థత, వస్త్రములు, ఆహారము, ఏమైనా సంతోషంతో ఇవ్వాలి. మనమిచ్చేది విలువైనది కాకపోవచ్చు. కానీ మనము సంపూర్ణ హృదయంతో, ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా ఇవ్వాలి. మనకు ఎక్కువగా డబ్బు ఉన్నంత మాత్రాన సంపన్నులము కాదు; మనమెంత ఇతరులకు ఇస్తే --డబ్బు మాత్రమే కాక--మనమంత ధనవంతులమైనట్టు.

దీనికొక కథ చెప్తారు. ఒక వ్యక్తి ఎప్పుడూ తప్పు చేయక, అన్ని నియమాలను పాటించి, ఇతరులకు మంచి బోధ చేసి, వారితో ఎప్పుడూ సామరస్యంగా ఉండి, కొన్నాళ్ళకు ప్రాణం విడిచేడు. చిత్రగుప్తుడు వాని గురించి తన చిట్టాలో వెదకుతే ఎటువంటి తప్పులు, ఒప్పులు కనిపించలేదు. చిత్రగుప్తుడు ఆశ్చర్యపడి వానిని బ్రహ్మ దగ్గరకు తీసికెళ్ళేడు. "నువ్వే వీనిని సృష్టించేవు. వీనిని స్వర్గానికి పంపించాలో, వద్దో చెప్పు" అని చిత్రగుప్తుడు బ్రహ్మను అడిగేడు. బ్రహ్మ కూడా వానికి ఎటువంటి తప్పు, ఒప్పు లేదని తీర్మానించేడు. "వీనిని శ్రీకృష్ణుని వద్దకు తీసికివెళ్ళు" అని బ్రహ్మ దేవుడు సలహా ఇచ్చేడు. శ్రీ కృష్ణుడు వాని చిట్టా అంతా చూసి ఆ వ్యక్తి ఒకమారు బిచ్చగాడికి 5 పైసలు దానం చేసేడని కనుగొన్నాడు. "చిత్రగుప్తా, వీనికి 5 పైసలు ఇచ్చి మళ్ళీ ప్రయత్నం చెయ్యమని చెప్పి, వెనక్కి పంపించు" అని శ్రీకృష్ణుడు తీర్మానించేడు. 206

Eknath Gita Chapter 10 Section 1

Bhagavat Gita

10.1

శ్రీ భగవానువాచ:

భూయ ఏవ మహాబాహో శృణు మే పరమం వచః {10.1}

యత్తే అహం ప్రీయమాణాయ వక్ష్యామి హితకామ్యయా

అర్జునా! నా వచనము నాలకించి సంతసించుచున్న నీకు హితమును గోరి నేను మరల చెప్పుచున్న ఉపదేశమును ఆలకింపుము

న మే విదు స్సురగణాః ప్రభవం న మహర్షయః {10.2}

అహమాదిర్హి దేవానాం మహర్షీణాం చ సర్వశః

నా యొక్క పుట్టుకను దేవత లెరుగరు. మహర్షు లెరుగరు. దేవతల, మహర్షుల ఆవిర్భావమునకు అది కారణమైన వాడను నేనే గదా!

యో మా మజ మనా దిం చ వేత్తి లోక మహేశ్వరం {10.3}

అసంమూఢ స్స మర్త్యేషు సర్వపాపైః ప్రముచ్యతే

జన్మయు, ఆదియు లేనివాడను, సర్వలోక ప్రభువును అగు నన్ను తెలిసి కొనినవాడు మానవుల యందు అజ్ఞానము లేనివాడై సర్వకల్మషముల నుండి విడిపడుచున్నాడు

నేను బాల్యంలో స్కౌట్ గా ఉండేవాడిని. నేను, నా మిత్రులు ఖాకీ బట్టలు, ఆకుపచ్చని తలపాగా వేసుకొని అడవిలో ఒక ఆట ఆడేవాళ్ళం. అదేంటంటే ఒక జట్టు వెళ్ళి అక్కడక్కడా కొన్ని చిహ్నాలు పెడతారు. నా జట్టు వాళ్ళు వెళ్ళిన కొంతసేపటకి బయలదేరి ఆ చిహ్నాలను -- ఉదాహరణకి ఒక కొమ్మ మీద సుద్ధ ముక్కతో గుర్తు -- వెదకి, మా ముందు వెళ్ళిన జట్టు అడుగుజాడలను వెంబడించి వారిని పట్టుకోవాలి.

ఇదే దేవుడు కూడా చేసేది. మనము అతనిని వెతికి పట్టుకోవాలని తన చిహ్నాలను విశ్వమంతటా పెట్టేడు. ఎవరైతే సూక్ష్మ దృష్టితో, సాధనచేస్తారో వారు ఆ చిహ్నాలను వెదికి పట్టుకొని దేవుని చేరుతారు. మనలో చాలామంది ఆ చిహ్నాలను చూస్తారు. కానీ అవి దేవునివని గుర్తించలేరు. ధ్యానం చేస్తూ, ఓర్పుతో ఉండి, ఇతరులు విమర్శించినా వారిపై కోపము ప్రదర్శించకుండా, ఉండేవారిని చూసి "అతనిలో దేవుడున్నాడు" అని తలుస్తాము.

ఒకడు బుద్ధుని కలవాలని, ఎలాగైతే జంతువులను వాటి కాలి గుర్తులను పట్టుకొని వెదకుతామో, అలాగ ఊళ్ళు తిరుగుతున్నాడు. వెళ్ళిన ప్రతి ఊరులోనూ బుద్ధుని వలన ప్రభావితమైన వాళ్ళందిరినీ చూసి "ఇవి పెద్ద ఏనుగు చిహ్నాలు" అని కనుగొన్నాడు.

దేవుడు అన్ని చోట్లా ఉన్నా, ఆయన చిహ్నాలు అపరిమిత సృష్టిలో స్పష్టంగా కనబడుతాయి. ఎక్కడైతే పరిపూర్ణత ఉంటుందో -- మనుష్యులలో, చెట్లలో, నక్షత్రాలో--ఆయన అక్కడ ప్రకటితమౌతున్నాడు.

ఒక పెర్షియన్ యోగి ఇలాగ వ్రాసేడు:

తన అంతులేని, నిత్యమైన లక్షణాలు కనిపింపజేయడానికి, దేవుడు దేశ,కాలములనే పచ్చని భూములు సృష్టించేడు. విశ్వమొక తోట. ప్రతి ఆకులో, కొమ్మలో, పండులో అతని లెక్కపెట్టలేని గుణాలు ప్రకటితమౌతున్నాయి. 202

Eknath Gita Chapter 9 Section 25

Bhagavat Gita

9.25

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు {9.34}

మామేవైష్యసి యుక్త్వైవం ఆత్మానం మత్పరాయణః

నా యందే మనస్సు నుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్నే అర్చి౦పుము. నాకే నమస్కరింపుము. ఇట్లు నన్నే పరమగతిగ నమ్మిన నీవు తుదకు నన్నే పొందగలవు

శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జీవన రహస్యాన్ని ఒక్క మాటలో చెప్పాడు: మన్మనా అనగా నీ మనస్సు నాతో నింపుకో. మనస్సును దేవునితో నింపుకొని నిశ్చలంగా ఉంచండి. కలల్లో ఆయన్ని చూడండి, ఆయన బోధ వినండి. ధ్యానంలో ముందుకు సాగిన తరువాత భగవంతుడు మనం అతనియందు అనన్య భక్తితో ఉన్నామా లేమా అని మనను పరీక్షిస్తాడు. అతను ఒక నిరాశ కలిగించే సంఘటన చేసి, ఇప్పుడు ధ్యానం చెయ్యి అంటాడు. మన మనస్సు వికలమై "నీవు నాకింత నిరాశ కల్పించేవు. నేను ధ్యానం ఎలాగ చేసేది? నెను నిశ్చేష్టుడనైనాను" అంటే మనము ఆయన పెట్టిన పరీక్షలో నెగ్గలేము. కానీ మనం ఏకాగ్రతతో, చిత్త శుద్ధితో చాలా కాలం ధ్యానం చేస్తే, మనకెటువంటి సమస్యలు ఎదురైనా, మన మనస్సు దేవునియందు లగ్నమై ఉంటుంది. మనకెంత ప్రతికూలత కలిగినా, మన మనస్సు ప్రేమతో నిండి ఉంటుంది. అప్పుడు దేవుడు "నీవు ఉత్తీర్ణుడవు" అని చెప్తాడు. అప్పుడు మన సమస్యలు సమసిపోతాయి.

దేవుడొక్కడే మన అనన్య భక్తికి, ప్రేమకు అర్హుడని మనమెప్పుడు మరచిపోకూడదు. మన ధ్యానాన్ని ఇతర విషయాలవలన ఆపేయకూడదు. మన జీవితం ధ్యానంతో ముడిపెడితే ఆరోగ్యం, భద్రత, మేధ, సృజనాత్మక శక్తి తప్పక వృద్ధినొందుతాయి. మనమలా ప్రయత్నించి మన మనస్సును ప్రేమ, భక్తితో నింపుకొంటే, మనము తప్పకుండా అతనిలో లీనమవుతాము. 199

Eknath Gita Chapter 9 Section 24

Bhagavat Gita

9.24

మాం హి పార్థ! వ్యపాశ్రిత్య యే అపి స్యుః పాప యోనయః {9.32}

స్త్రియో వైశ్యాస్తథా శూద్రా స్తే అపి యాంతి పరాంగతిమ్

పాపపు జన్మము లెత్తినవారైనను, స్త్రీలును, వైశ్యులును, శూద్రులును అయినను నన్ను శరణు బొందినచో ఉత్తమమైన గతిని పొందుచున్నారు

కిం పునర్బ్రాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయ స్తథా {9.33}

అనిత్యమసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మామ్

ఇక పుణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుల విషయమునను, భక్తులగు రాజుల విషయమునను చెప్పదగిన దేమున్నది? కావున అనిత్యము, సుఖరహితము నైనట్టి ఈ లోకమును పొందిన నీవు నన్ను భజించి ముక్తుడవగుము

ఒక క్రింది వర్ణము బాలుడు శివభక్తుడు. వాడికి ఖాళీ దొరికినప్పుడల్లా శివుని ధ్యానిస్తూ ఉండేవాడు. ఆ ఊర్లోని శివాలయంలో ఉత్సవాలకి వెళ్లాలని తలచి తను పనిచేసే భూస్వామిని ఒక రోజు శలవు ఇమ్మని అడిగేడు. ఆ భూస్వామికి ఏ దేవుడి మీదా భక్తిలేదు. అతడు "నీకు శివుని గూర్చి ఏమి తెలుసు?" అని అడిగేడు.

"నాకు చదవడం, వ్రాయడం రాదు. శివుని గురించి నాకేమీ తెలియదు. కానీ శివ నామము నాకు ఎక్కువ ప్రీతి నిస్తుంది" అని బాలుడన్నాడు.

"అదంతా సరే. రేపు వరి పంట కోతకు వస్తుంది. కాబట్టి నువ్వు ఇక్కడుండి పని చెయ్యాలి. కోత రేపు ఉదయంలోపల చేస్తే నువ్వు ఉత్సవాలకు వెళ్ళవచ్చు" భూస్వామి అన్నాడు.

వరి కోయడం సాధారణంగా కొన్ని రోజులు పడుతుంది. కాబట్టి ఒక రాత్రిలో పంట కోత కోయడం సాధ్యం కాదు. ఆ బాలుడు ఇంటికెళ్ళి శివునిపై ధ్యానం చేసి "మంచివాడైన నా భూస్వామి పంట కోత అంతా చేస్తే నీ ఉత్సవాలకు వెళ్ళడానికి అనుమతి ఇచ్చేడు. నన్ను నువ్వే నీ ఉత్సవాలకు రప్పించు కోవాలి" అని ప్రార్ధించి పడుకున్నాడు.

మరుసటి ఉదయం గ్రామస్తులంతా వాని ఇంటి బయట గుమిగూడి "విచిత్రం, విచిత్రం" అంటున్నారు. ఎందుకంటే వరి కోత కోయబడి, బస్తాలలో చక్కగా పేర్చబడినది. భూస్వామి ఆ విషయం తెలిసికొని, ఆ బాలుని క్షమాపణ అడిగేడు. ఆ విచిత్రం ఎలా జరిగింది అని అందరూ బాలుని అడిగేరు. "నాకు శివుడంటే భక్తి. అతడు విశ్వానికి అధినేత. నేను నీ ఉత్సవాల కెళ్లాలంటే, ఒక చిన్న పని ఉంది. కాబట్టి సహాయం చేయి అని అడిగేను. దీనిలో విచిత్రమేముంది?" అని బాలుడు సమాధానమిచ్చేడు. ఇటువంటి భక్తి కొండలను కూడా కదిలిస్తుంది. అది మనమే వర్ణము వారలమైనా, సమాజంలో ఎంత పేరు ప్రతిష్ఠ ఉన్నా అలవరచుకోవచ్చు.

నేను ధనవంతులను కించపరచటంలేదు. కొందరు ధనవంతులు, గొప్పవారు విలాసంగా బ్రతికినంత మాత్రాన ఆధ్యాత్మిక జీవనానికి అనర్హులని చెప్పలేము. నా అనుభవంలో వైద్యులు, ఇంజనీర్ లు, న్యాయవాదులు, కళా కారులు, శాస్త్రజ్ఞులు ధ్యానాన్ని అలవరచుకోవచ్చు. వాళ్ళు తమ పనిలో ఎంత శక్తితో ఏకాగ్రత చూపిస్తారో, ప్రయత్నం చేస్తారో అంత ధ్యానం మీద పెడితే చాలా విజయవంతమౌతారు. ఎవరైతే ఏకాగ్రతతో పని చేస్తారో వారు ధ్యానంలో సులభంగా ముందుకు సాగుతారు. 198

Eknath Gita Chapter 9 Section 23

Bhagavat Gita

9.23

అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ {9.30}

సాధురేవ స మంతవ్య స్సమ్యగ్వ్యవసితో హి సః

మిక్కిలి దురాచారి యైనను, అనన్య భక్తి కలవాడై నన్ను భజించునేని, స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే యని గ్రహింపుము

క్షిప్ర౦ భవతి ధర్మాత్మా శశ్వచ్చా౦తిం నిగచ్ఛతి {9.31}

కౌన్తేయ! ప్రతిజానీహి న మే భక్తః ప్రణశ్యతి

అతడు శీఘ్రముగా ధర్మాత్ముడగుచున్నాడు. శాశ్వత శాంతిని పొందుచున్నాడు. అర్జునా! "నా భక్తుడు నశించడు" అని ప్రతిజ్ఞ చేయుము

ఈ శ్లోకాలు తరతరాలుగా అనేక భక్తులకు ఓదార్పుగా ఉన్నవి. మన గతం ఎలా ఉన్నా, ప్రస్తుత పరిస్థితి ఏమైనా, భగవంతుడు మనని విస్మరించడు. మనమంతా దేవునిము౦దు ఆశక్తులం. అలాగే అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసి ఉంటాం.

నేను అనేక తప్పులు చేసిన వారిగురించి తెలిసికొన్నది ఏమిటంటే: వారు పరులకై, కనీసం తమ కొరకై, మంచి జీవనము చెయ్యలేదు. వారు ఒంటరి వారై, బంధుమిత్రులకు దూరమై, మార్పు కోసమై నిరీక్షిస్తున్నారు. వారు గతంలో ఎన్నో తప్పులు చేసి ఉండవచ్చు. కానీ వారి హృదయాల్లో దేవుడు కొలువై ఉన్నాడని చెప్తాను. కాబట్టి వారిని తమ గతాన్ని పూర్తిగా మరచి, మంచి కర్మలు చేసి, అందరితోనూ సామరస్యంగా ఉండమని చెప్తాను.

జీసస్ చెప్పినట్లు మనమంతా దేవుని బిడ్డలం. మన నడవడిక ఎంత చెడ్డదైనా, ఒక తల్లి తన బిడ్డలను ఎట్టి పరిస్థితిలోనూ ఎలా విడనాడదో, దేవుడు కూడా మనని అలా ప్రేమిస్తాడు. బైబిల్ లో ఒక కథ ఉంది. ఒక ధనవంతుని కుమారుడు, తన తండ్రిని ఎదిరించ, కొంత ధనము తీసికొని పరదేశాలకు ప్రయాణమౌతాడు. అనేక ప్రదేశాలు తిరిగి, డబ్బును భోగాలకై వెచ్చించి, తిండి లేని స్థితిని పొందుతాడు. చివరికి జ్ఞానోదయము కలిగి, పరదేశంలో ఆకలితో మరణించేకంటే, తన తండ్రికి శుశ్రూష చెయ్యడ౦ మేలని నిర్ణయించుకొని, తన తండ్రి ఇంటికి వెళ్తాడు. తండ్రి వానిని అత్యంత ఆదరంతో ఆహ్వానించి వానిని క్షమిస్తాడు.

ప్రతి సమాజంలో మనకంటే పెద్ద తప్పులు చేసిన వారు, వాటిని సరిదిద్దుకొని మనకంటే ఎక్కువ మన్నన పొందిన వారున్నారు. వారు ఇతరులకు హాని చేసి, క్రోధంతో, హింసతో బ్రతికేరు. కానీ అటువంటి వారే చివరకు ఆధ్యాత్మిక సాధనలో ముందుకు వెళ్ళేరు. ఉదాహరణకు అశోకుడు. సెయింట్ తెరెసా దేవుడు సూర్యుని వలె తన ప్రేమను పంచి పెడుతున్నాడు అనెను. కొందరు తెర దించి చీకటిలో బ్రతుకుతారు. వారు ఎప్పుడైతే తెర ఎత్తుతారో తమ బ్రతుకులను ప్రకాశవంతంగా చేసుకొంటారు.

నా చిన్నప్పుడు అమ్మాయిలు వంట నేర్చుకొంటున్నప్పుడు అన్నాన్ని మాడ్చడం లేదా కొంత కూరని నేల మీద పడేయడం చేసేవారు. వారి తల్లులు లేదా అత్తలు వారిని విమర్శించేవారు. నా అమ్మమ్మ వంట నేర్చుకోవాలంటే చేతులు కాలాలి, కొంచెం పదార్థం నేల మీద చిందాలి అని వాళ్ళకు సద్ది చెప్పేది. కానీ ఆ పిల్లలకు "మీరు అదే పనిగా చేతులు కాల్చుకోవడం లేదా అన్నాన్ని నేల పాలు చేయడం మంచిది కాదు" అని చెప్పేది. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా. నా దగ్గరకు చాలా మంది వచ్చి తాము ఎన్నో తప్పులు చేశామని చెప్తారు. మనమంతా గతంలో ఏదో తప్పు చేసినవారలమే అని చెప్పేవాడిని. కానీ వారు అవే తప్పులను మళ్ళీ మళ్ళీ చేసి నన్ను నిరాశ పరిచేవారు.

మనందరికీ బలహీనతను అధిగమించి మంచి మార్గంలో నడిచే సామర్థ్యం ఉంది. కొందరు అనారోగ్యం కలిగించే ఆహారం కొన్నేళ్లగా తింటూ, ఆ అలవాటును ఒక్క మారు మార్చుకొంటారు. కొందరు క్రోధంతో నిండి ఉండి, ధ్యానం చేసి, తమ క్రోధాన్ని కరుణగా, పగని ప్రేమగా మార్చుకొంటారు. మనము కొన్ని దశాబ్దాలు చెడు నడవడికతో గడిపినా, ధ్యానం వలన కొద్ది కాలంలోనే చెడు నడవడికను మార్చుకోవచ్చు. మనమెంత స్వార్థంతో, ధూమపానం చేస్తూ, మద్యాన్ని సేవిస్తూ బ్రతికినా శ్రీకృష్ణుడు క్షిపరం భవతి ధర్మాత్మా అని చెప్తాడు. అంటే మనం మన ఆత్మను ప్రక్షాళనము చేసి, చెడు అలవాట్లతో క్షీణించిన శరీరాన్ని, మనస్సును ధృడంగా చేసుకోవచ్చు.

మన ఆధ్యాత్మికత బలపడుతున్న కొద్దీ మన గతంలో చేసిన తప్పులు జ్ఞప్తికి వస్తాయి. అలాటప్పుడు అపరాధ భావన లేదా విచారము పొందనక్కరలేదు. మంత్ర జపము మనను కడతేరుస్తుంది. మన తప్పులను విశ్లేషణము చేసి వాటికి అపరాధ రుసుము ఎలా చెల్లించాలని సతమతమవడం అవసరము లేదు. ఒకరు దూరపు మిత్రుని పెంపుడు కుక్కని అవమానించవచ్చు. ఆ విషయం ధ్యానంలో జ్ఞప్తికి వచ్చి, క్షమాపణ చెప్పాలని వారు తమ మిత్రుడుని వెదుక్కొంటూ వెళ్ళనక్కరలేదు. దాని బదులు ఒక కుక్కని పెంచుకోవచ్చు లేదా వీధి కుక్కలకు ఆహారం ఇవ్వచ్చు. అలాగే ఒకరు మిత్రుడ్ని అవమానిస్తే, వానికే క్షమాపణ చెప్పడంతో ఆగి పోనక్కరలేదు. ఇతరులను అవమానించ కుండా, మనలోని దేవుని క్షమాపణ పొంది, ఇతరులు తనను అవమానించినా వారిని తిరిగి అవమానించకుండా బ్రతకవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ "ఇతరులను మనము క్షమిస్తే, మనము క్షమించబడతాము" అని చెప్పెను.

కానీ అలా చెయ్యడం ఎలా? మనం గత స్మృతులను వెలిక తీసికోవడం వ్యర్థమని తెలిసికొని, మరల గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా ఎలా నియంత్రించుకోవాలి? ఇక్కడ ధ్యానం చెయ్యడం తప్ప వేరే మార్గం లేదు.

బుద్ధుడు మనం పాపాలు చేసినందుకు శిక్షింప బడం; పాపాల వలన శిక్షింపబడతాం అన్నాడు. గుండెజబ్బు, రక్తపు పోటు మొదలగు వ్యాధులు మనం తినే ఆహారం వలన, మన చెడు అలవాట్ల వలన, పర్యావరణ కాలుష్యం వలన కలుగుతున్నాయి. వీటన్నిటినీ మనం నివారించుకోవచ్చు.

ధ్యానంలో ప్రవేశించేటప్పుడు, మొదట మన ఆహార౦ విషయంలో శ్రద్ధ అవసరం. రుచులు కాకుండా, శరీరానికి పోషకాహారము అందించాలి. వాహనం మీద ప్రక్క వీధికి వెళ్ళడం కంటే, కాలి నడకన వెళ్ళవచ్చు. మంత్రాన్ని జపిస్తూ వ్యాయామం చేస్తే మానసిక వొత్తిడి తగ్గి, శరీరం స్వస్థతో ఉంటుంది. మనకి సలవులు వస్తే ఇతరులకు ఉపయోగపడని విధంగా సలవులను గడపడం కంటే, పరోపకారానికై సేవ చెయ్యవచ్చు. ఈ విధంగా మనం గత స్మృతులను నియంత్రించి, చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు.

దేహ శుద్ధితో పాటు మానసిక స్థితినికూడా మెరుగు పరచుకోవాలి. కొంతమందికి దేహం బలంగా ఉంటుంది. కాని వారు ఒ౦టరితనం, అశాంతి, అభద్రత అనుభవిస్తారు. ధ్యానం వలన వారు తమ మానసిక స్థితిని మార్చుకోవచ్చు. దీనికి శారీరిక మార్పులకన్నా ఎక్కువకాలం పడుతుంది. శ్రీకృష్ణుడు షష్వచ్చా౦తిం నిగచ్ఛతి అంటాడు -- అనగా తక్కువ కాలంలోనే, హృదయంలో శాంతి నెలకొంటుంది. ఇతరులతో శాంతియుతంగా బ్రతకడం వీలవుతుంది.

శ్రీకృష్ణుడు, కుంతీ తనయునికి, ఇంకా ఇలా బోధ చేసెను "ఇంద్రియాలు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, ప్రపంచం ఎదురు తిరిగినప్పుడు, నన్నెవరైతే భక్తితో సేవిస్తారో వారికి ఎటువంటి హాని జరగదు". ఈ అభయాన్ని ఎంతో మంది యోగులు పొందేరు. ఇది ఒక ఆధ్యాత్మిక సిద్ధాంతం 196

Eknath Gita Chapter 9 Section 22

Bhagavat Gita

9.22

సమో అహం సర్వభూతేషు స మే ద్వేష్యో అస్తి న ప్రియః {9.29}

యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్

నేను సర్వప్రాణుల యందును సమముగ యున్నాను. నాకు శత్రువులేడు. ఇష్టుడునూ లేడు. ఎవరయితే నన్ను భక్తితో సేవించుచున్నారో వారు నాయందును, నేను వారి యందును ఉందును

శ్రీకృష్ణుడు తనకు ఇష్టమైనవారు ఎవ్వరూ లేరు అని చెప్పుచున్నాడు . ఒకరి జాతి, లింగము, పుట్టిన ప్రదేశం, సమాజంలో పలుకుబడి ఏమైనా తనకు పట్టింపు లేదు అని చెప్పెను.

కానీ శ్రీకృష్ణుడు స చ మె ప్రియాః అనగా "నేను వారితో సంపూర్ణమైన ప్రేమతో యున్నాను" అని చెప్పెను. దాని అర్థము "ఎవరైతే సంపూర్ణ హృదయముతో నన్నుసేవిస్తారో, ప్రతి జీవిలోనూ నన్ను చూస్తారో, నేను వారిని ప్రేమించి, రక్షిస్తాను". ఇంకా "నేను ఆనంతము. నన్ను నక్షత్ర వీధులు పరిమితం చేయలేవు." అనికూడా చెప్పెను.

ఈ శ్లోకం ద్వారా మనకు దేవుని అంశ అయిన మన ఆత్మపై ఆరాధనా భావం కలుగుతుంది. బుద్ధుడు మన దేహము బలహీనమైన కుండ వంటిదనెను. విశ్వమంతా వ్యాపించిన భగవంతుడు ఈ కుండలోనూ ఉన్నాడు. ఒకరిని నమస్తే అని పలకరించడం వారిలోని పరమాత్మను ఉద్దేశించి గానీ వేరే ఏమీ కాదు.

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...