Sunday, January 22, 2023

Ramana Maharshi Chapt 7

భగవంతుని ధ్యానము


నిర్గుణ పరమాత్మను ప్రార్ధించుటకు
కారణము "అహం బ్రహ్మోస్మి" అనే
సత్యాన్ని తెలిసికోవడానికి. "నేను
బ్రహ్మన్" అనుకునే ధ్యానం త్యాగం,
కామం, నియమనిష్ఠలు, యోగ,
పూజ మొదలగువాటితో కూడినది.

ధ్యానం నిర్విఘ్నంగా సాగాలంటే
మనస్సుని బాహ్య విషయాల
నుండి మరల్చి ఆత్మ వైపు తిప్పాలి.
దానివల్ల బాహ్య విషయాలకు తటస్థంగా
ఉంటాము. ఇది తప్ప వేరే మార్గం లేదు.

ఒక్క రెప్పపాటు కాలంలో కూడా ఆత్మను
మరువకూడదు. మనస్సుని ఆత్మ లేదా
హృదయము నందు నిశ్చలంగా ఉంచడం
యోగ, ధ్యానం, జ్ఞానం, భక్తి, పూజల యొక్క
పరాకాష్ఠ.

పరమాత్మ ఆత్మ రూపేణా మన హృదయంలో
వసిస్తాడు కనుక, సదా ఆత్మయందు శరణాగతి
కలిగివుంటే అది అన్ని పూజలకన్నా మిన్న.

మనస్సు జీవ చైతన్యం. అజ్ఞానులు అది
ఒక సర్పంలా చుట్లు చుట్టుకొని వెన్నెముక
క్రిందన ఉంటుందని అంటారు. అదే కుండలిని.
ఆరు చక్రాలు యోగాలో పరిపక్వం లేనివారి
గురించి చెప్పబడినవి. మనం బాహ్యంగా
విగ్రహారాధన ఎందుకు చేస్తామంటే
మన అంతర్గతంలో పూజ చెయ్యడం
తెలియదు కనుక. ఆత్మ జ్ఞానము వలన
సర్వము తెలియబడి, జ్ఞానము పూర్ణమవుతుంది.

ఆత్మ విచారణ, అంటే దైవము యొక్క విచారణ,
చేస్తే మన ఆలోచనలు నియంత్రింపబడతాయి.
చివరికి దానిని కూడా మనస్సులోనుంచి
తీసేస్తే మనల్ని బహిర్ముఖము చేసేవన్నీ
బాధించక పరమాత్మ పూర్ణ చైతన్యము
మన మనస్సులో దర్శింపబడుతుంది.
ఇదే ముక్తి.

సదా పూర్ణమైన ఆత్మ విచారణ, యోగ,
జ్ఞానము, మతపరంగా చేసే కార్యాల
లక్ష్యం. మనస్సు బహిర్ముఖమైనప్పుడు,
ఆత్మను మరిచిపోతే మనము
జాగురూకతతో ఉండి "నేను దేహాన్ని
కాను; నేను మరి ఎవ్వరిని?" అని
విచారణ చెయ్యాలి. తద్వారా
మనస్సు తన స్వచ్చ స్థితికి తిరిగి
వస్తుంది.

"నేను ఎవ్వరిని?" అనే విచారణ
ఒక్కటే ఈతి బాధలను తొలగిస్తుంది.
ఇదొక్కటే ముక్తికి మార్గం.


Ramana Maharshi Chapt 6

పరమాత్మ జ్ఞానము



మనస్సు అహంకారం దాల్చి,
శరీరాన్ని ఆత్మగా భావించి,
బాహ్య౦గా ప్రసరించి నప్పుడు,
దానిని హృదయ౦ను౦చి సమూలంగా తీసివేసి,
నేను అనే భావనను నియంత్రించి, విచారణ చేస్తే,
"నేను-నేను" అనే ఒక సున్నితమైన అనుభవము
వస్తుంది. అదే హృదయ కమలంలో,
పట్టణమనే శరీరంలో విరాజిల్లే ఆత్మ.
అదే పరమాత్మ కూడా. అప్పుడు మనము
మనస్సు నిశ్చలం చేసి, ఆత్మను అన్నిటిలోనూ--
బాహ్యంలో లేదా అంతరంగ౦లో -- ప్రసరింపజేసి,
సర్వవ్యాపకమైనదిగా, అన్నిటినీ అధిగమించే
పదార్థమైనదిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి.
దీన్నే "శివోహం" అనబడే ధ్యానం అంటారు.
నేను శివుడను అనే భావనను నాల్గవ స్థితిగా
భావించాలి.

ఇటువంటి సున్నితమైన భావనే అనేక రీతులుగా
తెలియబడే భగవంతుడు: నాల్గవ స్థితికి అతీతం;
సర్వాంతర్యామి; హృదయంలో దీపంగా విరాజిల్లే
పరమాత్మ; ఏకాగ్రత మరియు ధ్యానంలో
తెలిసికొనబడేవాడు; అష్టాంగ పథంలో ఆరు మరియు ఏడవ
మెట్టు; హృదయాకాశంలో ప్రతిష్ఠి౦పబడినవాడు;
పరిశుద్ధమైన చైతన్యం; ఆత్మ స్వరూపం;
పరిపూర్ణమైన ఆనందం; సమస్త జ్ఞానం గలవాడు.

"నేను పరమాత్మను" అనే భావనతో
దీర్ఘమైన కాలం, సదా ధ్యానం చేస్తే హృదయాన్ని
కప్పిపుచ్చిన అజ్ఞానం తొలగి, సుస్థిరమైన
జ్ఞానోదయం కలుగుతుంది. ఈ విధంగా హృదయ
కమలంలో సత్యాన్ని దర్శించి, శరీరమనే
పురంలో ఉండేది పరమాత్మే అని గ్రహించాలి.
అట్టి పరమాత్మ అన్ని జీవులలోనూ ఉన్నాడు.
ఎందుకంటే హృదయమే అన్నిటికీ మూలం.

మన వాఙ్మయం ఇలా దాని గురించి చెప్పింది:
"ఒక ఋషి నవ ద్వారాలతో కూడిన శరీరంలో
తన్మయత్వముతో ఉంటాడు"; "శరీరం
ఒక గుడి; అక్కడ పూజింపబడేది ఆత్మ.
'నేను పరమాత్మను' అనే భావంతో
ఆ గుడిలో పూజిస్తే ముక్తి తప్పక
ప్రాప్తిస్తుంది. పంచకోశాలతో కూడుకొన్న
శరీరంలో గుహ్యంగా ఒకటుంది. అదే
హృదయాంతరిక్షం; అదే అన్నిటినీ
అధిగమించే పరమాత్మ యొక్క స్థానం. "

ఈవిధంగా పరమాత్మను తెల్పేదాన్ని
దహర విద్య అంటారు. దాన్ని
సూటిగా, తత్ క్షణమే అనుభవంలోకి
తెచ్చుకోవచ్చు.


Ramana Maharshi Chapt 5

పరమాత్మ


సర్వత్రా సత్యమైన సిద్ధాంతం:
మనలోని ఆలోచనలు, ప్రపంచంలోని
వస్తువులతో అనుసంధానమై ఉంటాయి.
ఆ ఆలోచనా సమూహాలనే మనస్సు అంటారు.
కనుక, దేహం, బాహ్య ప్రపంచం నిజానికి
మనస్సులోని ఆలోచనలు. హృదయమే
అన్ని వస్తువుల ఆవిర్భావమునకు ముఖ్య
కారణం. అటువంటి హృదయ మధ్యలో,
అనగా మనస్సు విస్తీర్ణంలో, "నేను" అనే
దివ్య చైతన్యం వశిస్తోంది. అది అన్ని జీవులలోనూ
అంతర్గతమై సర్వమునకు సాక్షియై ఉంది.
అదే వేకువ, కల, సుషుప్తి లకు ఆవల ఉండే
నాల్గవ అవస్థ

అపరిమితమైన సృష్టిలో ఆత్మ సత్యమై,
నిత్యమై, అన్ని జీవులలోనూ "నేను"
అనే స్ఫురణను, చైతన్యమును కలిగిస్తుంది.
నాల్గవ అవస్థకి ఆవల ఉండేది పరమాత్మ
చైతన్యము. అదే నాల్గవ స్థితిని
వెలుగుతో నింపుతోంది. అది ఒక దీపం లోనీ నీలి
మంటనుండి, విస్తారమైన ప్రపంచం వరకు
వ్యాపించే కాంతి వలె ఉంది.
సత్యమైన అవస్థ అనగా
సర్వత్రా కాంతితో నింపే దీపం యొక్క
సర్వ వ్యాపాకత్వము. కాంతిని విస్మరిస్తే,
అహంకారంలేని అవస్థే సత్యమైనది.
ప్రతిఒక్కరు "నేను" అని చెప్పినపుడు
తమ ఛాతీపై చెయ్యివేసి చెప్తారు. ఇదే
పరమాత్మ మన హృదయంలో ఉన్నాడనే
నిజానికి ప్రమాణం.
హృదయంలో "నేను-నేను"
అనే స్ఫురణను ప్రక్కనబెట్టి, ఆత్మను
బాహ్యంలో వెదకడం, ఒక విలువైన వజ్రాన్ని
గులక రాయి కోసం వదులుకోవడం వంటిదని
వశిష్ఠ మహర్షి అన్నారు. వేదాంతులు సృష్టి పరిపాలన
-- ఆవిర్భావము, స్థితి, లయము--చెయ్యడానికి
అనేక దేవతలు -- గణపతి, బ్రహ్మ, విష్ణు,
రుద్ర, మహేశ్వర, సదాశివ --అనవసరమని
నమ్ముతారు.

Ramana Maharshi Chapt 3-4

సృష్టి




స్మృతులు, శ్రుతుల ముఖ్య ఉద్దేశం
ప్రపంచం మిథ్య, బ్రహ్మన్ సత్యం
అని చెప్పడం. అందుకే సృష్టి
క్రమం చెప్పబడినది. దానిలో
త్రిగుణములతో కలిసి పంచభూత
సృష్టి ఎలా జరగబడినదో తెలపబడింది.
సృష్టి ఒక కలలా ఉండి, ఆ కలలో
ఆత్మను కప్పిపుచ్చి లేనిపోని ఆలోచనలు
కలుగుతాయి. సత్యం తెలపడానికి
సృష్టి మిథ్య అని చెప్పబడుతుంది.
అది జ్ఞానులకు బాగా ఎరుక.


ఆత్మ శుద్ధ చైతన్యం; అన్నిటినీ
గ్రహిస్తుంది; సర్వ ద్రష్ట. అహంకారం,
మనస్సు మొదలగునవి ఆత్మ సాధనాలు.
ఆత్మ వేరొకరికి దృశ్యము కాలేదు. వేరొకరు
దానిని గ్రహించలేరు.

అహంకారం



మనస్సు అంటే "నేను" అనే భావన.
మనస్సు, అహంకారం ఒకటే. బుద్ధి,
అహంకారం, చిత్తం, మొదలగునవి కూడా
మనస్సే. ఒక వ్యక్తి తండ్రి, తమ్ముడు, అన్న,
ఉద్యోగి అని ఎలా పిలువబడుచున్నాడో
అలాగే మనస్సుని వేర్వేరు రకాలుగా
చిత్రీకరిస్తారు. మనస్సు ఆత్మానుభవము
పొందితే కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప
కడ్డీలా ఉంటుంది. ఆత్మకు వేరే సాక్షి
లేరు గనుక అహంకారమే ఆ పని చేస్తుంది.
ఎందుకంటే మనస్సు ప్రజ్వలమైన
చైతన్యానుభవము పొందినది కనుక.
ఆత్మ హృదయంలో ఎర్రగా కాలిన
కడ్డీ లోని అగ్నిలా అసంగమై ఉంటుంది.
కానీ అది ఎల్లలులేనిది. అది స్వయంప్రకాశం.
అన్ని జీవులలోనూ ఉండేది అది ఒక్కటే.
అద్వితీయం. దాన్నే పరమాత్మ అంటాం.


ఎర్రగా కాలిన ఇనుప కడ్డీ జీవి అయితే, అగ్ని
సర్వ సాక్షి అయిన ఆత్మ,; ఇనుప కడ్డీ అహంకారం.
శుద్ధమైన అగ్ని సర్వాంతర్యామి, సర్వజ్ఞమైన
పరమాత్మ.


Ramana Maharshi Chapt 2

మనస్సు


మన స్మృతి, శృతులలో మనస్సు గురించి
ఈ విధంగా చెప్పబడినది:


  • తినే పదార్థాలలో సూక్ష్మమైనది మనస్సును పోషించేది
  • ప్రేమ, క్రోధం, కామం, మదం మొదలగునవి దాని గుణాలు
  • ఆలోచన, బుద్ధి, కోరిక, అహంకారంలతో నిండినది
  • దానికి అనేక కార్యాలు చేసే శక్తి ఉన్నప్పటికీ, మనం
    చూసే జడపదార్థముల వంటిదే
  • అది జడమైనప్పటికీ, చైతన్యముతో అనుసంధానమైన
    కారణాన చైతన్యమువలె అనిపిస్తుంది; ఎలాగంటే ఒక కొలిమిలో ఇనుప
    కడ్డీని కాల్చడం వల్ల ఆ కడ్డీ ఎర్రగా రంగు మారడానికి
    కారణం అగ్నే; కానీ అగ్ని ఆ ఇనుప కడ్డీ యొక్క సహజ గుణం కాదు.
  • అది విచక్షణా జ్ఞానం కలిగి ఉన్నది
  • అది చంచలము; లక్క, బంగారముల వలె దాని
    రూపము సునాయాసంగా మారేది
  • అన్ని తత్వాలకు మూలమైనది
  • దృష్టి కంటిలో, వినికిడి చెవిలో ఉన్నట్టే
    అది హృదయంలో వశిస్తుంది.
  • అది జీవికి ప్రత్యేకతను ఇచ్చి బాహ్య వస్తువుల
    కనుగుణంగా ఆలోచనలు కలిగిస్తుంది
  • అది మెదడుతో నడపబడే పంచేంద్రియాలతో అనుసంధానమై
    "నేను ఫలానా దానిని అర్థం చేసికొన్నాను" అనే స్ఫురణను
    కలిగించేది

    ఒక పదార్థాన్ని తినవచ్చా అనే ఆలోచన మనస్సులో
    ఆవిర్భవిస్తుంది: "ఇది మంచిది. ఇది మంచిది కాదు.
    దీన్ని తినవచ్చు. దాన్ని తినకూడదు" అనే విచక్షణా
    జ్ఞానం మనస్సులో భాగమైన బుద్ధి వలన కలుగుతుంది. మనస్సే
    అహంకారం, దేవుడు, ప్రపంచము అనే త్రిపుటికి మూలం.
    మనస్సు ఆత్మలో లయమైతే దానిని కైవల్యం
    అంటారు. అది బ్రహ్మన్ ను పొందడం వంటిదే

    ఇంద్రియాలు బాహ్య వస్తువులపై ప్రసరిస్తే,
    మనస్సు అంతరంగంలో పని చేస్తుంది. బాహ్యము,
    అంతర్గతము అనే విబేధాలు శరీరానికి
    సంబంధించినవి. వాటికి పరమాత్మతో
    సంబంధం లేదు. మన శృతులు, స్మృతులు,
    ప్రపంచం మన హృదయ కమలంలో సూక్ష్మంగా
    ఉందని చెప్తాయి. నిజానికి అది ఆత్మ బోధ. అవిద్య,
    మాయ కారణాన నిద్రలో మనం అచేతనంగా
    ఉంటాము. సుషుప్తిలో స్థూల, సూక్ష్మ శరీరాలు
    ఆత్మలో లయమవుతాయి. అజ్ఞానము నుండి
    అహంకారం ఉద్భవించింది. అదే సూక్ష్మ శరీరం.
    మనస్సుని ఆత్మ వైపు త్రిప్పడానికి మనం
    సాధన చెయ్యాలి

    మనస్సు చేతనము. అది స్వతహాగా శుద్ధము,
    పారదర్శకము. కానీ ఆ శుద్ధ స్థితిలో అది మనస్సు
    అనబడదు. అపరిశుద్ధ మనస్సు వలన తప్పుడు
    ఆలోచనలు వస్తాయి. శుద్ధమైన మనస్సు, అనగా
    శుద్ధ చైతన్యము, తామసముతో కప్పబడితే
    స్థూల ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం
    కలుగుతుంది. అలాగే రజస్ తో కప్పబడితే
    అది దేహంతో తాదాత్మ్యం చెంది, "నేను"
    అనే అహంకారాన్ని ప్రదర్శించి, అదే సత్యం
    అని నమ్ముతుంది. రాగద్వేషాలతో
    కూడి అది మంచి లేదా చెడు కర్మలను ఆచరించి
    జనన-మరణ వలయంలో చిక్కుకొంటుంది. సుషుప్తిలో,
    మూర్చలో మనకు ఆత్మ గురించి ఎరుక ఉండదు.
    కానీ నిద్రనుండి మేల్కొనినప్పుడు, స్పృహ వచ్చినపుడు
    మనస్సు అనుభవంలోకి వస్తుంది. దాన్నే విజ్ఞానమని
    అంటారు. మనస్సుకి దానంతట దానికి ఉనికి లేదు.
    అది ఆత్మ వస్తువుపై ఆధారపడి ఉంటుంది. ఆత్మతో
    అనుసంధానమైనప్పుడు సుజ్ఞానమని అంటారు.
    అనాత్మతో అనుసంధానమైనప్పుడు అజ్ఞానము
    కలుగుతుంది. మనస్సు ఆత్మతో తాదాత్మ్యం
    చెంది ఆత్మవలె ప్రకాశించినప్పుడు అహం స్ఫురణ
    కలుగుతుంది. అది రాబోయే ఆత్మ జ్ఞానానికి
    సంకేతం. ఇదే ప్రజ్ఞానం. ఇదే వేదాంతంలో
    చెప్పబడిన "ప్రజ్ఞాన ఘన" అనే మహా వాక్యం.
    ఆది శంకరులు వివేకచూడామణిలో ఇలా చెప్తారు:
    "విజ్ఞానమయ కోశంలో సర్వమునకు సాక్షి, స్వప్రకాశమైన
    ఆత్మ భాసిస్తుంది. దాన్ని పొందడమే లక్ష్యంగా
    చేసుకో. అదే సత్యం. స్వానుభవంతో దానిని
    ఆస్వాదించు. అఖండమైన ఆలోచనా క్రమముతో
    దానిని ఆత్మగా తెలుసుకో"

    స్వయంప్రకాశంతో ఆత్మ ఒక్కటే సర్వత్రవ్యాపించి
    ఉన్నది. మూడు అవస్థల కాలాలు తప్పించి
    ఆత్మ శుద్ధము, నిశ్చలము. అది స్థూల, సూక్ష్మ,
    కారణ శరీరాలతో బంధింపబడనిది. అలాగే
    దృశ్యం, ద్రష్ట, దృష్టి అనే త్రిపుటి లేనిది.

    ఆత్మ వేకువలో కంటిలో స్థితమై ఉంటుంది.
    నిద్రలో మెడలో ఉంటుంది. సుషుప్తిలో
    హృదయంలో లయమవుతుంది. వీటిలో
    ముఖ్యమైనది హృదయం. అందుకే ఆత్మ
    మొదటి స్థానం హృదయమని చెప్పడం.
    కొందరు మనస్సు యొక్క స్థానం మెడ;
    బుద్ధి యొక్క స్థానం మెదడు; అహంకారం
    యొక్క స్థానం హృదయం అని చెప్తారు.
    కానీ బుద్ధి, అహంకారం మొదలగునవి మనస్సుకు
    సంబంధించినవే. సామూహికంగా వాటిని
    మనస్సు అనవచ్చు. అనేక ముని పుంగవులు,
    ఋషులు ఈ విషయంపై విచారణ చేసి
    "నేను" అనే స్ఫురణ హృదయంలోనే
    కలుగుతుందని చెప్పేరు.


Ramana Maharshi Chapt 1

నే నెవరిని ?


"నేను" వచనం అందరికీ సహజం.
"నేను వచ్చాను, నేను వెళ్ళాను,
నేను చేసాను" అనే మాటాలు తరచు
వింటాము. దాన్ని తరచి
చూస్తే, కదలికలు మొదలగు పనులు
దేహానికి సంబంధించినవి. "నేను" అనే
ఎరుక దేహానికి సంబంధించినదా?
దేహం పుట్టుక ముందు లేనిది; పంచ భూతాత్మకం;
నిద్రలో ఎరుక ఉండనిది; చివరకు
బూడిదలో కలిసి పోయేది.
"నేను" అనే భావనను అహంకారం, అజ్ఞానం,
భ్రమ, అశుద్ధం లేదా ఆత్మ అనవచ్చు.
మన స్మృతులు, శృతులు దాని మీదే
విచారణ చేసేయి. అవి చెప్పింది: అహంకారం
పోతేనే ముక్తి సాధ్యం. కాబట్టి ఎవరు దీనిని
తప్పు పట్టేది? ఎండు కర్రవలె జడమైన
శరీరం "నేను" అని భాసించగలదా? కాలేదు.
శరీరాన్ని అందుకే ప్రక్కన పెట్టి విచారణ
చేద్దాం. నిరంతరం సాగే ఆలోచనా ప్రవాహంలో,
అఖండమైన, నిశ్చలమైన, సహజమైన
"నేను,నేను" అనే ఎరుక హృదయంలో
కలుగుతుంది. దాన్ని పట్టుకొని, నిశ్చలంగా
ఉంటే, అది శరీరంలో "నేను" అనే భావనను
అంతం చేసి, చివరకు అదీ కర్పూర
హారతిలాగ కరిగిపోతుంది. ఋషులు,
గ్రంథాలు దీన్నే ముక్తి అంటారు.

అజ్ఞానమనే తెర ఎప్పటికీ ఆత్మను
కనుమరుగు చేయలేదు. అజ్ఞానులు కూడా
"నేను" అనే వాచకం వాడుతారు.
వారిలో "నేను ఆత్మను" లేదా
"నేను పరిశుద్ధమైన చైతన్యమును"
అనే సత్యాలను కప్పిపుచ్చి దేహంతో
తాదాత్మ్యం చెందుతుంది.

ఆత్మ స్వప్రకాశం. దాన్ని ఊహించే
ఆలోచన బంధానికి కారణం. ఎందుకంటే
ఆత్మ ప్రకాశం వెలుగు-నీడలను అధిగమిస్తుంది.
అందుకే మనస్సుతో దాన్ని పట్టుకోలేం.
ఆత్మ విచారణ భక్తి మార్గంలో ముక్తికి,
అనిర్వచనీయమైన ఆనందానికి దారి
తీస్తుంది. ఋషులు అటువంటి భక్తి
పూర్వక ఆత్మ విచారణ వలననే ముక్తి
సాధ్యమని ప్రవచించేరు. "నేను" అనే
ఆలోచనకు కారణమైన అహంకారం
భ్రాంతికి మూల కారణం. దాని నాశనం వలన
భ్రాంతి తొలగుతుంది. ఈ విధంగా
అహంకారాన్ని తొలగించుకునే మార్గాలను
భక్తి, జ్ఞాన, యోగ లేదా ధ్యాన మార్గాలంటారు.

"నేను దేహాన్ని" అనే ఎరుకలో స్థూల,
సూక్ష్మ, కారణ శరీరాలు, పంచ కోశాలు
ఉంటాయి. ఆ ఎరుకను తొలగిస్తే, అన్ని
ప్రతిబంధకాలూ వాటంతట అవే తొలగిపోతాయి.
స్మృతి, శృతులు ఆలోచనలే బంధాలకు కారణం
అని చెప్పడం వలన, ప్రతిబంధకాలను
వేరువేరుగా తొలగించనక్కరలేదు. చివరగా
మనస్సును "నేను" అనే ఆలోచనతో
ఆత్మకు దాసోహం అయి, నిశ్చలంగా ఉండి,
ఆత్మను ఎప్పటికీ మరచిపోక ఉండడం
ఉత్తమ పద్దతి.


Saturday, January 21, 2023

Atma Upanishat

ఆత్మ ఉపనిషత్

ఆత్మ ఉపనిషత్ పురుషుని మూడు విధములుగా వర్ణిస్తుంది. మానవుడు బాహ్య ప్రపంచంలోనూ, అంతరంగంలోనూ మెలగుతాడు. అనగా శరీరంలోనూ, మనస్సులోనూ చలిస్తాడు. తక్కిన ఉపనిషత్తులు లాగే ఆత్మ ఉపనిషత్ అంతరంగం గురించి చెప్పినపుడు: ఎరుకను సూక్ష్మంగా, లోతుగా మరియు కొంచెం హాస్యంగా వివరిస్తుంది. కనిపించే సృష్టికి ఆవలనున్న దాని గురించి ఎవ్వరికీ వర్ణింప శక్యము కాదు. కానీ దాని గురించి తెలిసికొనే ప్రయత్నము మిక్కిలి ఉత్కృష్టమైనది.

అంగిరశ ఉవాచ:

Sloka#1
పురుషుడు మూడు విధములుగా విరాజిల్లుతాడు:
బయట, లోపల మరియు బ్రహ్మంగా.
చర్మము, మాంసము, వెన్నెముక, జుట్టు, చేతి వేళ్ళు,
కాళ్ళ వేళ్ళు, చీల మండ, గోళ్ళు, కడుపు, బొడ్డు, తుంటి
ఎముకలు, తొడలు, బుగ్గలు, కనుబొమలు, నుదురు,
తల, కళ్ళు, చెవులు, చేతులు, రక్త నాళాలు,
నాడులు మున్నగునవి బాహ్యము.

Sloka#2
అంతరాత్మ బయట ప్రపంచాన్ని విశ్లేషిస్తుంది. అది
భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశంతో చేయబడినది.
అది ఇష్టాయిష్టాలకు, కష్టసుఖాలకు, భ్రమ మరియు అనుమానాలకు
లోబడి ఉంటుంది. దానికి భాష జ్ఞానము తెలుసు; నాట్యం, సంగీతం
మరియు లలిత కళలు అంటే ఇష్టం; ఇంద్రియాలు అందించే
సుఖాలను పొందుతుంది; గతాన్ని స్మృతికి తెచ్చుకొ౦టుంది;
గ్రంథాలను చదువుతుంది; అవసరమైతే కార్యం చేయడానికి
పూనుకొంటుంది.

Sloka#3
పురాణాల్లో వర్ణించే పరమాత్మను యోగ మార్గము
ద్వారా కూడా పొందవచ్చు. మర్రి విత్తనము కన్నా,
ఎటువంటి గింజ కన్నా , వెంట్రుకలో వెయ్యో
వంతు కన్నా సూక్ష్మమైన బ్రహ్మాన్ని పట్టుకోవడానికి
లేదా దర్శించడానికి సాధ్యంకాదు.

Sloka#4
పరమాత్మకి చావుపుట్టుకలు లేవు.
అతనిని కాల్చడానికి, కదల్చడానికి, పొడవడానికి,
ఖండించడానికి, ఎండబెట్టడానికి సాధ్యం కాదు.
ఆపాదించడానికి వీలు లేని ఆ పరమాత్మ సర్వానికి
సాక్షి, నిత్యము శుద్ధము, అఖండము, మిశ్రమము
కానివాడు. అతడు ఇంద్రియాలకు, అహానికి
పట్టుబడడు. ఆయనలో విభేదాలు, ఆశలు లేవు.
అతడు ఊహాతీతమై సర్వత్ర ఉన్నవాడు; అతడు
ఏ బాహ్య లేదా అంతర్కర్మా చేయడు; బాహ్యం
మరియు అంతరంగం నుండి విడిబడినవాడు;
పరమాత్మ అశుద్ధాన్ని పవిత్రం చేస్తాడు.

Viveka Sloka 38 Tel Eng

Telugu English All దుర్వారసంసారదవాగ్నితప్తం దోధూయమానం దురదృష్టవాతైః । భీతం ప్రపన్నం పరిపాహి మృత్యోః శరణ్యమన్యద్యదహం న జాన...