Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 28

Bhagavat Gita

10.28

యచ్చాపి సర్వభూతానాం బీజం తదహమర్జున {10.39}

న తదస్తి వినా యతస్యా న్మయా భూతా౦ చరాచరమ్

అర్జునా! సకల భూతములకు బీజమును నేనే. ఈ చరాచర భూత ప్రపంచమున నేను కానిది ఏదియును లేదు.

నేనీ మధ్య స్పినోజా వ్రాసిన పుస్తకాన్ని చదువుతున్నాను. ఆయన యూదుల దృష్టిలో, ఎలాగైతే మైస్టర్ ఎక్హార్ట్ క్రిస్టియన్ ల దృష్టిలో సంప్రదాయేతరమైన వాడో, అంత సనాతన మైన వాడు కాడు. స్పినోజా చెప్పిన కొన్ని విషయాలపై నేను స్పందించి ఏకీభవిస్తాను. నేటి శాస్త్రజ్ఞులు, నాస్తికులైనా, ఆయనతో ఏకీభవించవచ్చు. స్పినోజా దేవుని పదార్థము అంటారు. దేవుడు ఒక్కడే నిజం, తక్కినదంతా ఆయన నీడ అంటారు. అర్జునుడు తత్త్వాన్ని అంత తెలిసిన వాడు కాదు కనుక, శ్రీకృష్ణుడు "నేను లేక, దేనికీ ఉనికిలేదు. నేను అన్ని చోట్లా ఉన్నాను" అని చెప్పెను.

స్పినోజా అన్నారు: ఒక వృత్తం గురించి తెలుసుకొంటే ఎలాగైతే తక్కిన వృత్తాల గురించి తెలుసుకొంటామో, భగవంతుని తెలిసికొంటే విశ్వం గూర్చి తెలిసికొన్నట్టే. నేను ఇల్లు కట్టేవాడిని ఒక క్లిష్టమైన భవనాన్ని కట్టమంటే, వాడు కొన్ని ఇటుకలు, కర్ర ముక్కలు తీసుకొచ్చి కట్టడం మొదలపెట్టడు. ముందు ఒక ప్రణాళిక వేసి, దాన్ని కాగితం మీద లేదా కంప్యూటరు లో గీస్తాడు. అలాగే భగవంతుడు ప్రతి చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రణాళిక చేసి సృష్టిని గావిస్తాడు.

కొన్ని సంప్రదాయాలలో దేవుని ఇల్లు కట్టేవాడు (architect), లేదా నమూనాకారుడు (designer), లేదా విశ్వానికి గడియారాలను చేసేవాడు (watchmaker) గా వర్ణిస్తారు. మన సంప్రదాయంలో దేవుని ప్రణాళిక వేసేవాడులా కాక బీజాన్ని సృష్టించిన వానిగా వర్ణిస్తాము. అందుకే శ్రీకృష్ణుడు ఇక్కడ "నా బీజం అన్ని జీవులలోనూ చూడవచ్చు" అంటాడు. ఎలాగైతే ఒక బీజంలో కంటికి కనబడని జన్యువులకు అనేక చెట్లను పుట్టించగల సామర్థ్యం ఉందో, సృష్టి అంతా దేవునిలో నిక్షిప్తమై ఉంది. 267

Eknath Gita Chapter 10 Section 27

Bhagavat Gita

10.27

దండో దమయతామస్మి నీతిరస్మి జిగీషతాం {10.38}

మౌనం చైవాస్మి గుహ్యానాం జ్ఞానం జ్ఞానవతామహమ్

దండించువారి యొక్క దండమును నేనే. జయశీలురు యొక్క నీతిని నేనే. రహస్యములలో నేను మౌనమును. జ్ఞానవంతులలో నేను జ్ఞానమునై యున్నాను.

శ్రీకృష్ణుడు నీతే కాదు నీతిని అమలుపరిచేవాడినని చెప్పుచున్నాడు. మనం చేసే ప్రతి తప్పుకి ఒక పర్యావసాన ముంటుంది. మనం ఎక్కువ తినకూడదని ఏ చట్టమూ లేదు. కానీ దానివలన కడుపు నొప్పి వస్తుందనే సిద్ధాంతం మన కణాల్లో ఉంది.

నేను పడవ ప్రయాణాల గురించి ప్రకటనలను దినపత్రికల్లో చదువుతున్నాను. అవి క్రొత్త ప్రదేశాలను, లేదా క్రొత్త భాషలగురించి తెలిసికోవడం గురించి కాక తిండి గురించే ఉన్నాయి. ఒక ప్రకటనలో తమ పడవలో 22 వంటశాలలు ఉన్నాయి, 181 వంటవాళ్ళు ఉన్నారు, ఒకరోజు వండిన వంట మళ్ళీ వండకుండా మిమ్మల్ని ప్రపంచమంతా తిప్పుతాము అని వ్రాసేరు. నా ఉద్దేశంలో అతిగా తినడంవలన ఊబ కాయం, అజీర్ణం మొదలగు ఇబ్బందులు కలుగుతాయి. అవి మన౦ తినే ఆహారాన్ని నియంత్రించడంవలన మాత్రమే సరి అవుతాయి. గీత మన ఆరోగ్యం, భద్రత, ఆనందం జన్మ హక్కు అంటుంది. కానీ ఆ హక్కుని పొందాలంటే జ్ఞానవంతమైన ఎన్నికలు చేసుకోవాలి.

శ్రీకృష్ణుడు తాను నాయకులలో రాజనీతిజ్ఞుడను (statesman) అని చెప్పుచున్నాడు. ఆయని రాజనీతి చాలా ఉన్నతమైనది. అది చెడ్డవారిపై దయ, హింసకి బదులుగా అహింసతో కూడిన నిరోధం (non-violent resistance) మొదలగు అంశాలతో కూడినది. మనలో చాలామంది హింసతో సమస్యలను పరిష్కరించగలమని తలుస్తాము. జీవితం గురించి తెలిసినవారు పగను పగతో సాధించలేమంటారు. బుద్ధుడు ప్రేమతోనే పగ చల్లారుతుందని చెప్పెను. ఈ సిద్ధాంతాన్ని ఉల్లంఘించలేము. మనము సంబంధాలలో అది పాటించకపోతే దుఃఖం అనుభవిస్తాము. మనము పరిణామ సిద్ధాంతం ప్రకారం, అరణ్యంలో ఉండే జంతువుల నుండి క్రమంగా చట్టబద్ధమైన జీవితంతో మనుష్యులుగా కొనసాగేము. జీసస్ చెప్పినట్టు "నన్ను తిట్టే వాళ్ళను దీవించు; నా మీద పగ పట్టినవారికి మంచి చెయ్యి".

మనం దేవుని సిద్ధాంతాలను వ్యతిరేకిస్తే ఏమవుతుందో ఊహించడం కష్టం కాదు. ఇది వ్యష్ఠి కి, సమిష్ఠి కి కూడా వర్తిస్తుంది. ఎట్టి పరిస్థితులలోనూ హింసను హింసతో అరికట్టలేము. మొదటి ప్రపంచ యుద్ధం శాశ్వతమైన శాంతిని స్థాపించడానికని నమ్మేరు. వర్సయిల్స లో జరిగిన ఒడంబడికలో జర్మనీని దోషిగా నిర్థారించడంవలన ఆ దేశానికి తీరని అవమానం కలిగింది. ఇది రెండవ ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఆ రోజుల్లో యుద్ధం వలన శాంతి రాదని నమ్మినవారు చాలా తక్కువ. ఇప్పుడు అలా కాక ప్రపంచమంతా ఏకమే, జీవులన్నీ ఏకమే, ఒక చోట యుద్ధం జరిగితే మనల్నందిరినీ బాధ పెడుతుంది అని నమ్మేవారు ఎక్కువమంది ఉన్నారు. 266

Eknath Gita Chapter 10 Section 26

Bhagavat Gita

10.26

వృష్ణీనాం వాసుదేవో అస్మి పాండవానాం ధనంజయః {10.37}

మునీనామప్యహం వ్యాసః కవీనా ముశనా కవిః

నేను యాదవులలో వాసుదేవుడను. పాండవులలో అర్జునుడను. మునులలో వ్యాసుడను. కవులలో శుక్రాచార్యుడను

శ్రీకృష్ణుడు అవతార పురుషుడు మరియు బ్రహ్మన్ కి సమానమైన వాడు. ఒకే బ్రహ్మన్ వివిధ రూపాలలో కనిపిస్తున్నాడు. అవతారంగా శ్రీకృష్ణుడు మానవ రూపంలో భూమ్మీద పుట్టేడు. అలాగే మరణించేడు. కాని బ్రహ్మన్ అలాకాక పుట్టుకలేక, మరణములేక ఉండును. జీసస్ క్రైస్ట్ కూడా మేరీ మాతకి పుట్టి, పెరిగి, చివరకు శిలువ వేయబడ్డాడు. ఆయన అవతారాన్ని చాలించేడే గాని, ఉనికి మాత్రం పోగొట్టుకోలేదు. అలాగే బుద్ధుడు రాజ వంశంలో పుట్టి, భార్యా పిల్లలను పొంది, చివరకు నిర్వాణం పొందేడు. వీరి విషయాల్లో తెలిసికొనవలసినది ఏమిటంటే ఒకే శక్తి -- అనగా బ్రహ్మన్ -- వివిధ రూపాల్లో భాసిస్తోంది. భూమి మీద మన ఉనికి పోయినా, ఆ సృజనాత్మక శక్తిలో మన ఉనికి ఎప్పుడూ ఉంటుంది.

నేను, నా భార్య ఒకమారు బృందావన్ కి వెళ్ళాలా లేదా తాజ్ మహల్ కి వెళ్ళాలా అనే సందిగ్దంలో పడ్డాము. చివరకు మేము బృందావన్ కి రైలు బండిలో వెళ్ళేము. ఆ ప్రదేశంలో ఆవులు వాటిని నడిపే గోపాలులు ఎక్కువ కనబడ్డారు. ఒకానొకప్పుడు శ్రీకృష్ణుడు తన లీలలను చూపి అక్కడి వారిని మంత్రముగ్దులను చేసేడు. అలనాటి గోవర్ధన పర్వతం ఇప్పటికీ ఉంది.

గోవర్దన పర్వతం గురించి ఒక కథ చెప్తారు. ఇంద్రుడు శ్రీకృష్ణుని అవతార పురుషుడు అవునో కాదో పరీక్షించ దలచి, వరుణుడ్ని కుండపోతగా వర్షాన్ని కురిపించమని అజ్ఞాపించేడు. అప్పుడు బృందావనమంతా నీటిలో మునిగిపోతున్నది. అప్పుడు శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని మనం గొడుగును ఎత్తినట్టు తన చిటికెన వేలుతోనెత్తి ప్రజలను రక్షించేడు.

అలాగే ఒకమారు బ్రహ్మ దేవుడు గోవులను, గోపాలులను ఒక గుహలో బంధించేడు. శ్రీకృష్ణుడు బహురూపుడై తలిదండ్రులను ఆనంద పరిచేడు. బ్రహ్మదేవుడు ఆ విషయం తెలిసికొని, సిగ్గుపడి, గుహలోని వారలిని విడిపించేడు.

ఈ విధంగా శ్రీకృష్ణుడు తన మాయా శక్తితో ప్రజలను మోహింప జేసేడు. శ్రీకృష్ణుడు తాను పాండవులలో అర్జునుడినని చెప్పెను. అర్జునునికి అది చాలా సంతోషం కలిగించి ఉండవచ్చు. అతను శ్రీకృష్ణుని సంపూర్ణముగా నమ్మి, వేరొకరి ధ్యాస లేక ఉన్నవాడు.

అటు పిమ్మట శ్రీకృష్ణుడు ఋషులలో తాను వ్యాసుడునని చెప్పెను. వ్యాసుడు గొప్ప ఋషియే కాక కవిత్వము కాచి వడబోసిన వాడు. ఆయనే మహాభారతాన్ని రచించేడు. చివరగా శ్రీకృష్ణుడు కవులకు కవి అయిన శుక్రాచార్యుడనని చెప్పెను. అంటే మనలోని లలిత కళా ప్రజ్ఞను -- కవిత్వము, చిత్రలేఖనము, నాట్యము, సంగీతము మొదలగునవి--దేవుని సేవకై ఉపయోగించిన మనము బాగా రాణించి జీవులతో ఐకమత్యము పొందుతాము. కాళిదాసు ఒకమారు ఇలా వ్రాసెను "నేను మరుగుజ్జువలె నుండి ఎత్తుగా నున్న పండ్లను కోసుకొనడానికై ప్రయత్నిస్తున్నాను. నాకు కవిత్వము రాదు. కవిత్వము వచ్చే ఉంటే నా రచనలను దేవునికి అ౦కితం చేసేవాడిని". ఆతని నిస్వార్థ ప్రేమను గని కాళీ మాత ప్రత్యక్షమై, నాలుకపై బీజాక్షరాలను వ్రాసినది. అప్పటినుంచి అతడు తన పేరును కాళిదాసుగా మార్చుకొని సంస్కృతంలో అనేక గ్రంధాలు వ్రాసి కవికోవిదుడైనాడు. 264

Eknath Gita Chapter 10 Section 25

Bhagavat Gita

10.25

ద్యూతం ఛలయతామస్మి తేజస్తేజస్వినా మహం {10.36}

జయోస్మి వ్యవసాయో అస్మి సత్త్వ౦ సత్త్వవతామహమ్

కపటుల జూదమును, తేజోవంతుల యొక్క తేజమును, జయశీలుర జయమును, ప్రయత్నమును, సాత్త్వికుల యొక్క సత్త్వగుణమును నేనే ఀ

జూదం ఆడేవారు తమ ఆడే విధానమును సమర్థించుకొంటారు. వారు అనేక పరాజయాల తరువాత విజయం పొందవచ్చు . కానీ అది క్షణికం. వారు నిజంగా వెతుకుతున్నది శాశ్వతమైన ఆనందం. అది తెలియక వారు తమ ఆస్తులను కూడా ఫణంగా పెట్టి తమ అలవాటును కొనసాగిస్తారు. వాళ్ళు తమ ఆనందానికి తప్పు త్రోవలో వెదుకుతున్నారు. ఒకమారు నా మరదలు ఇలా అడిగింది: "ఒకడు రాత్రి పూట ప్రక్క వీధిలో ఒక నాణెం పోగొట్టుకొన్నాడు. కాని దానిగురుంచి ఈ వీధిలో వెదుకుతున్నాడు. ఎందుకు?". ఎందుకంటే ఈ వీధిలో కాంతి ఉంది, ప్రక్క వీధిలో లేదు. జూదం ఆడేవాళ్ళ పరిస్థితి ఇదే. మనం కూడా ఆనందం కొరకు పెడత్రోవలు తొక్కుతా౦. చివరకు ఆనందం మనలోనే ఉందని గ్రహిస్తాం.

తరువాత శ్రీకృష్ణుడు వ్యవసాయ -- అనగా ప్రయత్నం -- గురించి చెప్పేడు. ఎక్కడైతే నిస్వార్థ సేవకై ఉత్సాహంతో పని చేస్తారో, అక్కడ భగవంతుడు ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఇది వక్రంగా చేసే ప్రయత్నానికి వర్తించదు. అంటే ప్రొద్దునే లేచి అర్థరాత్రి వరకు పనిచేసి, మరుసటి రెండు రోజులూ పడుక్కోవడం దేవునిచే ప్రభావితమైన ప్రయత్నం అనబడదు. కొందరు ఒక పని ప్రారంభించి కొన్నాళ్ళకు ఉత్సాహం కోల్పోయి వేరొక పని చెయ్యడం మొదలు పెడతారు. మరికొందరు ఆరు నూరైనా, నూరు ఆరైనా మిక్కిలి పట్టుదలతో పనులు చేస్తారు. అటువంటివారు ఏ రంగంలోనైనా విజయం పొందుతారు. కాబట్టి శ్రీకృష్ణుడు జయోస్మి అంటాడు -- అనగా తాను విజయాన్ని అంటాడు. మహాత్మా గాంధీ "ఏ ఒక్కరైనా గట్టి ప్రయత్నం చేసి, సదా ఆశ, విశ్వాసాలతో ఉంటే నేను సాధించినది సాధించగలరు. సంపూర్ణమైన ప్రయత్నం, సంపూర్ణమైన విజయాన్నిస్తుంది" అని అన్నారు.

మనం ఆధ్యాత్మిక సాధనలో గట్టి ప్రయత్నం చేస్తే, క్రమంగా కుండలిని శక్తి ఆవిర్భవిస్తుంది. అలా కుండలిని శక్తి విడుదలైనవారు పట్టుదలతో, ఏకాగ్రతతో, ధృఢ నిశ్చయంతో, అజేయమై తమకు ఎటువంటి ఆటంకం వచ్చినా లక్ష్యాన్ని చేరుకొంటారు. యోగులు ఆ శక్తిని అగ్నితో పోలుస్తారు.

చివరకి సమాధి పొందినప్పుడు, ప్రతీదీ మారుతుంది. ఆ స్థితిలో ఉన్నవారు ఎంత ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటారంటే మనం వారి శక్తి క్షీణించిందని తప్పుగా భావిస్తాం. వారి శక్తి క్షీణింపక, అనేక రెట్లు లేదా అపరిమితం అయ్యింది. కానీ అది వారి సంపూర్ణ స్వాధీనంలో ఉంది. ఇది ఎలాగంటే పాత కారులో రెండు క్రొత్త ఇంజిన్ లు పెట్టి నడిపినట్టు. కొందరు కుండలినిని కాంతి అంటారు. మూలాధార చక్రంనుంచి పైకి వెళుతున్నప్పుడు కుండలిని అగ్ని రూపంలో ఉంటుంది. అదే సహస్రార౦ చేరితే కాంతి రూపము దాల్చి మన చేతన మనస్సును ఆవరిస్తుంది. అప్పుడు దానిని తేజస్సు అంటారు. శ్రీకృష్ణుడు అదే అందరిలోనూ, సూర్యునిలోనూ, నక్షత్రాలలోనూ ఉన్నది అన్నాడు. కబీర్ ఇలా అన్నారు:

నా దేహంపై చంద్రుడు కాంతి ప్రసరిస్తున్నాడు

కానీ నా రెండు గ్రుడ్డి కళ్ళు దానిని చూడలేవు

చంద్రుడు నాలోనే ఉన్నాడు

అలాగే సూర్యుడు కూడా 261

Eknath Gita Chapter 10 Section 24

Bhagavat Gita

10.24

బృహత్సామ తథా సామ్నా౦ గాయత్రీ ఛ౦దసామహం {10.35}

మాసానా౦ మార్గశీర్షో అహ మృతూనాం కుసుమాకరః

సామవేదములో బృహత్సామము, ఛ౦దస్సులలో గాయత్రి, మాసములలో మార్గశీర్షము, ఋతువులలో వసంత ఋతువును నేనే ఀ

సామావేదాన్ని అధ్యయనం చేసేవారు దానిని ఒక కీర్తనలా పాడుతారు. ఎందుకంటే అది అంత రసవత్తరంగా ఉంటుంది. కానీ ఎటువంటి పఠనం గాఢ ధ్యానంలో అధ్యయనం చేయడానికి సమానం కాదు. ఎందుకంటే ఆ పదములమీద దృష్టి కేంద్రీకరించి, చేతన మనస్సులో ప్రతిధ్వనిస్తూ ఉంటే ఆ ఆనందం చెప్పనలవి కాదు. అది ఎటువంటి ఇంద్రియ సుఖాలకన్నా మిన్న.

ఋగ్వేదంలోని గాయత్రి మంత్రాన్ని కొన్ని వేల సంవత్సరాలనుంచి పఠిస్తున్నారు. గాయత్రి అంటే పఠనం చేసే వారిని అన్ని క్లేశాలనుండి రక్షి౦చేది. నాకు తెలిసిన స్విట్జర్లాండ్ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా గాయత్రీ మంత్రాన్ని పాటలా పాడుతాడు. కానీ దాని ఫలం పొందాలంటే మనకి సంగీతం రానక్కరలేదు. దేవుడు మన పఠనాన్ని విని స్వరం ఎక్కడో తప్పిందని అనడు. ఆయనకు కావలసింది మన౦ ఆ మంత్రాన్ని వీలయినప్పుడల్లా, ఏకాగ్రతతో, చిత్త శుద్ధితో, ప్రేమతో జపించడం.

మాసాలలో శ్రీకృష్ణుడు తాను మార్గశీర్షమని అంటాడు. అది తెలుగు క్యాలెండర్ లో మొదటి మాసం. బహుశా శ్రీకృష్ణుడు మనల్ని నూతన సంవత్సరంలో తనని జ్ఞప్తికి ఉంచుకోమని చెప్తున్నాడు. ఋతువులలో తాను వసంత ఋతువని చెప్పెను. ఎందుకంటే వసంత ఋతువు క్రొత్త ఆరంభం సూచించి ప్రపంచాన్ని అందంతో, సంతోషంతో నింపి ఉంచుతుంది. 259

Eknath Gita Chapter 10 Section 23

Bhagavat Gita

10.23

మృత్యు స్సర్వహరశ్చాహం ఉద్భవశ్చ భవిష్యతాం {10.34}

కీర్తి శ్శ్రీర్వాక్చ నారీణాం స్మృతిర్మేధా ధృతిః క్షమా

సర్వమును హరించు మృత్యువును నేనే. జనించబోవు వారలకు జన్మమును నేనై యున్నాను. మరియు స్త్రీలలో కీర్తి, సంపద, వాక్కు, స్మృతి, బుద్ధి, ధైర్యము, ఓర్పును నేనే

శ్రీకృష్ణుడు మృత్యుః సర్వహరః -- అనగా తాను మృత్యువును కూడా--అని చెప్పుచున్నాడు. ప్రతి మంచి గురువు ఇదే చెప్తాడు. అది మన హృదయానికి హత్తుకొంటే మన సారస్వతము ఆధ్యాత్మిక సాధనకై వెచ్చిస్తాము. ఒక్క రోజు కూడా మృత్యువుని జయంచడానికి వృధా చెయ్యము. మృత్యువు మీద జయించడానికి ఒక జీవిత కాలం ఎక్కువేమీ కాదు. అందుకే వొక్క రోజు వృధా చేసినా అది మన గుప్పెట్లో౦చి జారిపోతుంది.

హిందూ, భౌద్ధ సాంప్రదాయములలో మృత్యువుని జయించడానికి ఒక జీవిత కాలం సరిపోదని చెప్తారు. మనం అనేక జన్మలు మృత్యువుని జయించడానికై ఎత్తేము. పునర్జన్మ గురించి నా పిల్ల ఇలా చెప్పింది: "నేను ఎల్లప్పుడూ మరణించి నట్లు ఉండలేను." భగవంతుడు ప్రేమ పూరితుడు. మనను చిరకాలం జన్మ లేకుండా ఉంచడు. ప్రతి మానవ జన్మలోనూ మరణాన్ని జయించే అవకాశం ఉంది, కాని మనం వేరే పనుల్లో మునిగి దానిని విస్మరిస్తాం. ఈ విధంగా మనం శోధన చేస్తూ ఉంటే దేవుడు సహనంతో ఎదురుచూస్తాడు. మన లక్ష్యం మరణాన్ని దాటిపోవాలి అని తెలిసికొనకపోతే మనకి విశ్రాంతి సమయమిచ్చి మళ్ళీ జన్మ ఇస్తాడు.

మనలను ప్రేమించేది మన తండ్రే కాదు. బెంగాల్ లో జగన్మాత అనబడే పరా శక్తిని పూజిస్తారు. ఒక తల్లి తన బిడ్డను ఎలా ప్రేమిస్తుందో భగవంతుడు కూడా మనల్ని అలా ప్రేమిస్తాడు. మనము ఆ పరా శక్తి బిడ్డలం కూడా. శ్రీకృష్ణుని హిరణ్యగర్భుడు అని కూడా అంటారు. అనగా విశ్వ యోని. దానినుంచి సమస్త విశ్వము ఆవిర్భవించింది. ఉపనిషత్తులలో చెప్పిన కొన్ని విషయాలు నేటి ఖగోళ శాస్త్రం కూడా చెప్పుచున్నది. విశ్వం వ్యాపించి వ్యాపించి చివరకు పరా శక్తి దానిని తనలోకి లాక్కుని, మరల సృష్టి చేస్తుంది. క్రిస్టియన్ యోగులు "మనమందరము దేవుని నుంచి వచ్చి, భక్తితో ఉండి, చివరకు ఆ పరాశక్తి దగ్గరకే వెళతాం" అని చెప్తారు.

శ్రీరామకృష్ణ మనమందరమూ స్త్రీలను పరా శక్తి అంశలుగా చూడాలని అనేవారు. దాని అర్థం ఏవే లక్షణాలు ఒక పరిపూర్ణమైన స్త్రీకి ఉంటాయో, అవే లక్షణాలు పరిపక్వమయిన యోగిలో కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు చెప్పే స్త్రీ లక్షణాలు పురుషులకు కూడా వర్తిస్తాయి. దీనికి అర్థనారీశ్వరులు తార్కాణం. సహజంగా స్త్రీ, పురుషుల లక్షణాలు ఉన్నాయి. కానీ అవి ఒకటి నొకటి కలుపుకొని ఉంటాయి. గాంధీ సత్యాగ్రహంలో ఒక యోధుడిలా ఉద్యమించేరు. అలాగే చిన్న పిల్లలను, వ్యాధి గ్రస్తులను సున్నితంగా చూసేవారు. ఆయనలో మంచి పురుష గుణాలు, స్త్రీ గుణాలు మిళితమై ఉన్నాయి. దానిలో వైరుధ్యం, వివక్ష, పోటీ లేదు. స్త్రీలు ఒక్కరే అటువంటి పురుషుని ప్రేమించరు. పురుషులొక్కరే అటువంటి స్త్రీని ప్రేమించరు. ప్రతిఒక్కరూ గాంధీ వంటి వారిని ప్రేమిస్తారు.

నేను కేరళలో పుట్టిన కుటుంబంలో మాతృదేవతలను సేవిస్తారు. . తక్కిన భారత దేశంలో పితృదేవతలను సేవిస్తారు. తర తరాలుగా కేరళలో స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉన్నాయి. నేను పుట్టిన ఉమ్మడి కుటుంబంలో ప్రతిరోజూ మగ, ఆడ వారలతో కలిసిమెలసి ఉండేవాడిని. మా మాతృమూర్తులు సహనంతో ఆ విలువలు నాకు అందజేసేరు. నా కుటుంబంలోని నా ఈడు ఆడవారు ఇతరులను ముందు పెట్టి ఓర్పుతో వారిని సంతృప్తి పరిచేవారు. అదే సామర్థ్యం బాలులకు ఏ వయస్సులోనైనా, ఎంత ప్రయత్నించినా రాలేదు. నా అమ్మమ్మ ఆ సంప్రదాయానికి చిహ్నం. ఆమె వద్దనుండే నేను శ్రీకృష్ణుడు చెప్పిన లక్షణాలు స్త్రీ పురుషులకు వర్తిస్తాయని తెలిసికొన్నాను.

మొదటి లక్షణం శ్రీ అనగా అందము. అది బాహ్య అందము గూర్చి కాదు. అది నిశ్వార్థులైన వారి కళ్ళల్లో ప్రకటితమయ్యే అంతర్గతంగా ఉండే కాంతి. నా అమ్మమ్మకు అటువంటి కాంతి ఎల్లప్పుడూ ఉండేది. మా కుటుంబంలో పెళ్లి చూపులు అవుతున్నప్పుడు ఆమె స్త్రీలలో శ్రీ ఉందో లేదో చూసేది.

రెండవ లక్షణము ధృతి అనగా విశ్వాసము. ఇది ఈ రోజుల్లో కనుమరుగైంది. ఆడ మగ బాంధవ్యాలలో, అనగా లైంగిక విషయాల్లో, విశ్వాసము ఒక పాత పద్దతి అని, అది అసహజం అని అనుకునే రోజులివి. కానీ విశ్వాసము లేనిదే ప్రేమించడం సాధ్యం కాదు.

నేను అమెరికాకి మొదట వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు స్వేచ్చ గురించి మాట్లాడేవారు. ఆడా మగా ఎలాగైతే బంధంలోకి ప్రవేశించారో, అలాగే విడిపోవచ్చు అని చెప్పేవారు. ఇది చెడ్డ వారి బారినుండి విముక్తి పొందే మార్గం సులువు చేయడానికని చెప్పేవారు. నేను "అవును, చెడిపోయిన బాంధవ్యం లోంచి విడిపోవచ్చు. దానికి విద్యుక్త౦ (obligation) లేదు. బంధాలు లేవు. కానీ ఇది పదే పదే సార్లు అయితే మనం ప్రేమించగలిగే శక్తి క్షీణిస్తుంది."

ప్రేమకి విశ్వాసం చాలా ముఖ్యం. ఎవరైతే "నువ్వు నాకు నచ్చిన పనులు చేస్తూ వుంటే నీతో కలసి ఉంటాను. లేకపోతే విడిపోతాను" అని చెప్తారో, వారిలో ప్రేమలేక ఉదాసీనత ఉంది. ఒకరిని ప్రేమించడమంటే: వారు మనని బాధ పెట్టినా సాహిస్తాం; వారు మనకి కష్టం కలిగించే పనులు చేసినా తిరిగి వారిపై పగ తీర్చుకోము; వారు మనయందు క్రోధంతో ఉన్నా తప్పించుకు తిరగం. మానవులందరూ తప్పులు చేస్తారు. మనకు ఇతరుల తప్పులు సహించే సహనం లేకపోతే శాశ్వతమైన బాంధవ్యాలు అనుకూలించవు.

నేను స్త్రీ పురుషుల మధ్యన ఉండే బంధాలు ఎప్పుడూ ఆదర్శంగా ఉండాలని చెప్పటంలేదు. ప్రసార మాధ్యమాలు ఎంత చెప్పినా, మనము ఒకరిని ప్రేమించడం సులభం కాదు. దానికై అతి శ్రమ పడాలి. ముఖ్యంగా ఆ బంధం శాశ్వతంగా ఉండాలంటే ఇంకా గట్టి ప్రయత్నం చెయ్యాలి. సహజంగా స్త్రీ పురుషుల మధ్య భేదాలు ఉంటాయి. కవల పిల్లలు ఒకే మూసలో పుట్టినప్పటికీ, వారి మధ్య విభేదాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగే వారిలో విభేదాలు ఉండకూడదు అనడం మిథ్య.

కాబట్టి మనకు క్షమ అవసరం. క్షమ అంటే సహనం, ఓర్పు, తట్టుకునే శక్తి. క్షమ ఎంత అవసరమంటే అది రాజ యోగం గురించి శ్రీకృష్ణుడు చేసిన బోధకు సరిసమానమైనది. అది ప్రతి మనిషికి --వేరే మతస్తులయినా సరే-- వర్తిస్తుంది.

కవులు, గాయినీ గాయకులు, ప్రేమ గురించి ఎంతో చెప్తారు. కాని వారు క్షమ గురించి మాట్లాడరు. కాని ఒకరిని అన్ని పరిస్థితుల లోనూ ప్రేమించాలంటే మనకు ఎంతో సహనం ఉండాలి. మనం పుట్టుకతోనే క్షమ తో ఈ ప్రపంచానికి రాలేదు. దానికై మనము సాధన చెయ్యాలి. ఒకానొక పరిస్థితిలో ఇతరులు మనపై ప్రతికూలంగా ఉంటే, ప్రతీదీ మనకు అణుగుణంగా లేకపోతే మనం వేర్పాటు పడకుండా వారితో కలసిమెలసి ఉండాలి. మొదట్లో అది కష్టమనిపించవచ్చు. కానీ పెదవి కొరుక్కొని, నవ్వు ముఖంతో మన మనస్సులోని భావాలు బయటకు పొక్కకుండా, దయతో మన౦ మెలగాలి.

నా తోటలో అనేక పళ్ల చెట్లు ఉ౦డేవి. వాటిని నేను చాలా కాలం పట్టించుకోలేదు. అందువలన అవి ఒకదాని మీద మరొకటి పెరిగి చిందరవందరగా ఉండేవి. నేను వాటిని సమంగా చేయాలని, వాటి కొమ్మలను,ఆకులను కత్తిరించేను. అవి చూడ్డానికి చచ్చి పోయిన చెట్లుగా కనిపించేయి. కాని వర్షాలు పడిన తరువాత వాటి రూపురేఖలు మారిపోయాయి. క్రొత్త ఆకులు, కొమ్మలు రావడం మొదలయింది.

మనం రెండు మూడు దశాబ్దాలు అహంకారంతో, ఇష్టం వచ్చినట్లు చేస్తే దానిని అరికట్టడం అంత సులభం కాదు. అలాగే మనమేదీ పరిపూర్ణంగా చెయ్యలేము. కొన్నిసార్లు మన౦ సాఫీగా ఉంటాం. కానీ ఎక్కువమార్లు నవ్వడానికి బదులు, చిరునవ్వు నవ్వడం లేదా మంత్రం జపించుకొంటూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాం. ఇది మన చెడు అలవాట్లనబడే కొమ్మలను, ఆకులను కత్తిరించినట్టే. అలాగ కొంతకాలం సహిస్తే, మార్పు రాక తప్పదు. మన క్రొత్త నడవడిక పూవులవలె పూసి, కాయలవలె కాసి, మనకు సంపూర్ణమైన సంతృప్తిని ఇస్తుంది 258

Eknath Gita Chapter 10 Section 22

Bhagavat Gita

10.22

అక్షరాణా మకారో అస్మి ద్వంద్వస్సామాసికస్య చ {10.33}

అహమేవాక్షయః కాలోధా తా అహం విశ్వతోముఖః

అక్షరములలో నేను అకారమును. సమాసములలో ద్వంద్వ సమాసమును నేనే. అనంతమైన కాలమును, అనంత ముఖములు గల ధాతను నేనై యున్నాను

సంస్కృతంలో మొదటి అక్షరం అకారం. శ్రీకృష్ణుడు తాను అకారాన్ని అని చెప్పడంలో అర్థం అతడు జీవులకు మూలం. జీసస్ తాను ఆల్ఫా, ఒమేగా అని చెప్పెను. మనము అతని నుండి ఉద్భవిస్తాం, మళ్ళీ అతనిలోనే ఐక్యమవుతాం. మనము ప్రపంచంలో మన తలిదండ్రుల వలన జన్మించి యుండవచ్చు. కానీ మనము నిజముగా భగవంతుని నుండి వచ్చేము.

ద్వంద్వము వ్యాకరణానికి చిహ్నం. సంస్కృత రచయితలు చిన్న, చిన్న పదాలను కలిపి సమాసాలు, అలంకారాలు చేస్తారు. ఇంకో రకమైన ద్వంద్వాలు ఆనందము-దుఃఖము, వేడి-చలి, నష్టం-లాభం మొదలగునవి. ఎప్పుడూ మారే ప్రకృతిలో ద్వంద్వాలు సహజంగా ఉంటాయి. మనము స్వేచ్ఛగా ఉండాలంటే ద్వంద్వమోహమును -- మనము ఎడంగా ఉన్నామనే భ్రమను -- జయించాలి.

శ్రీకృష్ణుడు తాను కాలాన్ని అని ముందు చెప్పియున్నాడు. ఇక్కడ తాను ఆద్యంత రహితమైన కాలాన్ని అని చెప్పుచున్నాడు. ఇది ఆద్యంత రహితమైన ప్రస్తుతము. దానిని గాఢమైన ధ్యానంలో, ప్రపంచం యొక్క ఎరుక లేనప్పుడు, అనుభవిస్తాము. మనము కాలము సాపేక్షితము (relative) అని గ్రహిస్తాము. కాలం యొక్క గమనం మనస్సుతోనే గ్రహిస్తాము. కాలానికి స్వతహాగా మారే గుణము లేదు.

మనకి ఏకాగ్రతతో నచ్చిన పని చేస్తున్నప్పుడు కాల గమనం తెలీదు. పతంజలి ఇది బయట ప్రపంచంలో లేనిది, మన ఏకాగ్రత వలన కలిగినదని చెప్పును. అదే నచ్చని పని చేస్తే కాలం దుర్భరంగా నడుస్తున్నాదని తలుస్తాము.

ఐన్స్టీన్ ఒకమారు సభలో ప్రసంగం వింటున్నారు. ఆయనకు ఆ ప్రసంగం నచ్చలేదు. అప్పుడు ఆయన తన ప్రక్కవాని చెవిలో "నేను సాపేక్షితను కనుగొన్నాను. కాని ఈయన అనంత కాలం కనుగొన్నాడు" అని చెప్పేరు.

ధ్యానంతో మనస్సును నిశ్చలం చేసికొంటే మనము ఆద్యంత రహితమైన కాలంలో గడపవచ్చు. అప్పుడు మనము నచ్చిన లేదా నచ్చని క్రియలపై సమతుల్యంగా ఉంటాము. ఇంకా గతం, భవిష్యత్తు మన మనస్సులోనే ఉన్నాయని తెలిసికొంటాం. దానివలన మన గతంలో చేసిన తప్పులు బాధించవు , లేదా భవిష్యత్తులో ఏమి జరగబోతుందో అనే తపన ఉండదు. మన౦ గతం, భవిష్యత్తు నిజమని ఎందుకు అనుకుంటామంటే గతంలో మనం చేసిన క్రియలు, ఇతరులు మనకు తెచ్చిన కష్టాలు, భవిష్యత్తులో చేయబోయే క్రియలు, ఇతరుల వలన కలగబోయే కష్టాల గూర్చి ఆలోచిస్తూ ఉంటాము కనుక. గతం, భవిష్యత్తు నిజము కావు. కానీ వాటి గూర్చి ఆలోచనలు నిజం.

కొన్ని సంవత్సారల క్రితం నేను ఒక ఇంటిలో అద్దెకున్నాను. ఆ ఇంటి యజమానికి దెయ్యాలు ఉన్నాయని నమ్మకం. వాని ఇంటి దగ్గర ఒక శ్మశానం ఉంది. అతడు అక్కడి దయ్యాలు తనను వెంటాడుతున్నాయని భావించేడు. నేనేమి చెప్పినా అతడు తన నమ్మకాన్ని మార్చుకోలేదు. చివరకు నేను అక్కడికి వెళ్ళి చూస్తానని చెప్పేను. నేను శ్మశానం నుంచి తిరిగి వచ్చినప్పడు అతను నేను దయ్యాలను చూసేనా అని ఆతృతగా అడిగేడు.

"నేను మూడు దయ్యాలను చూసేను" అని చెప్పేను.

"నువ్వేమి చేశావు?"

"నా ఇంటి యజమాని చాలా మంచివాడు. వానిని పట్టి పీడించకండి" అని చెప్పేను.

"దయ్యాలు ఏం చెప్పాయి?"

"అలా చేయలేం. ఎందుకంటే అతను మమ్మల్ని నమ్మిన౦త కాలం, మేమిక్కడే ఉండాలి"

అతడు కొంత సేపు తరువాత బిగ్గరగా నవ్వేడు. అతడు అప్పట్నుంచి దెయ్యాలను నమ్మడం మానేసాడు. మన గతంలో జరిగిన విషయాలు దెయ్యాలవలె మనని పట్టి పీడిస్తాయి. ఎప్పుడైతే మనం వాటి గురించి ఆలోచించడం మానేస్తామో అవి ఇక మనను వెంటాడవు.

ఈ విధంగా గతం గురించి, భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఉంటే, మన చేతన మనస్సు ప్రస్తుత కాలం మీద ఏకాగ్రతతో ఉంటుంది. బుద్ధుడు దీనినే క్షణికవాదమనే సిద్ధాంతం ద్వారా వివరించేడు. ఒక క్షణానికి, మరొక క్షణానికి సంబంధం లేదు అని బోధ చేసేడు. ప్రతీ క్షణం ఏకైక మైనది.

శ్రీకృష్ణుడు విశ్వతోముఖః అని అంటాడు. అంటే అతని ముఖం అన్నిట్లోనూ ఉంది అని. నికోలాస్ ఆఫ్ క్యూసా "ప్రతి ముఖంలోనూ భగవంతుని ముఖం ఒక తెరవెనకాల ఉంది" అని అన్నారు. దేవుని ముఖము ధ్యానంలో సమాధి స్థితి పొందినప్పుడు మనలో ఆవిర్భవిస్తుంది. 253

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...