Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 22

Bhagavat Gita

2.22

నేహాభిక్రమనాశో అస్తి ప్రత్య వాయో న విద్యతే {2.40}

స్వల్ప మన్యస్య ధర్మస్య త్రాయతే మహతోభయాత్

ఈ కర్మయోగము నందు అభిక్రమ నాశము లేదు. ప్రత్యవాయ దోషమూ లేదు. ఈ ధర్మమును కొద్దిగా అనుష్ఠి౦చినను గొప్పదైన సంసార భయమునుండి రక్షించును

ఈ శ్లోకం మరపు రానిది. జీవితాంతం ఆధ్యాత్మిక సాధన చేస్తే తప్ప అది మనం చేసే ప్రతి కర్మకు వర్తిస్తుందని తెలియదు. మనం ప్రతిరోజూ భగవంతుని మీద ధ్యానం చేస్తే, ఆ శ్రమ ఎన్నటికీ వృధా కాదు. మనమొక అరగంట ధ్యానం చేసి, ఆధ్యాత్మిక పరంగా కొన్ని పనులు చేస్తే, మన చేతన మనస్సులోనున్న భయాలను, అపోహలను పోగొట్టుకోవచ్చు. మనలో చాలా మంది ఉన్నది లేకపోతే అభద్రత కలుగుతుందేమో అని ఆందోళన చెందుతారు. ఉదాహరణకి డబ్బు మీద వ్యామోహం ఉన్నవారు, ఆ డబ్బే తమకు భద్రత నిస్తుందని భావిస్తారు. కానీ వారు వ్యాపారస్తుల చేతిలో కీలుబొమ్మలు. మరికొందరికి ఏళ్లు గడుస్తున్న కొద్దీ సౌందర్యం పోతుందేమోనన్న అభద్రత కలుగుతుంది. నిజానికి సౌందర్యానికి వయస్సుకి సంబంధం లేదు. మనం అన్ని దశలలోనూ నిస్వార్థంగా బ్రతికితే ఎన్నటికీ సౌందర్యవంతులమే. భద్రత కలిగించుకోవాలంటే మన చేతన మనస్సు లోతులలో వెదకాలి. శ్రీకృష్ణుడు చెప్పింది: గడ్డు రోజులలో పరోపకారానికై ప్రయత్నించు. మంచి రోజులలోనూ అదే చెయ్యి. కాబట్టి ఎలాంటి పరిస్థితులలోనూ ఇతరులకు సేవ చెయ్యడమే ఉత్తమం. మనం భద్రత పొందడానికి మనం చేయగలిగింది ఇదొక్క ఎన్నికే. 90

Eknath Gita Chapter 2 Section 21

Bhagavat Gita

2.21

ఏషా తే అభిహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శ్రుణు {2.39}

బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి

పార్థా! నీకు సాంఖ్యము తెలిపెడి జ్ఞానమును ఇంతవరకు బోధించితిని. ఏ యోగశాస్త్ర జ్ఞానము చేత నీవు కర్మ బంధము నుండి విడిపడ గలవో అట్టి కర్మ యోగమును తెలిపెదను. ఆలకింపుము. ఀ

ఇంతవరకు శ్రీకృష్ణుడు సాంఖ్య యోగం గురించి చెప్పేడు. మేధ నుపయోగించి తర్కం అనుసరించేవారికి దీనివలన ప్రయోజనముంటుంది. గురువు ధ్యానం యొక్క లాభం గురించి చెప్తాడు. కానీ శిష్యులు దాన్ని పాటించాలి. ఇక్కడ ఆ శాస్త్రాన్ని సాంఖ్య అంటారు. దాని ఆచరణని యోగమంటారు. మన ఇంద్రియాలు నిగ్రహింప బడినప్పుడు; మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు; బుద్ధి, అహంకారం స్వాధీనంలో ఉన్నప్పుడు, ఆ స్థితిని యోగమందురు. ఈ నేపధ్యంలో ఈ రోజుల్లో యోగ అంటే వ్యాయామం అనుకుంటారు. అది నిజంగా ఆసనాలు.

శ్రీకృష్ణుడు అర్జునుడు ధ్యానం చేసి, మంత్రం జపించుకొని, ఇంద్రియాలను నియంత్రించుకొని, ఇతరులను తనకన్నా ముఖ్యమని తలచి ఉంటే కర్మ సిద్ధాంతానికి అతీతమవుతాడని బోధ చేస్తున్నాడు. కర్మ సిద్ధాంతాన్ని జీసస్ క్రైస్ట్ ఈ విధంగా చెప్పారు: నువ్వు ఏ విత్తనం నాటితే, దాని పంటే పొందుతావు. మనమితరులకు దుఃఖం కలిగిస్తే ఏది ఎప్పుడో ఒకప్పుడు తిరిగి మనకి దుఃఖం కలిగిస్తుంది. అదే మనం పరోపకారానికై నిత్యం పాటుపడితే, దాని వలన ఎనలేని ఆనందం పొందుతాము.

ఒక రకంగా మన ద్వేషం, క్రోధం ఇతరుల మీద కాదు. మనమెప్పుడైతే దేవుని నుండి విడదీయబడ్డామో అప్పడినుంచీ ఆ భావాలు మనలో నాటబడ్డాయి. అంతరాత్మ మన సహజ స్థితికి రమ్మని ప్రోద్భలం చేస్తూ ఉంటుంది. కానీ మన ఇంద్రియాలు బయటకు పరుగులు తీస్తూ, మనం సుఖాలకు లోబడి బ్రతుకుతూ అంతరాత్మ చేసే ప్రోద్భలాన్ని విస్మరిస్తాం. మనకు ఒత్తిడి కలిగినప్పుడు, మన కోపం పిల్లల మీద, భార్య మీద, లేదా మిత్రులమీద ప్రదర్శిస్తా౦. ఎందుకంటే వారు మనకు అందుబాటులో ఉన్నారు కనుక. వేరొకరిపై దాడి చేస్తే, వారి కష్టాలను అధికం చెయ్యడమే కాక, మనమొక శత్రువుగా మారుతాము. దాని వలన నిద్ర లేమి కలిగి, ధ్యానం బాగా సాగదు. అలాగే మన తలిదండ్రులను, సహధర్మచారిణిని, చివరకు ఇంటి ప్రక్క నున్న వారలతో కలహాలు పెట్టుకుంటాం. ఈ విధంగా మన దుర్గుణాలను ఇతరులకు ఆపాదిస్తాం. వారు కూడా మనలాగే స్పందిస్తే ఇంకొకరితో వారు కలహిస్తారు. కొన్నాళ్ళకి ఆ దుర్గుణాల వలయంలో మనం చిక్కుకుంటాం. అందుకే యోగులు చెప్పేది, మనం క్రోధంతో ఉగ్రంగా ఉంటే, మంత్ర జపం చేస్తూ, దీర్ఘంగా నడవమని. 89

Eknath Gita Chapter 2 Section 20

Bhagavat Gita

2.20

స్వధర్మ మపి చావేక్ష్య న వికంపితు మర్హసి {2.31}

ధర్మ్యాద్ధి యుద్ధాచ్చ్రేయో అన్యత్ క్షత్రియస్య న విద్యతే

నీ స్వధర్మమును గాంచినను నీవు యుద్ధ విషయమున చలింపవలసిన పనిలేదు. క్షత్రియునకు ధర్మ యుద్ధము కంటెను శ్రేయమైన కార్యము వేరొకటి లేదు.

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వార మపావృతం {2.32}

సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధ మీదృశం

పార్థా! అప్రయత్నముగ ప్రాప్తించునట్టిది, స్వర్గమునకు తెరచి పెట్టిన వాకిలి వంటిదియునగు ఈ యుద్ధము పుణ్యాత్ములైన క్షత్రియులకే లభించును

అథచే త్త్వమిమ౦ ధర్మ్య౦ సంగ్రామం న కరిష్యసి {2.33}

తత స్స్వధర్మం కీర్తించ హిత్వా పాప మవాప్స్యసి

ధర్మయుతమైన ఈ యుద్ధమును నీవు చేయకుండినచో స్వధర్మమును, కీర్తిని పోగొట్టు కొనుటయే గాక పాపమును కూడా పొందెదవు

అకీర్తిం చాపి భూతాని కథయిష్య౦తి తే అవ్యయాం {2.34}

సంభావితస్య చాకీర్తిః మరణా దతిరిచ్యతే

లోకులు నీయొక్క అపకీర్తిని శాశ్వతముగ చెప్పుకొందురు. మాననీయునకు అపకీర్తి కన్నను మరణమే మేలు

భయా ద్రణా దుపరతం మంస్యన్తే త్వాంమహారథాః {2.35}

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్

ఇంతవరకు నిన్ను గొప్పగా గౌరవించిన మహారథులకు నీవు చులకన యగుదువు. నీవు భయము వలన యుద్ధమును మానినట్లు వారు భావింతురు

అవాచ్య వాదాంశ్చ బహూ న్వదిష్యన్తి తవాహితాః {2.36}

నిందంతి స్తవ సామర్థ్యం తతో దుఃఖతరం ను కిమ్

నీ శత్రువులు నీ సామర్థ్యమును నిందించుచు నిన్ను గూర్చి ఎన్నో అనరాని మాటలను పలికెదరు. దానికి మించిన దుఃఖమేమున్నది?

హతో వా ప్రాప్స్యసే స్వర్గం జిత్వా వా భోక్ష్యసే మహీం {2.37}

తస్మా దుత్తిష్ఠ కౌన్తేయ యుద్ధాయ కృతనిశ్చయః

అర్జునా! చంపబడినచో స్వర్గమును పొందెదవు. జయించినచో రాజ్యము ననుభవింతువు. కనుక యుద్ధమునకు కృతనిశ్చయుడవై లెమ్ము

సుఖ దుఃఖే సమే కృత్వా లాభాలాభౌ జయాజయౌ {2.38}

తతో యుద్ధాయ యుజ్యస్వ నైవ౦ పాప మవాప్స్యసి

సుఖ దుఃఖములను, లాభనష్టములను, జయాపజయములను సమముగ భావించి యుద్ధము చేయుము. అటుల చేసినచో నీవు పాపమును పొందవు

తతో యుద్ధాయ యుజ్యస్వ -- మనందరమూ ముగ్గురు శత్రువులతో ఎల్లప్పుడూ పోరాడుతూ ఉంటాము. అవి : భయము, క్రోధము, మోహము. మనం పునర్జన్మ ఉంటుందని నమ్మినా, నమ్మక పోయినా, ఈ యుద్ధం ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. అలాగే ఈ ద్వంద్వాలతో కూడా: స్వార్థం-నిస్వార్థ౦, అశుద్ధము-శుద్ధము, అసంపూర్ణము-సంపూర్ణము.

సుఖదుఃఖే సమే కృత్వా -- మనము సుఖదుఃఖాల్లో ఒకేలాగ ఉండాలి. మనము బాధలోనూ, ఆనందంలోనూ ఒకేలాగ లేకపోతే మనమెంత కష్టపడి పోరుచేసినా, అహంకారానికే ఎప్పటికీ పైచేయి ఉండి, అనేక జన్మములెత్తవలసి వస్తుంది. కానీ అలా చేయడం ఎలాగ? మనకు సుఖముల వలన ఆనందం కలిగి, దుఃఖములవలన విచారం కలగడం సహజం. అందుకే శ్రీకృష్ణుడు సుఖదుఃఖే సమే కృత్వాఅంటున్నాడు: మరణం పొందకూడదనుకుంటే సమదృష్టి కలిగి ఉండాలి. మన౦ మరణం రాకూడదని గాఢంగా నమ్మితే సుఖదుఃఖాల యందు సమదృష్టి కలిగి ఉండాలి.

మనకి మంచి కలిగితే మనస్సు ఉల్లాసమై "నేను ఆనందంగా ఉన్నాను" అని అనుకుంటాము. క్షణికమైన ఆనందంతో తాదాత్మ్యమవుతాము. ఆనందం దుఃఖాన్ని తోడుగా తెచ్చుకొ౦టుంది. ఎందుకంటే అవి ద్వంద్వాలు కనుక. మనమిలాగ చాలా కాల ముంటే అవి మన సంస్కారాలుగా మారుతాయి.

మన రూపాన్ని ఒకరు పొగిడితే, మన మనస్సు అలజడి చెందుతుంది. అలాటప్పుడు మనము "నన్ను పొగడకు. నేను ఆధ్యాత్మిక సాధన చేస్తున్నవాడిని" అని చెప్పనక్కరలేదు. శ్రీకృష్ణుడు పొగిడేవానికి ధన్యవాదాలు చెప్పి మనస్సును స్వాధీనంలో పెట్టుకోమని చెప్తున్నాడు. మనకు మంచి జరుగుతూ, పొగడ్తల వెల్లువ వస్తే, మంత్రజపం చెయ్యడమే ఉత్తమం. ఇది కష్టతరమే. ఇక్కడ తెలిసికోవలసినది, ఎలాగైతే పొగడ్తలు వస్తాయో, అలాగే దూషణ కూడా వస్తుంది. ఆ రెండిటిలోనూ సమదృష్టి కలిగివుండడం మంచిది.

మనలో చాలామంది ఇతరులు మీరు మంచి వారలని చెప్తే కాని సమంగా ఉండరు. గాంధీ మహాత్ముని లాగ మనకి కూడా ఇతరులు సమ్మతించే లాగ ప్రవర్తించక పోతే వారు విమర్శలు చేస్తారు. మనము నిశ్చింతగా ఉంటే ఎన్ని విమర్శలు కలిగినా, ఎంత దూషణ వచ్చినా మనలో ద్వేషం లేక భద్రంగా ఉంటాము. మనకు మంచి మార్గంలో ఉన్నామనే నమ్మకం ఉంటే, ప్రపంచాన్ని ఎదిరించి బ్రతకగలం. మంచి విమర్శ అయితే మనకు లాభిస్తుంది.

గాంధీకి అనుచరులుగా ఉండమని అనేక సార్లు ప్రజలు చెప్పేరు. "మీరు ఋషుల వంటివారు. కలలు కంటారు. అవాస్తవమైనవి చెప్తారు. మేము మీకు అనుచరులము కాలేము" అని ఆయనను విమర్శించేవారు. దానికి ఆయన సమాధానము: "నేను నన్ను అనుసరించమని చెప్పటం లేదు. నేను పూర్తిగా అహింసా వాదిని. అది మీకు నచ్చక పోతే ఉంకో నాయకుడ్ని అనుసరించండి". ఇలాగ అనేకమార్లు జరిగింది. ప్రతిసారీ వాళ్ళు వెళ్ళిపోయి, కొన్నాళ్ల తరువాత గాంధీ వద్దకు వచ్చి ఆయనను అనుసరిస్తామని చెప్పేవారు. ఇదే విశ్వాసమంటే. అవసరమైతే మనము ఒంటరిగా పయనించాలి. నాలో దేవుడు౦డగా, నాకింకేమి కావాలి? ఎవరి విమర్శని ఎదుర్కోవడానికి భయపడతాను?

లాభోలాభౌ అనగా--లాభము, నష్టము. లాభ నష్టాలు వ్యాపారంలో ఎక్కువగా చూస్తాం. శ్రీకృష్ణుడు అలాటప్పుడు సమదృష్టి కలిగి ఉండమని బోధిస్తున్నాడు. అలాగే జయాజయౌ -- అనగా జయాపజయాలలో సమదృష్టి కలిగి ఉండాలి. ఇవే మనల్ని మరణాన్ని దాటించి ఉత్కృష్టమైన స్థితిని కలగజేస్తాయి. 87

Eknath Gita Chapter 2 Section 19

Bhagavat Gita

12.19

దేహీ నిత్య మవద్ధ్యో అయం దేహే సర్వస్య భారత {2.30}

తస్మా త్సర్వాణి భూతాని న త్వం శోచితు మర్హసి

అర్జునా! సర్వప్రాణుల దేహములందు శోభించు ఆత్మ చంపుటకు వీలుపడదు. కనుక సర్వ ప్రాణులను గూర్చియు నీవు దుఃఖి౦ప పనిలేదు

నా చిన్నప్పడు పెరిగిన గ్రామంలో ఎవరైనా మరణ శయ్య పైనుంటే నా అమ్మమ్మను తమ వద్దకు రమ్మనమని కోరేవారు. ఎందుకంటే వాళ్ళకు ఆమె ధైర్యం ఇచ్చేది. ఆమె కళ్ళు చూసి వారు చావంటే భయపడకూడదని గ్రహించేవారు. సమాధి పొందినపుడు ఇదే దేవుని ప్రేమించే యోగి తెలుసుకొంటాడు. దేవునితో హృదయంలో ఐక్య మైనప్పుడు దేహాభిమానం పోతుంది. దేహాన్ని సరిగ్గా పోషించడం ఎందుకంటే ఇతరులుకు అమృతత్వ౦ గురించి చెప్పి వారిని తరింపచేయడానికి.

మనం ధ్యానం గాఢంగా చేసినప్పుడు మన దేహం నుండి విడబడతాం. ఒక్కొక్కప్పుడు మనకు దేహం ఉందనే భావన కూడా కలగదు. శ్రీరామకృష్ణ ఒకమారు కలకత్తా వీధులలో నడుస్తూ ఉండగా ఆయన ధోతి క్రింద పడిపోయింది. ఆయన వివస్త్రితుడై కూడా సాగిపోతున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయనకు ఆ విషయం చెప్పేరు. ఆయన "మీరు నా ధోతి ఎక్కడుందని అడుగుతున్నారు. నేను మిమ్మల్ని నా శరీరం ఎక్కడుందని అడుగుతున్నాను." అని పలికేరు.

దేహాభిమానం దైవ చింతనకి అడ్డు వస్తుంది. ప్రతిరోజూ మన దేహాభిమానం ఏది తగ్గిస్తుందని ప్రశ్నించుకోవాలి. ఏదైతే మన దేహాభిమానం పెంచుతుందో అది ఆధ్యాత్మిక సాధనకు అనుచితము. ఉదాహరణకు అతిగా తినడం దేహాభిమానాన్ని పెంచుతుంది. మనం టివిలో ప్రకటలను చూడడం వలన, పూర్వ సంస్కారాలవలన, ఆ పరిస్థితి కలిగినప్పుడు, మనం ప్రశ్నించు కోవలసింది తిండి దేహాన్ని పోషించడానికా లేదా నాలుకని సంతృప్తి పరచడానికా. అలాగ మనము చేస్తే కొంత కాలానికి కాయగూరలు, ఆకుకూరలు, పళ్ళు తో కూడిన ఆహార౦ మాత్రమే స్వీకరిస్తే సాధనకి మంచిదని తెలుసుకొంటాం. అలాగే ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలను వాడకుండా ఉండాలి. అలా చేయడం మతపరంగా కాదు. అవి మనని దేహాభిమానం పెంచేవి కాబట్టి. ఈ విధంగా దేహంనుంచి విడవడితే, మన సాధన వృద్ధి చెంది, మనం ఎటువంటి ఊతా లేకుండా, విశ్వమంతా వ్యాపించి ఉన్నామనే భావన కలుగుతుంది. 83

Eknath Gita Chapter 2 Section 18

Bhagavat Gita

2.18

ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేవ మాశ్చర్యవ ద్వదతి తథైవ చాన్యః {2.29}

ఆశ్చర్యవ చ్చైన మన్య శ్శ్రుణోతి శ్రుత్వా ప్యేనం వేద నచైవ కశ్చిత్

ఈ ఆత్మను ఒకడు ఆశ్చర్యముగ చూచు చున్నాడు. మరియొకడు ఆశ్చర్యముగ చెప్పుచున్నాడు. వేరొకడు ఆశ్చర్యముగ ఆలకించుచున్నాడు. ఆలకించినను ఏ ఒక్కడును దీనిని తెలిసికొనుటలేదు.

బైబిల్ మార్క్ 4:3-8 లో ఒక కథ ఇట్లు చెప్పబడినది:

ఒక రైతు విత్తనాలు పట్టుకొని జల్లడం మొదలెట్టేడు. కొన్ని విత్తనాలు పొలం అవతల పడ్డాయి. వాటిని పక్షులు వచ్చి తినేసేయి. కొన్ని ఎక్కువ మట్టిలేని రాళ్ళప్రదేశంలో పడ్డాయి. అవి వెంటనే మొలిచేయి. కానీ వాటికి వేళ్ళు లేకపోవడం వలన, ఎండ వేడికి, కృశించిపోయేయి. కొన్ని ముళ్ళ మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి వాటిని కప్పి వేసిన కారణాన వాటికి పళ్ళు కాయలేదు. మిగతావి సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి మొలకెత్తి విరివిగా కాసేయి.

"కొన్ని విత్తనాలు పొలం అవతల పడ్డాయి. వాటిని పక్షులు వచ్చి తినేసేయి" అనగా--

మన మనస్సులో ఆసక్తి ఉంటే తప్ప ఆధ్యాత్మిక విషయాలు అచేతన మనస్సులోకి వెళ్లలేవు. అవి ఎంత పెద్ద గురువైనా చెప్పినప్పటికీ కూడా. తెలివిగలవారు, పెద్ద చదువు చదువుకున్న వారలు, ఎంతో పేరుప్రతిష్ఠలు గలవారు "మనకు ధ్యానం ఎందుకు?" అని అడుగుతారు. నేను ధ్యానం వలన చేతన మనస్సులో మిక్కిలి అందవికారమైనది కూడా ఎంతో సౌందర్యంగా చేసికోవచ్చు అని చెప్తే కొందరు "మాకు ధ్యానం అవసరం లేదు, ఎందుకంటే మేము చాలా సౌందర్యవంతులం. మీకు ఇటువంటి మార్పు అవసరం. చూస్తూ ఉంటే మీలో మార్చుకోవలసినవి చాలా ఉన్నాయి" అని అనేవారు. మరికొందరు "మేము ఎప్పుడూ సంతోషంగా ఉంటాము. మేము నిద్రలేస్తూనే ఆనందంగా ఉంటాము. అలాగే నిద్రకి ఉపక్రమిస్తున్నప్పుడు కూడా. మేము ఎల్లవేళలా ఆనందంగా ఉంటాము" అని అనేవారు. జీసస్ చెప్పే పక్షులచే తినబడ్డ విత్తనాలు, ఇలా మంచి మాటలని పెడ చెవిని పెట్టే వాళ్ళగురించే.

ఎదగాలంటే కొంత దుఃఖ౦ అనుభవించాలి. ప్రేమ కలగాలంటే కొంత ఒత్తిడి ఉండాలి. కలత చెందితేనే మన మనస్సు లోతులకి వెళ్ళి ఉపసమనం పొందగలము. అలాగే మనం బాధ పడితే తప్ప ఇతరుల వేదన అర్థం చేసికోలేం. జీవిత౦లో ఎదురు దెబ్బలు తింటే తప్ప ఇతరులపై దయ కలుగదు. కొందరు ఎంత ఎదురీత ఈదినా, కాలక్రమేణా వాటిని మరిచిపోతున్నట్టు ఉంటారు. ఒక వృద్ధుడు యుక్తవయస్కులు చేసే కొన్ని క్రియలను, తాను చిన్నప్పుడు తప్పులు చేసినప్పటికీ, ఖండిస్తాడు. అలా కాక వాని చిన్ననాటి అనుభవాలు గుర్తు తెచ్చుకొని తనకన్నా చిన్నవారిపై దయతో నుండి, వారికి సహాయం చెయ్యగలగాలి.

"కొన్ని విత్తనాలు ఎక్కువ మట్టిలేని రాళ్ళప్రదేశంలో పడ్డాయి. అవి వెంటనే మొలిచేయి. కానీ వాటికి వేళ్ళు లేకపోవడం వలన, ఎండ వేడికి, కృశించిపోయేయి" అనగా--

కొందరు ఆరంభ శూరత్వంతో ఉంటారు. అంటే ఏ పని చేసినా మొదట్లో అత్యంత ఉత్సాహంతో ఉంటారు. వారు ధ్యానం మీద ప్రసంగం విని మిక్కిలి ఉత్తేజితులవుతారు. కొందరు ఆరంభ శూరులు నా వద్దకు వచ్చి "మీరు చెప్పేదే నేను చాలా కాలం నుంచి వెదకుతున్నాను" అని చెప్పేవారు. ఆ తరువాత వారు కనుమరుగై పోయేవారు. ఇంకొందరు ఆరంభ శూరులు ధ్యానానికై అగరబత్తులు, దిండు, రవి శంకర్ పాటలు కొనుక్కొని వచ్చి, అవి ఎందుకు కొన్నారో మరచిపోతారు. మనము ధ్యానం కొన్నాళ్ళు అభ్యాసం చేసి చూడాలి. దానికి ఈ హంగులన్నీ అక్కరలేదు.

"కొన్ని విత్తనాలు ముళ్ళ మధ్య పడ్డాయి. ముళ్ళు పెరిగి వాటిని కప్పి వేసిన కారణాన వాటికి పళ్ళు కాయలేదు" అనగా--

మేము కొన్నేళ్ళ క్రితం ఒక కాయగూరల తోటను వేద్దామనుకొన్నాం. దానికై టమాటా, జొన్న, గుమ్మడి విత్తనాలు నాటేం. ఒక బ్రిటిష్ దేశస్తుడు తనకు కాయగూరల తోటలగురించి చాలా తెలుసునని చెప్పి "కలుపు మొక్కలను పెరగ నివ్వండి" అని సలహా ఇచ్చేడు. నేను వానిని నమ్మడం వలన పంట చెడింది. మనం ధ్యానం ప్రతి ఉదయం చేసినప్పుడు మన మనస్సులోని కలుపు మొక్కల వలె ఉన్న చెడు ఆలోచనలను నియంత్రించి, కాయగూరల వలె నున్న మంచి భావాలను అలవరుచుకోవాలి.

"మిగతా విత్తనాలు సారవంతమైన నేల మీద పడ్డాయి. అవి మొలకెత్తి విరివిగా కాసేయి" అనగా--

కొందరు ఆధ్యాత్మిక సాధన స్వార్థముతో కూడినదని అనుమానిస్తారు. సాధన మొదట్లో మన దిన చర్యను మార్చుకొని, కొందరు బంధుమిత్రులను విడనాడితే మనపై అసాంఘికములమని ముద్ర వేస్తారు. అప్పుడు మనము ధ్యానం వలన బంధుమిత్రులను ప్రభావితం చెయ్యగల శక్తిని పొందుతామని మరచిపోకూడదు. శ్రీ రామకృష్ణ లాంటి వారల లాగ మనం వేలాది మంది ఆదరణ చూరుగొనక్కరలేదు. మన సాధన దినదినాభివృద్ధి కలుగుతూ ఉంటే దగ్గిర సన్నిహితులకు మనము పొందిన జ్ఞానాన్ని వివరించవచ్చు. 81

Eknath Gita Chapter 2 Section 17

Bhagavat Gita

2.17

అథ చైనం నిత్యజాతం నిత్య వా మన్యసే మృతం {2.26}

తథాపి త్వం మహాబాహో నైవ౦ శోచితు మర్హసి

అర్జునా! ఈ ఆత్మ నిత్యము పుట్టుచు, చచ్చుచు నుండు దానినిగ నీవు భావించినను, అట్టి స్థితిలో కూడ నీవు ఈ విధముగ దుఃఖి౦ప పనిలేదు

జాతస్య హి ధృవో మృత్యు ర్ధ్రువం జన్మ మృతస్య చ {2.27}

తస్మా దపరిహార్యే అర్థే న త్వం శోచితు మర్హసి

జన్మించిన వానికి మరణము తప్పదు. మరణించిన వానికి జన్మమును తప్పదు. అనివార్యమగు ఈ విషయమున నీవు శోకించుట సరికాదు

అవ్యక్తాదీని భూతాని వ్యక్తమధ్యాని భారత {2.28}

అవ్యక్త నిధనా న్యేవ తత్ర కా పరిదేవనా

అర్జునా! ప్రాణులు జన్మలకు ముందు తెలియుటలేదు. మధ్యలో తెలియుచున్నవి. గతించిన పిదప మరల గోచరించుట లేదు. ఈ విషయమై నీకు దుఃఖ మెందులకు?

శ్రీకృష్ణుడు శాశ్వతమైన ఆత్మ గురించి ఇచ్చిన వివరణ ఆలకించి ఇంకా ఇలాగ అనుకోవచ్చు: "నేను దేహిని. దేహం మరణిస్తే నేనూ మరణిస్తాను కదా." మనం మనల్ని దేహమనుకొన్నా, మరణానికి భయపడకూడదు, ఎందుకంటే దేహం సహజంగా కొన్నాళ్ళు౦డి పడిపోతుంది. ఈ విధంగా శ్రీకృష్ణుడు మనల్ని దేహం నుంచి విడదీసి చూపిస్తున్నాడు.

ధ్యాన మార్గంలో ఒకరి భౌతిక శరీర లక్షణాలను చూడక వారి అంతరంగాన్ని చూస్తాం. నన్ను ఫలానా వారు ఎంత పొడుగు అని అడిగితే నేను చెప్పలేను. అది ఒక మంచి చిహ్నం. అలాగే నన్ను ఒకరి వయస్సు ఎంత అని అడిగితే చెప్పలేను. మనమెప్పుడైతే ఒకరిని భౌతిక లక్షణాలతో లేదా వయస్సుతో ముడి పెట్టకుండా ఉంటే మనము వారిలోని ఆత్మను దర్శించినట్లే. మనము ఒకరి భౌతిక లక్షణాలు, వయస్సు గురించి ఆలోచిస్తే, దాని పర్యావసానము మన లక్షణాలను, వయస్సును విశ్లేషించడమే. యోగులు ఒకరి అంతర్గతం ఎలా ఉందో అలా చూస్తారు. నేను ఒకరి కళ్ళను చూస్తాను, ఎందుకంటే అవి వారి మనస్సు యొక్క కిటికీలు. తద్వారా భగవంతుని దర్శించవచ్చు. క్రమంగా ఆత్మ జ్ఞానం అలవరచుకొంటే మనం ఒకరి కళ్ళలో చూసి, వారిలో వసించే భగవంతుని ప్రేమ స్వరూపాన్ని చూస్తాం. 78

Eknath Gita Chapter 2 Section 16

Bhagavat Gita

12.16

నైనం ఛి౦దంతి శస్త్రాణి నైనం దహతి పావకః {2.23}

న చైనం క్లేదయం త్యాపో న శోషయతి మారుతః

ఈ ఆత్మను శస్త్రములు ఛేదింపలేవు. అగ్ని దహింపలేదు. నీరు తడుపలేదు. గాలి శోషింప జేయలేదు.

అఛ్ఛేద్యో అయ మదాహ్యో అయ మక్లేద్యో అశోష్య ఏవ చ {2.24}

నిత్యస్సర్వగత స్స్థాణు రచాలో అయం సనాతనః

ఈ ఆత్మ ఛేదింపబడదు. దహింపబడదు. తడుపబడదు. ఎండింపబడదు. అది నిత్యమైనది, సర్వగతమైనది, స్థిరమైనది, అచలమైనది, సనాతనమైనది.

అవ్యక్తో అయ మచి౦త్యో అయ అవికార్యో అయ ముచ్యతే {2.25}

తస్మా దేవం విది త్త్వైనం నాను శోచితు మర్హసి

ఈ ఆత్మ వ్యక్తముకాదు. చింతించుటకు వీలుపడదు. వికారములేనిదని చెప్పబడినది. ఈ విధమైన ఆత్మను తెలిసికొని నీవు శోకించుట మానవలెను

అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పే ఆత్మ అంతుబట్టలేదు. అందుకై శ్రీకృష్ణుడు మనందరికీ మన ఉనికి యొక్క నిజ స్వరూపామును విసిదీకరిస్తున్నాడు. మన నిజ స్వరూపము 3 సంస్కృత పదాలతో వివరింపబడినది: అవ్యక్త అయం--అనగా వ్యక్తము కానిది, నిఘూడంగా ఉన్నది; అచింతయ అయం--అనగా ద్వంద్వాలకు అతీతమై విశ్లేషించుటకు కష్టమైనది; అవికార్యో అయం--అనగా మార్పు చెందనిది. మన ఆత్మ స్వరూపము సంపూర్ణమైనది. ఈ మూడు అంశాలను మన ఆత్మ స్వరూపముపై ఆపాదిస్తే మనము దేహేంద్రియ మనోబుద్ధులకు అతీతులమని తెలుస్తుంది.

ముందు చెప్పినట్లు అవ్యక్త అనగా పూర్తిగా వ్యక్తమవ్వనిది. మనము దేహముపైనే దృష్టి పరిమితం చేసికొని అపరిమితమైన, అమృతమైన, మార్పులేని ఆత్మను దర్శించలేకున్నాము.

మైస్టర్ ఎక్ హార్ట్ ఆత్మను మనందరిలోనూ ఉన్న దేవుని యొక్క బీజంగా పరిగణించేరు. ఎలాగైతే ఆపిల్ విత్తు ఆపిల్ చెట్టులా, నారింజ విత్తు నారింజ చెట్టుగా పెరుగుతాయో, దేవుని బీజము దేవుని చెట్టుగా పెరుగుతుంది. ఈ నేపధ్యంలో వ్యక్తమనగా మనలోని గుప్తంగా ఉన్న దైవీ సంపదని బహిర్గతం చెయ్యడమే మన యొక్క లక్ష్యం. ఎలాగైతే కలుపు మొక్కలను తీసివేస్తే విత్తనం పెరిగి పెద్దదవుతుందో, అలాగే మనల్ని కూడా శుద్ధి చేసికొంటే దేవుని బీజం చిగురుస్తుంది.

మనలోని గుప్తమైన దైవ గుణాలని ఎలాగ బయటకు తెస్తామని ప్రశ్న కలగవచ్చు. కొందరు స్వార్థంతో, అభద్రతో బ్రతుకుతారు. వారు ఎప్పుడూ ప్రతీదాన్నీ, ప్రతి వ్యక్తిని స్వలాభానికై ఎలా వాడుకోవాలా అని ఆలోచిస్తారు. అలా౦టివారు తాము సున్నితమైన వారలమని చెప్పుకుంటారు. కొందర సున్నితమంటే చెప్పులు వేసికోకుండా ఇంట్లో నడుస్తే కలిగే బాధ అని చెప్పవచ్చు. యోగులు చెప్పే సున్నితత్వము ఇతరుల బాధలను అర్థం చేసికోవడం. మనము పరులకై పాటు పడితే, మనకు కలిగే బాధlu, కలవరము, ద్వేషం నుండి విముక్తులమవుతాము.

నా అమ్మ చెప్పిందే మళ్ళీ చెప్తూ ఉంటుంది. నేను ఆమె నామీద నమ్మకం లేక కాదు అని తలుస్తాను. ఆమెకు తెలుసు ఉద్యోగ రీత్యా నేను మతిమరుపు మనిషినని. మనము మన తలిదండ్రులు మన క్షేమమే సదా కోరుతారని, భార్యా పిల్లలు మనకి ఆహ్లాదం ఇస్తారని మనసారా నమ్మితే వారు చేసే ఏ పనీ మనను బాధించదు. నా అమ్మ అప్పుడప్పుడు కటువుగా ఉంటుంది. నేను ఆమెను తప్పు బట్టను. మన బంధుమిత్రులపై మిక్కిలి నమ్మకం లేకపోతే, ఎటువంటి మృదుమాటలు, గౌరవ వచనాలు, వలన మన మధ్య అన్యోన్యత కలగదు. మనము వారి దురుసు మాటలకు, తెలియకుండా చేసిన తప్పులకు స్పందించక మంత్రాన్ని జపించడమే ఉత్తమం.

మనమందరమూ క్షణికమైన జీవితంలో మన వ్యక్తిత్వాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాము. ఆంగ్లో సాక్సన్ హయాంలో ఎడ్విన్ అనే రాజుని చూడడానికి కొందరు క్రిస్టియన్ మత గురువులు ఆయన నివాసానికి వచ్చేరు. వారు ఆయనకు ఇలా బోధించేరు: "రాజా, మనము ఇక్కడ ఎగిరే పిచ్చుకల లాగా బ్రతుకుతున్నాం. ఎందుకనగా అవి బయట చలిలోనుండి ఎక్కడినుంచో వచ్చి, వంట గదిలోని ఆహారం ముక్కున పెట్టుకొని, మళ్ళీ బయట ఎక్కడికో ఎగిరి పోతాయి. అవి చీకటిలోనుంచి వచ్చి చీకటిలోకి తిరిగి వెళ్ళిపోతున్నాయి. పుట్టడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చేమో, మరణం తరువాత ఎక్కడికి పోతున్నామో మాకు తెలీదు. మాకు తెలిసిందల్లా వెలుగుతో కూడిన ప్రస్తుత జన్మ."

గీత మనము పూర్ణములోనుంచి వచ్చి పూర్ణంలో కలిసిపోతున్నామని చెప్పింది. ఈ మధ్యకాలంలో మనము వ్యక్తమై ఉన్నాము. పరిమితమైన, మరణించేది అయిన జీవితం మనను మభ్యపెట్టి "నా వ్యక్తిత్వము పుట్టుకనుంచి, మరణించేవరకు 100 ఏళ్లు బ్రతుకుతుంది" అనేలా చేస్తుంది. కానీ గీత అవ్యక్తమని చెప్పడానికి కారణం మన జీవితం అపరిమితమైనది. జీసస్ క్రైస్ట్ మనల్ని భౌతిక విషయాలకు అతీతమై ఉండాలని బోధించేరు.

శ్రీకృష్ణుడు వాడిన మరో పదం అచిన్త్య. మన నిజస్వరూపమైన ఆత్మ ద్వంద్వాలకు అతీతమై ఉన్నది. అది తెలిసికోవాలంటే మనస్సును నిశ్చలం చేసికోవాలి. మనస్సు నిరంతరము ఆలోచనలతో నిండి ఉండేది. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో "నా ఉనికి నా ఆలోచనల వలననే" అని చాలామంది నమ్ముతారు. యోగులు చెప్పేది దానికి వ్యతిరేకము. మనము ఆలోచనలను నియంత్రిస్తే మనకు ఉనికి లేదని తలుస్తాము. "నేనేమి చేసేది? నా సమయాన్ని ఎలా గడిపేది? నిద్రలో ఎటువంటి కలలు కంటాను?" అని ప్రశ్నించుకొని ఆవేదన చెందుతాము. వాటికి సమాధానం: మీరెందుకు కలలు కనాలని తలుస్తారు? ఎందుకు స్వార్థానికై, స్వలాభనికై ప్రయత్నిస్తారు? మనము పరోపకారం చేస్తూ, మనల్ని మర్చిపోతే, అదే నిజమైన జీవితమంటే.

నేను ధ్యానము మొదలుపెట్టిన రోజుల్లో కొందరు ఇలా అడిగేవారు: "నీకు మంచి వ్యక్తిత్వము౦ది. అలాగే మేధా సంపద ఉంది. నీవు వాటిని ఎందుకు వృధా చేస్తావు? ఎందుకు నీ మెదడుని మొద్దు బారేటట్లు చేసుకొంటావు? దానిని ఎందుకు నిశ్చలం చేయాలనుకొంటున్నావు?". కొందరికి మనకు వ్యక్తిత్వం లేదని చెప్తే ఆశ్చర్యం కలుగుతుంది. రమణ మహర్షి వంటి వారు మనం బ్రతికున్నామంటే ఒప్పుకోరు. యోగులు చెప్పేది: మన ముఖమును కప్పిపుచ్చే తెరను తీసివేస్తే గాని; భౌతిక-మానసిక వ్యక్తిత్వమనే తెరను దాటితే గాని, మనకు ఇతరులను ప్రేమించడం, మంచి కర్మలు చెయ్యడం, ఇతరులను సేవించడం వంటి సద్గుణాలు కలుగవు. 77

Viveka Sloka 48 Tel Eng

Telugu English All శ్రద్ధాభక్తిధ్యానయోగాన్ముముక్షోః ముక్తేర్హేతూన్వక్తి సాక్షాచ్ఛ్రుతేర్గీః । యో వా ఏతేష్వేవ తిష్ఠత్యముష్...