Sunday, April 10, 2022

Eknath Gita Chapter 11 Section 24

Bhagavat Gita

11.24

సంజయ ఉవాచ:

ఇత్యర్జున౦ వాసుదేవ స్తథోక్త్వా స్వక౦ రూపం దర్శయామాస భూయః {11.50}

ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా

మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగ పలికి సౌమ్యరూపుడై తన పూర్వ రూపమును మఱల చూపెను. అర్జునుని ఓదార్చెను.

అర్జున ఉవాచ:

దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన! {11.51}

ఇదానీమస్మి సంవృత్త స్స చేతాః ప్రకృతి౦ గతః

కృష్ణా! నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని. నిర్భయుడనైతిని. ప్రసన్నతను బొందితిని.

శ్రీకృష్ణుడు విశ్వరూపమును చాలించి తన సహజ స్వరూపము దాల్చగా, అర్జునుడు మిక్కిలి సంతసించినవాడై శ్రీకృష్ణుని జనార్ధన -- అనగా ప్రజలని మత్తెక్కించు వాడు -- అని పిలిచెను. మత్తు అనగా మద్యము వలనని కాదు. ఇది దేవునిలో అంతర్లీనమైతే కలిగే ఆనందం.

జాన్ వూల్ మ్యాన్ అనబడే అమెరికా కు చెందిన క్వేకర్ ఇలా అన్నారు:

ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఒక కాంతి విహీనమైన పదార్థాన్ని చూసేను. అది అతి దీన స్థితిలో ఉన్న సజీవమైన మానవాళి అని ఒకరు చెప్పేరు. నేను దానిలో ఒక్కడైన౦దున నేను వేర్పాటుతో ఉండలేను.

వూల్ మ్యాన్ చెప్పింది ఏమిటంటే మనము దేవుడి దయవలన జ్ఞానోదయము పొందితే కాళ్ళు చాపుకొని కూర్చోకూడదు. దేవుడు తాను కరుణించిన వారికి అతి క్లిష్టమైన కర్మని అప్పజెప్తాడు. అదేమిటంటే ఇతరులకు తాను పొందిన జ్ఞానాన్ని పంచిపెట్టడం. జ్ఞానోదయమైన యోగులు హిమాలయాల్లోనే ఉండి, క్రింద ఉన్న వారిపై చిన్న చూపు చూడవచ్చు. కానీ వారు ధ్యానంలో ఉంటే "మానవాళి దుఃఖాలతో బాధలను అనుభవిస్తూ ఉంటే, నేనిక్కడ ఉండి చేస్తున్నదేమిటి?" అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కాబట్టి వారు మరల జనుల మధ్యకు వచ్చి తమ జ్ఞాన మకరందాన్ని అందరికీ పంచి పెడతారు.

బుద్ధునికి నిర్వాణము పొందిన ముందు రోజున దుఃఖపూరితమైన మానవాళినుండి దూరంగా పోవాలనే భావన కలిగింది. మారా అనబడే దుర్భోదకుడు, బుద్ధుని నిర్వాణం లోకి వెళ్ళకుండా అనేక ప్రయత్నాలు చేసేడు. బుద్ధుని ఇంద్రియాలను ఐహిక సుఖాలవైపు త్రిప్పలేనని తెలిసికొని చివరగా ఇలా పలికెను: "మీరు నిర్వాణంలో సంపూర్ణమైన ఆనందం పొందేరు. ఈ స్థితిలోనే చిరకాలం ఉండిపోతే తిరిగి ప్రపంచానికి వెళ్ళనక్కరలేదు. ఒకవేళ వెళ్ళినా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకొంటారు? మీలాగా ఎవరు ప్రయత్నం చేస్తారు?" ఇది ఒక విచారకరమైన ప్రశ్న. ప్రతి జ్ఞానోదయమైన యోగికి ఈ ప్రశ్న కలుగుతుంది. బుద్ధుడు దానికి బదులుగా "బహుశా కొందరు నా బోధ విని, నన్ను నమ్మి, నేను చెప్పిన దాన్ని పాటిస్తారు" అని సమాధానమిచ్చెను.

ఇదే యోగులు కోరేది. వారు ధ్యానం గురించై సమస్త మానవాళి ఉత్సాహం చూపిస్తుందని తలచరు. ఎలాగైతే ఒక పద్మం వికసించినపుడు తుమ్మెదలు దాని వైపు వెళతాయో, శాశ్వతమైన సుఖాన్ని, భద్రతని కోరి, జనులు జ్ఞానోదయమైన యోగి పొందు కోరుతారు.

ఇలా జనుల మధ్యకు రావడం చాలా క్లిష్టమైన క్రియ. ప్రజల హృదయాలను తట్టి లేపాలంటే వారితో సహజీవనం చేసి, వారి వలె నిత్య కర్మలు చేసి, సదా దైవ చింతనలో ఉండాలి. అందుకే ఆధ్యాత్మిక జీవితం అంత కష్టం. బయట ప్రపంచం హింసాకాండతో, దుఃఖంతో నిండి ఉన్నా, దేహం లోపల కొలువై యున్న పరమాత్మ నిత్య ప్రకాశవంతంగా ఉంటాడు. 320

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...