Ramana Maharshi QuestionAnswers Part 1

అభ్యాసము



సాధన చేసే పద్దతి ఏమిటి?

ఆత్మజ్ఞానమును పొందదలిచే వాని
ఆత్మ స్వస్వరూపముకన్నా వేరుగా లేదు.
ఆత్మ కన్నా గొప్ప విషయము లేదు. ఎందుకంటే
ముక్తి కోరువాడు ఆత్మ జ్ఞానము వాని సహజ స్థితిని తెలపేదని
తెలిసికొ౦టాడు. దానిపై ఎటువంటి సంశయాలు,
అనుమానములు ఉండవు. అతడు క్షణికమైన,
శాశ్వతమైన వాటి మధ్య భేదము ఏమిటో తెలిసికొని తన
సహజ స్థితియందు నిలిచి ఉంటాడు. దీనినే
జ్ఞాన సాధన అనికూడా అంటారు. ఈ విధంగా
ఆత్మ జ్ఞానాన్ని పొందడం జరుగుతుంది.


ఇతర పద్దతులు ఏమిటి?

అవి:


  1. స్తుతి: భక్తితో దేవుని కీర్తించుట లేదా గానము చేయుట
  2. జపం: దేవుని మంత్రాలు లేదా నామాలు
    మనస్సులో గాని, బయటకు గాని వల్లించుట
  3. ధ్యానము: జపం లాగే దేవుని మంత్రాలు లేదా
    నామాలు భక్తితో వల్లిస్తూ, మనస్సుని బాహ్య
    విషయాలనుండి మరల్చి అంతర్ముఖమవుట
  4. యోగ: మనస్సు, శ్వాస యొక్క మూలము
    ఒక్కటే. కాబట్టి శ్వాస నియంత్రణ ద్వారా --
    ప్రాణాయామము ద్వారా-- మనస్సుని
    ధ్యానం యందు కేంద్రీకరించుటను యోగ అంటారు
    సహస్రారమందు, చక్రాలయందు మనస్సుని
    నిలిపి యోగి ఆనందంతో ఎంతో సమయం
    ఉంటాడు. కానీ మనస్సు లేచినప్పుడు
    మళ్ళీ ఆలోచనలతో సతమతమవుతాడు.
    కావున ధ్యానముతో యోగ చేయడం ఉత్తమం.
  5. జ్ఞానము: ఈ మార్గంలో మనస్సుని ఆత్మతో
    అనుసంధానము చేసి ధ్యానము లేదా
    ఆత్మ విచారణతో దానిని నశింపజేస్తారు. మనస్సు
    నశిస్తే అన్ని కర్మలు కనుమరుగవుతాయి.
    ఇలాగ తమ సహజస్థితిని ఎన్నటికీ పోగొట్టుకోరు.
    మౌనము లేదా కర్మల విసర్జనము కూడా
    జ్ఞాన మార్గమని చెప్పబడతాయి.


నిశ్చలంగా ఉండడం ప్రయత్నంతో
కూడి ఉంటుందా?

అది అప్రయత్నంగా లేదా సులభంగా
వచ్చే స్థితి కాదు. అన్ని కార్యాలనూ మనస్సు
కొంత పెట్టి ప్రయత్నం చెయ్యాలి. మధ్యమధ్యలో
విరామం తీసికోవాలి. కానీ ఆత్మతో
అనుసంధానము లేదా అంతరంలో
నిశ్చలంగా ఉండడం చాలా తీవ్ర
ప్రయత్నం వలననే సాధ్యం. దానికై
మనస్సునంతా ఉపయోగించి విసుగు
విరామం లేకుండా సాధన చెయ్యాలి.

మామూలుగా మాయను జయించడం
అసాధ్యం. కానీ మౌనంతో సాధన చేస్తే
మాయను జయించవచ్చు.


మాయ యొక్క స్వభావమేమిటి?

మాయ ప్రభావము వలన సర్వాన్ని
వ్యాపించిన--అంటే స్వయం ప్రకాశం,
జీవనాధారం, జగత్తుకు ఆధారం, చివరకు
భగవంతుని గురించి జ్ఞానమునకు ఆధారమైన--
ఆత్మ లేదనే భావన కలుగుతుంది.
నిజానికి మాయకి ఉనికిలేదు.


ఆత్మ స్వప్రకాశమైనది అయినా
అందరూ అది తక్కిన వస్తువులులా ఎందుకు
చూడరు?

మనకి ఒక వస్తువు గురించి జ్ఞానము
కలగాలంటే ఆత్మ వాటిని వ్యాపించి
ఉండాలి. కేవలం ఆత్మ శక్తితోనే
వస్తుజ్ఞానము కలుగుతుంది. ఆత్మ
ఒక్కటే జ్ఞానము కలది. తక్కినవాటికి
జ్ఞానము లేక తమను తాము తెలిసికోలేని
స్థితిలో ఉంటాయి. కాబట్టి ఆత్మ తన
స్వస్వరూపాన్ని తెలిసికోలేకపోతే
జనన-మరణ చక్రములో పడి అనేక
బాధలనుభవిస్తూ జీవాత్మ గా
వ్యవహరిస్తుంది.


జీవుడు దేవుని దయలేకపోతే
ఆత్మ జ్ఞానాన్ని ఎలా పొందగలడు?

దేవుడు సర్వజ్ఞుడు. ఒక గుడ్లగూబ
పగలు చూడలేకపోతే దానికి
కారణం సూర్యుడు కాదు. అలాగే
ఆత్మ జ్ఞానము లేనివారు ఆత్మతో
అనుసంధానము కాలేకపోతే
దానికి కారణం వారే. దేవుడు స్వతహాగా పరమ
దయాళువు. అందువలన దేవుడు
ప్రయత్నంతో తన దయను
ప్రదర్శించనక్కరలేదు. అలాగే
ఒక నిర్ణీత సమయంలో దేవుని
దయ కలుగుతుంది అనడం కూడా
తప్పు.


శరీరంలో ఆత్మ ఎక్కడ స్థితమై ఉంటుంది?

ఆత్మ ఛాతీలో కుడివైపు స్థితమై ఉంటుంది.
ఎందుకంటే మన౦ "నేను" అని తెలపడానికి
మన కుడి ఛాతీ పై చెయ్యి వేసి చెప్తాం.
కొందరు సహస్రారము ఆత్మ యొక్క స్థానమని
అంటారు. అలాగైతే నిద్ర పోయినప్పుడు
లేదా సొమ్మసిల్లి నప్పుడు తల
ముందుకి వాలకూడదు.


హృదయం యొక్క స్వభావమేమిటి?

మన పురాణాలు ఛాతీ మధ్యలో ఆరు
అవయవాలు వివిధ రంగులతో
ఉంటాయని చెప్తాయి. వాటిలో తలక్రిందలుగా
ఉన్న కలువ హృదయం అని చెప్పబడుతుంది.
దాని మధ్యలో అజ్ఞానమనే చీకటి
అనేకమైన కోరికలు కలిగి ఉంటుంది.
నాడీ వ్యవస్థకు అదే ఆధారం. ముఖ్య
శక్తులకి, మనస్సుకి, తెలివికి అదే ఆధారం.

అలా చెప్పినప్పటికీ హృదయమే
ఆత్మ స్థానం. దాన్నే సత్, చిత్, ఆనందం,
నిత్యం, పూర్ణం అంటాము. దానికి
అంతర్బాహ్య లేదా మీదా క్రి౦ద అనే
భేదాలు లేవు. నిశ్చలమై, ఆలోచనలు
లేకుండట ఆత్మ యొక్క స్థితి. అలా
భావిస్తే శరీరంలో ఏ భాగంలో
ఉంటుందనే ప్రశ్నను విశ్లేషించ
నక్కరలేదు.


బాహ్య వస్తువులతో సంబంధ౦
లేక పోయినా మనస్సులో ఎందుకు
అనేకమైన ఆలోచనలు వస్తాయి?

దానికి కారణం పూర్వ సంస్కారాలు.
ఆత్మ జ్ఞానము లేని జీవుడు బహిర్ముఖుడు
కావటం వలన. మనస్సులో ఆలోచనల
అలజడ కలిగితే, "ఎవరు వాటిని చూసేవారు?"
అనే ప్రశ్న వేసుకొంటే, అవి మాటు
మాయమవుతాయి.


త్రిపుటి (దృష్టి-దృశ్యం-ద్రష్ట) సుషుప్తిలో
లేదా సమాధిలో లేక వేకువ మరియు
నిద్రావస్థలలోనే ఎందుకు ఉంటుంది?

ఆత్మ నుండి ఇవి లేస్తాయి:


  1. చిదాభాస : ఒకరకమైన ప్రకాశం
  2. జీవుడు: అన్ని దృశ్యాలను చూసేవాడు
  3. దృశ్య ప్రపంచము


ఆత్మ జ్ఞానానికి, అజ్ఞానానికి అతీతమైనప్పుడు
దేహంలో వ్యాపకమై, ఇంద్రియాలు
పనిచేయుటకు ఎలా తోడ్పడుతుంది?

జ్ఞానులు నాడీ వ్యవస్థ, ఆత్మ
హృదయ గ్రంధి వద్ద కలుస్తాయని అంటారు.
ఈ విధంగా కలిసిఉన్న జ్ఞానము, అజ్ఞానములను
ఛేదించాలి. విద్యుత్చ్ఛక్తి ఏ విధంగా
అనేక పరికరాలను వెలిగించి లేదా
పని చేయిస్తుందో ఆత్మ కూడా దేహాన్ని,
ఇంద్రియాలను వ్యాపించి వాటిని
పనిచేయిస్తుంది. హృదయ
గ్రంథిని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదిస్తే
ఆత్మ దానిపాటికది నిర్గుణమై ఉంటుంది.


శుద్ధ జ్ఞానస్వరూపమైన ఆత్మకి,
త్రిపుటితో పరస్పర సంబంధము ఎలా
సాధ్యం?

ఒక సినిమాను చూడండి: చలన
చిత్రాలు తెరపై భూతద్దం ద్వారా
ప్రదర్శింపబడతాయి. అలాగే
పూర్వ సంస్కారాలు ఉన్నంత వరకూ
మెలకువ మరియు నిద్రావస్థలలో
జగత్తనే దృశ్యం కనపడుతూ ఉంటుంది.
ఎలాగైతే భూతద్దం ఫిల్మ్ పైనున్న
చిన్న చిన్న దృశ్యాలను పెద్దవి
చేసి చూపిస్తుందో, మనస్సు సంస్కారాలను
పెద్ద వట వృక్షాలలాగ పెద్దవి చేసి
చూపిస్తుంది. ఎలాగైతే కాంతి
ముందు ఫిల్మ్ లేకపోతే తెరపై
దృశ్యాలు ఉండవో,
ఆత్మ సుషుప్తి, మూర్ఛ, సమాధి స్థితులలో
సంస్కారములు లేనందున త్రిపుటి లేక
శుద్ధ జ్ఞాన స్వరూపమై ఉంటుంది. ఎలాగైతే
కాంతి ఫిల్మ్, భూతద్ద౦లతో ఎటువంటి
సంబంధంలేకుండా ఉంటుందో, ఆత్మ
చిదాభాస మొదలగు వాటిని ప్రకాశింప
జేసి అసంగంగా ఉంటుంది.


ధ్యానమంటే ఏమిటి?


స్వస్వరూపంతో ఉంటూ సహజ స్థితిని
కోల్పోకుండా, ఎటువంటి స్పృహ లేకుండా
చేసేదే ధ్యానం. ధ్యానం చేస్తున్నప్పుడు
వివిధ స్థితుల -- అనగా వేకువ,
నిద్ర, మొదలైనవి--స్పృహ లేనందున
జపం చేస్తూ ఉన్న
నిద్రావస్థ కూడా ధ్యానమనబడుతుంది.


ధ్యానానికి, సమాధికి తేడా ఏమిటి?

ధ్యానం మనస్సుతో ప్రయత్నపూరకంగా
చేయబడుతుంది. సమాధి అప్రయత్నంగానే
కలుగుతుంది.


ధ్యానంలో గుర్తు పెట్టుకోవలసిన
అంశాలు ఏమిటి ?

ధ్యానంలో ఆత్మ నిష్ఠ కలిగి, ఎటువంటి
బాహ్య విషయాల యందు స్పృహ లేకుండా
ఉండాలి. అలాకాక ఉంటే వింత శబ్దాలు,
కాంతులు మనస్సులో చూడవచ్చు.
అది సహజస్థితి కాదు.


సాధకుడు పాటించవలసిన నియమాలేమిటి?

మితాహారం, తగినంత మాత్రమే నిద్ర, వాక్కు
నియంత్రణ


సాధన ఎంత కాలం చెయ్యాలి?

మనస్సు అప్రయత్నంగా ఆలోచనలను
నియంత్రించలేక, నేను, నాది అనే భావనలను
తొలగనంత కాలం సాధన చెయ్యాలి.


ఏకాంత వాసమంటే ఏమిటి?

ఆత్మ సర్వవ్యాపకమైనందున దానికి
ఏకాంత స్థలం లేదు. కాబట్టి మనస్సులో
ఎటువంటి ఆలోచనలు లేకపోవుట ఏకాంత
వాసం.


వివేకానికి చిహ్నం ఏమిటి ?

ఒకమారు సత్యాన్ని తెలిసికొన్న
తరువాత భ్రమలో పడకుండుట.
బ్రహ్మన్ కి, మనకి తేడా తెలిసినంత
వరకూ వివేకం ఉదయించలేదు.
అలాగే దేహమే ఆత్మ అనే భావన
ఉన్నంతవరకూ అవివేకామే.


అంతా ప్రారబ్ద కర్మాచరణమైనప్పుడు
ధ్యానానికి కలిగే విఘ్నాలను తొలగించు
కోవడం ఎలా?

ప్రారబ్దం బాహ్య విషయాలయందు
ఆసక్తి కలవారికే ఉంటుంది. అంతర్ముఖులై
ఉన్నవారిని అది బాధించదు. ఎవరైతే
తమ స్వస్వరూపాన్ని దర్శించడానికి
సాధన చేస్తూ ఉంటారో వారు ఎటువంటి
విఘ్నాలకూ భయపడరు.


ఆత్మ నిష్ఠకు సన్యాసం అవసరమా ?

దేహాన్ని విస్మరించడానికి ఒక కారణం
ఆత్మజ్ఞానాన్ని పొందడ౦. పరిపక్వమైన
ఆలోచనలు, విచారణలు మాత్రమే
దేహాభిమానాన్ని లేకుండా చేస్తాయి.
బ్రహ్మచర్యం, గృహస్తు, సన్యాసము
మొదలైన ఆశ్రమాలు కావు. ఎందుకంటే
మనస్సులో దేహాభిమానము అంతర్గతంగా
ఉంది. కానీ ఆశ్రమాలు బాహ్యంగా ఉన్నాయి.
మనస్సులోని బంధాలు అనాలోచితంగా
ప్రవేశిస్తే, ఒక్క ఆత్మ విచారణే వాటిని
తొలగించగలదు. కానీ సన్యాసం
వైరాగ్యాన్ని కలిగించి, ఆత్మ విచారణ వైపు
నడిపిస్తే, సన్యాశ్రమం తీసికోవడం
ఒక విధంగా మంచిదే. అలా కాకపోతే
గృహస్తు ఆశ్రమమే ఉత్తమం. స్వస్వరూప
అనుసంధానం జరగాలంటే సంకల్ప,
వికల్పాలనుండి విడిపడడం
-- అంటే మనస్సులో కుటుంబాన్ని త్యజించడం -- వలననే
సాధ్యం. అదే నిజమైన సన్యాసం.


కర్తృత్వం ఉన్నంత వరకూ ఆత్మ జ్ఞానము
పొందలేము కదా. అలా౦టప్పుడు గృహస్తు
కర్తృత్వ భావన లేకుండా కర్మలను
ఆచరించగలడా?

కర్మ కర్తృత్వ భావన వలననే జరగాలని
ఎక్కడా రాసిపెట్టి లేదు. ఉదాహరణకు:
ఒక బ్యాంక్ ఉద్యోగి లక్షల, కోట్ల డబ్బును
లెక్కపెట్టినంత మాత్రాన, ఆ సొమ్ము తనకు
దక్కుతుందనే భావన కలిగి ఉండడు.
అలాగే ప్రారబ్దవసాన చేయవలసిన
కర్మలను ఒక గృహస్తు కర్తృత్వ భావన
లేకుండా చేయగలడు. తాను భగవంతుని
పని ముట్టు మాత్రమే అనుకున్నంత కాలం
కర్మ మరియు జ్ఞానము పరస్పర
విరుద్ధములు కావు.


ఎటువంటి సుఖాలు, ప్రతిఫలము ఆశించని గృహస్తుకి
కుటుంబం అవసరమా?

తనకు ఎటువంటి సుఖాలూ అక్కరలేకపోయినా
గృహస్తు ప్రారబ్దవసాన కర్మలు చేస్తూ తన
కుటుంబాన్ని పోషిస్తాడు. దానిని మానవ సేవ
అనవచ్చు. ఒక వివేకవంతుడైన గృహస్తు తన
కుటుంబంద్వారా సంతోషములు, సుఖములు
అనుభవి౦చి, కుటుంబాన్ని ఉద్ధరిస్తే తాను ఉన్నత శిఖరాలను
చేరినట్టే. అటు తరువాత కుటుంబ ఉద్ధరణకు అతడు
చేయవలసినది ఏమి లేదనే జ్ఞానము ఉదయించి
దానిని కూడా త్యజిస్తాడు.


నివృత్తి -- అంటే కర్మలు చేయకుండుట--
మరియు మనశ్శాంతి కర్మలు చేయవలసిన గృహస్తు
ఎలా పొందగలడు?

వివేకవంతుని కర్మలు ఇతరులకు పెద్దవిగా
కనిపించవచ్చు. కానీ తన దృష్టిలో వివేకవంతుడు
కర్తృత్వము లేనివాడు. కాబట్టి నివృత్తి మరియు
మనశ్శాంతికి వాని కర్మలు అడ్డంకులు కావు.
వానికి తాను కర్మలకు సాక్షి మాత్రమే అని తెలుసు.


ఒక జ్ఞాని యొక్క పూర్వ కర్మలు ప్రారబ్దంగా
పరిణమించినప్పుడు, ప్రస్తుత కర్మల వాసనలు
భవిష్యత్ కాలంలో వెంటాడతాయా?

అన్ని వాసనలు అధిగమించినవానినే
జ్ఞాని అంటారు. కర్తృత్వము లేక, కర్మ, వాసనలకు కేవలము
సాక్షిగా ఉన్నవానికి వాటివలన ఎలా
ప్రభావితుడవుతాడు?


బ్రహ్మచర్యమంటే ఏమిటి ?

బ్రహ్మన్ గురించి విచారణ చెయ్యడమే
బ్రహ్మచర్యం


బ్రహ్మచర్యాశ్రమము వలన జ్ఞానము పొందవచ్చా?

బ్రహ్మచర్యంలో ఇంద్రియ నిగ్రహణ మొదలగు
సాధనాలు ఉండడంవలన, బ్రహ్మచారుల
సాంగత్యముతో జ్ఞానాన్ని పెంపొందుకోవచ్చు.


బ్రహ్మచర్యం నుంచి సన్యాసం నేరుగా
తీసుకోవచ్చా?

సాధకులు బ్రహ్మచర్యం తీసికోవాలనే
నిబంధన లేదు. వారు ప్రతిభ కలవారైతే
వివిధ ఆశ్రమాలను దాట నక్కరలేదు.
దాని వలన ఎటువంటి దుష్పరిణామములు
కలుగవు.


సాధకుడు కుల వృత్తులు పాటించక
పోతే ఏమైనా నష్టమా?

జ్ఞాన మార్గము ముక్తికై అన్ని మార్గాలకన్నా
ఉత్తమమైనందున, జ్ఞాని జ్ఞాన సముపార్జన
చేస్తూ తన కుల వృత్తులను లోక కళ్యాణమునకై
చేస్తాడు. కానీ తనకు ఎటువంటి లాభాన్నీ
కోరడు. అలాగే అవి చేయకపోవడం వలన
ఎటువంటి నష్టాన్నీ పొందడు.

Comments

Popular posts from this blog

Lalita Sahasra Naamaalu

Syamala Dandakam

Ramana Maharshi Index